ఆ పల్లె వాసులంతా పండ్లు, కూరగాయల సాగులో నిష్ణాతులు. చిన్న.. మొదలు మోతుబరి రైతు వరకు అందరూ అధికంగా సాగు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో సిరుల దిగుబడి వస్తుండడంతో ఉద్యాన పంటల వైపు అధికంగా మొగ్గు చూపుతున్నారు. ఏ రైతు పొలం వద్దకు వెళ్లినా ఈ సాగే కనిపిస్తుంది. ఊళ్లో దాదాపు 80 శాతం కర్షకులు వీటినే పండిస్తుంటే.. 20 శాతం రైతులు మాత్రమే ఇతర పంటలు వేస్తున్నారు. జామ, మామిడి, బొప్పాయి, నిమ్మ, మోసంబి,సపోట, ఆయిల్పాంతోపాటు మునగ, వంకాయ, చిక్కుడు, బీర, దోసకాయ, బెండ, టమాట, కాకర, సోరకాయ, కరివేపాకు పండిస్తున్నారు. మామిడి తోటలో అంతరపంటగా డ్రాగన్ఫ్రూట్ సాగు చేశారు. ఖాళీ పొలం లేకుండా పంటలు పండించి లాభాలు ఆర్జిస్తున్నారు. పండిన ఉత్పత్తులను ఏపీలోని కర్నూల్తోపాటు ఇతర ప్రాంతాల మార్కెట్కు తరలిస్తున్నారు. వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కుతూ దిగుబడులు పొందుతున్న ఇక్కడి అన్నదాతలు జోగుళాంబ గద్వాల జిల్లాకే ఆదర్శంగా నిలిచారు.
గద్వాల, జూలై 4 : పండించే పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి.. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందాలి.. రైతులు ఆర్థికంగా ఎదగాలి.. అన్న ఆలోచనతో ఆ గ్రామ కర్షకులు వినూత్న సాగుకు శ్రీకారం చుట్టారు. దీంతో నేడు కూరగాయలు, పండ్ల తోటల పెంపకంలో జిల్లాలోనే ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో రైతులకు మంచి రోజులు వచ్చాయి. సీఎం కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు పూర్తి చేసి పంటలకు నీరు పుష్కలంగా అందిస్తుండడంతో పాటు రైతులకు ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు అందుతున్నాయి. దీంతో వ్యవసాయం పండుగలా మారింది. ఈ క్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని శేషంపల్లి గ్రామం పండ్లు, కూరగాయల సాగులో ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందింది. ఏదైనా కొత్త పంట సాగు చేయాలన్నా ఇక్కడి రైతులు ముందుంటారు. వ్యవసాయంలో వారు కొత్త పుంతలు తొక్కుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
గ్రామంలో ఏ రైతు పంట పొలంలో చూసినా కూరగాయలు, పండ్లు, ఆకుకూరల తోటలే కనిపిస్తాయి. గ్రామంలోని సాగు భూమిలో 80 శాతం పండ్లు, కూరగాయల తోటలే కనిపిస్తాయి. ఈ పంటల సాగుతో వారికి తక్కువ పెట్టుబడి కావడంతోపాటు మూడేండ్లు ఆగితే నిరంతర లాభాలు వస్తాయనే ఆలోచనతో గ్రామంలోని రైతులు అందరూ పండ్ల తోటలు, కూరగాయల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ గ్రామానికి వెళితే.. ప్రతి పంట అక్కడ కనిపిస్తుంది. ప్రతి రైతు పొలంలో పండ్ల తోటలు లేదా కూరగాయల సాగే దర్శనమిస్తుంది. ప్రతి రైతు వారికి ఉన్న ఎకరా లేదా రెండు ఎకరాలు.. అంతకుమించి సాగు భూమి ఉంటే అందులో రెండు లేదా మూడు రకాల పండ్ల తోటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. రైతులు వారు సాగు చేసిన పండ్ల తోటల్లో అంతర పంటలు వేసి రెండు రకాలుగా ఆదాయాన్ని అక్కడి కర్షకులు పొందుతున్నారు.
శేషంపల్లి గ్రామ వివరాలు..
జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం శేషంపల్లి గ్రామంలో 159మంది రైతులు ఉన్నారు. మొత్తం వ్యవసాయ భూమి 550 ఎకరాలు ఉండగా.. 350 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేశారు. మరో 110 ఎకరాల్లో కూరగాయలు సాగు చేశారు. 50 ఎకరాల్లో వరి, పత్తి పంట వేశారు. మిగతా పొలం సాగుకు అనుకూలంగా లేకపోవడంతో బీడుగా వదిలేశారు.
