తెలకపల్లి, నవంబర్ 21 : ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే కర్ణాటక వలే కష్టాల పాలవుతామని నాగర్కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. మండలంలోని గట్టునెల్లికుదురు, గట్టురావిపాకుల, పెద్దపల్లి, గడ్డంపల్లి, అనంతసాగర్ గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగునీరు అందించడం జరిగిందని, దీంతో సాగునీటి సమస్య తీరిందన్నారు. గతంలో ఈ ప్రాంతం పేదరికం, వలసలతో అల్లాడిందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగునీటిని అందిస్తూ రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఆసరా పింఛన్లతో వృద్ధులకు ఆత్మస్థైర్యం కల్పించడం జరిగిందని, దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. అదే విధంగా గ్రామాల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీలు నిర్మించి మౌలిక వసతులు మెరుగుపర్చామని, మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందించామని చెప్పారు. విద్యార్థుల కోసం ఇప్పటికే మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని, త్వరలో ఇంజినీరింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తామని, ఐటీ హబ్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు.
ప్రభుత్వ పథకాలతోపాటు ఎంజేఆర్ ట్రస్టు ద్వారా వందలాది మంది పేద జంటలకు పెండ్లిళ్లు చేయడం, పాఠశాలలను నిర్మించడం, జిల్లా కేంద్రంలో క్యాంటిన్ ఏర్పాటు చేసి రూ.5లకే రుచికరమైన భోజనాన్ని అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే కష్టాలు తప్పవన్నారు. 55 ఏండ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలన్నారు. అనంతరం మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి తాను అధికారంలో ఉన్నప్పుడు తాను శక్తి వంచన లేకుండా అభివృద్ధి చేశానని, నా తర్వాత మర్రి జనార్దన్రెడ్డి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా రైతుల కోసం సాగునీరు, విద్యుత్, రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలను అందించి రైతుల బతుకుకు భరోసా కల్పించిందన్నారు. ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి మర్రి జనార్దన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బైకని శ్రీనివాస్ యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హన్మంతరావు, ఎంపీపీ మధు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు నరేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మాధవరెడ్డితోపాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.