గద్వాల, జనవరి 28: దేశంలో రైతు ప్రభుత్వం తేవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన మార్కెట్యార్డు చైర్మన్ శ్రీధర్గౌడ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరు కాగా, కార్యక్రమంలో ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం పాల్గొన్నారు. ముందుగా మార్కెట్యార్డు చైర్మన్తోపాటు సభ్యుల ప్రమాణస్వీకారం చేయించారు.
అనంతరం మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ దేశంలో 15కోట్ల మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఉండగా పీఎం కిసాన్ సమ్మాన్నిధి కింద మూడుకోట్ల మంది రైతులకు మాత్రమే ఇస్తుందని, ఈ విషయంపై బీజేపీ నాయకులు మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో యాసంగిలోనే 64లక్షల మంది రైతులకు రైతుబంధుసాయం చేశామని, బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనలేక కేంద్రం చేతులెత్తేసిందన్నారు. ప్రధానమంత్రి మోదీ 2022నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, రైతులకు ఇస్తానని చెప్పిన రైతు పింఛన్ ఏమైందని ప్రశ్నించారు.
తెలంగాణలో రైతు మరణిస్తే ఆ కుటుంబానికి ప్రభుత్వం రైతుబీమా ద్వారా రూ.5లక్షలు అందిస్తున్నదన్నారు. కేంద్రం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా రైతుల ఆదాయంపై పన్ను వేయాలని ఆలోచన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తు రూ.14లక్షల కోట్లు మాఫీ చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం 14లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామని చెప్పి ఇప్పటివరకు 5లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందన్నారు. మిగతా 9లక్షల ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తారన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎనిమిదేండ్లలో 1.32లక్షల ఉద్యోగాలు భర్తీ చేయగా ప్రస్తుతం 91వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు గుర్తుచేశారు. 50ఏండ్ల తర్వాత బలహీనవర్గాలకు చెందిన వారికి మార్కెట్యార్డు చైర్మన్ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.
పేదలను తొక్కి పెట్టిన ఘనత ఈ ప్రాంతానిదే..
నడిగడ్డ ప్రాంతంలో పేదలను తొక్కిపెట్టిన చరిత్ర ఈ ప్రాంతానిదని, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని, అందుకు బీసీలకు మార్కెట్ చైర్మన్ పదవి దక్కడమే ఉదాహరణ అని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే నడిగడ్డ ఎడారి ప్రాంతంగా ఉండేదని, సీఎం కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నాక నడిగడ్డ పచ్చని పైర్లతో కళకళలాడుతుందన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో రైతుకు గౌరవం ఉండేది కాదని, కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులకు గౌవరం దక్కిందన్నారు. ఈ ప్రాంతంలో గతంలో బడుగు, బలహీనవర్గాలకు పదవులు దక్కేవి కావని, సీఎం కేసీఆర్ పాలనలో అందరికీ అవకాశాలు వచ్చాయన్నారు. నడిగడ్డ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి కేసీఆర్ పాదయాత్ర చేశారని గుర్తుచేశారు.
గతంలో ఆర్డీఎస్ షెట్టర్లు పగలగొడితే ఎవరూ పట్టించుకునేవారు లేరని, ప్రస్తుతం ఆర్డీఎస్ రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. భవిష్యత్లో బీసీ, ఓసీబంధు వచ్చే అవకాశం ఉందన్నారు. త్వరలో నడిగడ్డకు మెడికల్ కళాశాల వచ్చే అవకాశం ఉందని, రైతుల బాగోగులు చూసే ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీదే అన్నారు. వాల్మీకుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ప్రజలు తమ సమస్యలను మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తే వాటిని పరిష్కరిస్తారని, అలాంటి నాయకులు మనకు కావాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్చైర్మన్ కేశవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామన్గౌడ్, మార్కెటింగ్శాఖ అధికారి పుష్పమ్మ పాల్గొన్నారు.
రైతుల సంతోషమే ధ్యేయం : ఎమ్మెల్యే బండ్ల
రైతుల కుటుంబాల్లో సంతోషం నింపడమే ప్రభుత్వ ధ్యేయమని గద్వాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మార్కెట్ చైర్మన్గా ఎన్నికైన వారు రైతుల అభ్యున్నతికి కృషిచేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా సాగుతుందన్నారు. గద్వాల వ్యవసాయ మార్కెట్కు 360రోజులు ధాన్యం వస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చైర్మన్ కృషిచేయాలని సూచించారు. రైతులకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
పండుగలా వ్యవసాయం : జెడ్పీ చైర్పర్సన్
రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా సాగుతుందని జెడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు. మార్కెట్ చైర్మన్గా ఎంపికైన శ్రీధర్గౌడ్ రైతులకు చేయూతనిస్తూ మార్కెట్లోని సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ప్రభుత్వం రైతులకు చేయూతనిస్తుందని, రైతులు ప్రభుత్వం అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో రైతులు గౌరవంగా తలెత్తుకొని బతుకుతున్నారని, ఇది ఎంతో
సంతోషాన్ని ఇస్తుందన్నారు.
రిజర్వేషన్లతో సమన్యాయం : ఎమ్మెల్యే అబ్రహం
సీఎం కేసీఆర్ మార్కెట్యార్డులో రిజర్వేషన్లు ఏర్పాటు చేయడంతో అన్నివర్గాల వారికి సమన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. దేశంలో వ్యవసాయపరంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్రంలో రైతుల కోసం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల ఆధారంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందన్నారు.
జములమ్మ ఆలయ అభివృద్ధికి కృషి
– పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
గద్వాల రూరల్, జనవరి 28: నడిగడ్డ ఇలవెల్పు జములమ్మ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివా రం ఆలయ అష్టాదశ విగ్రహ ప్రతిష్ఠాపన నిర్మాణ పనులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి పరిశీలించి మాట్లాడారు. సీఎం కేసీఆర్తో చర్చించి అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ త్వర లో జరగబోయే జములమ్మ బ్రహ్మోత్సవాలను వైభవంగా ని ర్వహించాలని ఆలయ కమిటీ, సిబ్బందికి సూచించారు. మం త్రి వెంట జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ రామకృష్ణనాయు డు, కేటీదొడ్డి మండల అధ్యక్షుడు ఉరుకుందు ఉన్నారు.