తోటల వివరాలు
గ్రామంలో ఏ రైతు పంట పొలంలోకి వెళ్లినా పండ్లతోటలు, కూరగాయల సాగు కనిపిస్తుంది. గ్రామంలో రైతులు డ్రాగన్ఫ్రూట్, జామ, మామిడి, బొప్పాయి, నిమ్మ, మోసంబి, సపోట, పామాయిల్ తోటలు సాగు చేశారు. కూరగాయల పంటల్లో మునగ, వంకాయ, చిక్కుడు, బీర, దోసకాయ, బెండ, టమాట, కాకర, సోరకాయ సాగు, కరివేపాకు పండిస్తున్నారు. దీంతో పాటు డ్రాగన్ఫ్రూట్ తోటలో అంతర పంటగా మామిడిని సాగు చేశారు. ఇలా రైతులకు ఉన్న పొలంలో ఖాళీ ఉంచకుండా పంట సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. పండిన ఉత్పత్తులను ఏపీలోని కర్నూల్తోపాటు ఇతర ప్రాంతాల్లోని మార్కెట్కు తరలిస్తునారు. గ్రామంలోని రైతులను ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ వస్తుండడంతో పండ్లు, కూరగాయల సాగుపై ఆసక్తి చూపుతున్నామని సమాధానమిచ్చారు. పండ్ల తోటలను మూడు నాలుగేండ్లు కాపాడితే నిరంతరం ఆదాయం వస్తుందని తెలిపారు.
రూపాయికి.. రూపాయి మిగులుతుంది
నాకు మొత్తం ఏడు ఎకరాల పొలం ఉంది. ఎకరాలో కరివేపాకు, బెండకాయ, చిక్కుడు పంట సాగు చేశా. కరివేపాకు ఏడాది పొడువునా పంట వస్తుంది. మిగతా పంటలు మూడు నెలల వరకు కూరగాయలు కాస్తాయి. కూరగాయలు సాగు చేస్తే రూపాయి ఖర్చు చేస్తే మరో రూపాయి లాభం వస్తుంది. పెట్టుబడి తక్కువ ఉండడంతో పాటు ఆదాయం వస్తుండడంతో ఎక్కువగా కూరగాయల పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఆరు ఎకరాల్లో మామిడి తోట సాగు చేశా. ప్రస్తుతం దిగుబడి బాగానే ఉన్నది.
– ప్రభాకర్రెడ్డి, రైతు శేషంపల్లి
ఏడాదికి రూ.10 లక్షలకుపైగానే ఆదాయం
నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. అం దులో పావుదక్కువ రెండు ఎకరాల్లో 220 నిమ్మచెట్లు, మరో పావుదక్కువ రెండు ఎకరాల్లో 220 మోసంబి తోట సాగు చేశాను. సరాసరి ప్రతి ఏడాది రెండు తోట ల నుంచి ఖర్చలుపోనూ రూ.10 లక్షలకుపైగానే ఆదాయం వస్తుంది. దీంతోపాటు కరివేపాకు సాగు చేశాను. అ ది ఇంటి ఖర్చులకు సరిపోతుంది. మాది వ్యవసాయ కుటుంబం.. అందుకే నా కూతురిని అగ్రికల్చర్ బీఎస్సీ చేయిస్తున్నాను. పండ్లు, కూరగాయల సాగుతో పని తక్కువ.. ఆదాయం ఎక్కువగా వస్తుంది.
– గంగాధర్రెడ్డి, రైతు, శేషంపల్లి
పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ
నాకున్న పొలంలో మూడు ఎకరాలు పునాస మామిడి వేసా.. అందులో అంతర పంటగా డ్రాగన్ఫ్రూట్ పంట సాగు చేశా. పునాస మామిడి ఏడాదిలో రెండు కాతలు వస్తుంది. మూడేండ్లు పెంచా.. ప్రస్తుతం నిరంతరం ఆదాయం వస్తుంది. మరో ఆరు ఎకరాలు మామిడి, మూడు ఎకరాలు మోసంబి తోట వేశా.. అన్ని పంటలు చేతికి వచ్చాయి. పెట్టుబడి పోనూ ఏడాదికి రూ.6 లక్షల దాకా ఆదాయం వస్తుంది. మూడు లేదా నాలుగేండ్లు పంటను కాపాడుకుంటే నిరంతర ఆదాయం ఖాయం. అందుకే రైతులు ఆసక్తి చూపుతున్నారు.
– రమేశ్, రైతు, శేషంపల్లి
ఆర్థిక తోడ్పాటునిస్తుంది
నాకున్న 35 ఎకరాల్లో పునాస మామిడి 20 ఎకరాలు, జామ 5 ఎకరాలు, కీనో ఆరెంజ్ పండ్లతోటలు 10 ఎకరాల్లో సాగు చేశాను. వ్యవసాయంపై ఆసక్తి ఉండడంతో ఇతర వ్యాపారాలు ఉన్నా తోటల సాగుపై దృష్టి పెట్టాను. పునాస మామిడి చెట్నీకి ఉపయోగ పడుతుంది. ఇది రెండు కోతలు కోసుకోవచ్చు. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగం చేయడం కంటే వ్యవసాయం చేసుకుంటే మంచిదని ఈ రంగాన్ని ఎంచుకున్నా. పంటలు బాగా పండితే ఏడాదికి రూ.20 లక్షలకుపైగానే ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. పండ్ల తోటల పెంపకం రైతులకు ఆర్థిక తోడ్పాటునిస్తుంది. ఈ పంటల సాగు దీర్ఘకాలికంగా ఆదాయం అందిస్తుంది. మా గ్రామంలో రైతులు అందరూ పండ్ల తోటలపై ఎక్కువ ఆసక్తి కనబర్చుతున్నారు. జిల్లాలో పండ్ల తోటల పెంపకంలో మా గ్రామం ముందుంది.
– జగన్మోహన్రెడ్డి, శేషంపల్లి