ఖిల్లాఘణపురం, జనవరి 30 : మండల కేంద్రంలోని గణపసముద్రం ముంపు గ్రామాల రైతులు పరిహారం చెల్లించాలని శుక్రవారం బస్టాండ్ ఆవరణం లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్లమాది రవీందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ తమ భూములు ముంపునకు గురై ఆర్థికంగా తీవ్ర నష్టపోయినప్పటికీ ప్రభుత్వం సరియైన పరిహారం, సహాయం అందించడంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే న్యాయపరమైన పరిహారం, పునరావాసం, రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సఖ్యంలో రైతులు, ప్రజాప్రతినిదులు, నాయకులు పాల్గొని ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.
అయితే గణప సముద్రం ముంపు రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, రైతులు ఒక గంట పోలీసుల అనుమతి తీసుకున్నప్పటికీ రైతులు సకాలంలో రాకపోవడంతో నిరసన కార్యక్రమం ఆలస్యమైంది. దీంతో పోలీసులు నిరసన చేపడుతున్న రైతులను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముంపు రైతులు, ప్రజాప్రతినిదులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.