దేవరకద్ర, డిసెంబర్ 20 : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మహిళలకు ఉచిత ప్రయాణ నిర్ణయంతో ఆటోడ్రైవర్ల కుటుంబాలు రోడ్డు పడ్డాయని వీరగురు ఆటో యూనియన్ మండల గౌరవాధ్యక్షుడు శ్రీకాంత్యాదవ్, మండలాధ్యక్షుడు రాము ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఆటో యూనియన్ నాయకులు ఆటోలు బంద్ చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆటోడ్రైవర్ల కుటుంబాలకు ప్రతి నెలా రూ.20వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, జీపు అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్, డిసెంబర్ 20 : ఆటోలు నడుపుతూ జీవనోపాధి పొందుతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం అదుకోవాలని ఆటో యూనియాన్ మండలాధ్యక్షుడు తిరుపతయ్య కోరారు. బుధవారం మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన ఆటో డ్రైవర్లతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల సామాన్య ఆటో డ్రైవర్ల బతులకు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని, లేదా నెలకు రూ.20 వేల జీవన భృతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆటోడ్రైవర్లు నర్సింహులు, మారుతి, హైమద్, సత్యం, పాషా, బారీ తదితరులు పాల్గొన్నారు.