అయిజ, జూన్ 2 : తూకం వేసి నిల్వ చేసిన వరి ధాన్యం తరలించాలని మండలంలోని పులికల్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు జమ్మన్న డీసీఎం కింద పడుకొని నిరసన తెలిపారు. సోమవారం ఒకటి, రెండు లారీలు రాగా, రైతులు తమ ధాన్యం ఎత్తాలని, లేదు తమ ధాన్యం తరలించాలని లారీల డ్రైవర్లు, ఐకేపీ నిర్వాహకులను రైతులు డిమాండ్ చేశారు. దీంతో చేసేదిలేక డ్రైవర్లు లారీలను నిలిపివేశారు. గత వారం రోజుల కిందటే ధాన్యం తూకం వేసినా లారీలు రాకపోవడంతో ధాన్యం తరలింపులో జాప్యం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు వస్తుండడంతో ఎక్కడ ధాన్యం తడుస్తుందోనని ఆందోళన చెందుతున్నామని, ధాన్యం తడిస్తే మిల్లర్లు ధాన్యం తిరస్కరిస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల కిందటే ధాన్యం తూకం చేసి 70 బస్తాలను నిల్వ చేశానని, అయినా లారీలు సమయానికి రాకపోవడంతో రేయింబవళ్లు కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నామని రైతు సమ్మన్న తెలిపారు.
ధాన్యం తరలింపునకు వాహనాలు అధికంగా కేటాయించాలని రైతులు కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలను కోరినా పట్టించుకోవడం లేదని రైతులు పేర్కొన్నారు. పులికల్ ఐకేపీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో వాహనాలు సకాలంలో రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చినా కొనుగోళ్లు కేంద్రాలపై దృష్టి సారించడంలేదని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య ఆరోపించారు. కలెక్టర్ వెంటనే పులికల్ ఐకేపీ కేంద్రం నుంచి తక్షణమే ధాన్యం తరలించాలని ఆయన డిమాండ్ చేశారు.