మహ్మదాబాద్, మే 4 : వరి ధాన్యం కొనుగోలు కేంద్రా లు ప్రారంభించి 15 రోజులు అవుతున్నా ఒక్క బస్తా తూకం చేయడం లేదని రైతులు కన్నెర్ర చేశారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా తాండూరు, మహబూబ్ నగర్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వరి ధాన్యం బస్తాలను రోడ్డు పైకి తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా వేసి ఖాళీ బస్తాలకు నిప్పంటించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో టన్నుల కొద్ది వరి ధాన్యం వచ్చి చేరినా వాటిని తూకం చేయకుండా అలాగే ఉంచడంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
రైతుల ఆందోళనకు బీఆర్ఎస్, బీజేపీలు మద్దతు తెలిపి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దిడ్డికాడి గోపాల్ మాట్లాడుతూ సన్న రకాలకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని దొడ్డు రకాలు వేయాలంటూ ప్రభుత్వం సూచించడంతో రైతులు దొడ్డురకాలు వేసి కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తే దొడ్డు రకాలను కొనుగోలు చేయడానికి మిల్లర్లు ముందుకు రావడం లేదన్నారు. ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడటం సరైంది కాదని త్వరలో రైతులే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు.
పోలీసులు వచ్చి ఎంత వారించినా రైతులు వినకుండా రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ వచ్చి రైతుల సమస్యలు పరిష్కంచేంత వరకు కదిలేది లేదని భీష్మించి కూర్చుకున్నారు. ఎర్రటి ఎండ ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడంతో రైతులు శాంతించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని తాసీల్దార్ను ఆశ్రయించారు. తాసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి రైతులను, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు , ఏపీఎంను పిలిపించి సమస్యపై చర్చించారు. ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రంగంపల్లి రాంరెడ్డి, చింతకింది కేశవులు, బీజేపీ నాయకులు తిరుపతిరెడ్డి, కుర్వ కృష్ణ ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.