జడ్చర్ల, డిసెంబర్ 10 : ఆరుగాలం కష్టించి పంట పండించే రైతన్నకు కల్లాలు లేక అవస్థలు పడుతున్నాడు. చేతికొచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రోడ్లను ఆశ్రయిస్తున్నాడు. పంట నూర్పిడి తర్వాత ధాన్యాన్ని రోడ్లపై ఆరబెడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో వ్యవసాయ పొలాల్లోనే రైతులు కల్లాలను ఏర్పాటు చేసుకొని పంట నూర్పిళ్లు చేసి ఆరబెట్టేవారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు రావడంతో రైతులు వరికోత యంత్రాలతో కోతలు కోస్తున్నారు.
దీంతో ధాన్యంలో చెత్తాచెదారం తొలగిపోయి శుభ్రం అవుతుండడంతో కల్లాలను తయారు చేసుకోవడంలేదు. నేరుగా రోడ్లపైకి ధాన్యాన్ని తీసుకొచ్చి ఆరబెడుతున్నారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. రోడ్లపై వ్యవసాయ ఉత్పత్తులను ఆరబెట్టడం మూలంగా రైతులతోపాటు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్లపై సగబాగం వరకు ధాన్యం ఇతర ఉత్పత్తులను ఆరబెట్టడంవల్ల వేగంగా వచ్చే ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. ధాన్యం కుప్పలకు అడ్డుగా పెట్టే రాళ్లను గమనించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అలాగే ధాన్యం ఆరబోసే క్రమంలో రైతులకు ప్రమాదం తప్పని పరిస్థితి నెలకొన్నది. జడ్చర్ల-నసరుల్లాబాద్ రహదారితోపాటు గంగాపూర్-అల్వాన్పల్లి గ్రామాల మధ్యనున్న జాతీయరహదారిపై ప్రమాదభరితంగా ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.