మహబూబ్నగర్ మెట్టుగడ్డ/మూసాపేట, అక్టోబర్ 20 : కారుకు ఆర్టీవో బోర్డు పెట్టి..యూనిఫాం కారులో తగిలించి..జాతీయ రహదారిపై లారీలను ఆపి డ్రైవర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు మహబూబ్నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్లాఖాన్పూర్ గ్రామానికి చెందిన జాలం రాఘవేందర్ కృష్ణ చెక్పోస్టు వద్ద ఆర్టీవో అధికారుల వద్ద డ్రైవరు అసిస్టెంట్గా పనిచేసి మూడేండ్ల కిందట ఉద్యోగం మానేనాడు.
ఈ క్రమంలో డబ్బులు సులువుగా సంపాదించాలనుకొని రవాణాశాఖ అధికారిలా అవతారం ఎత్తాడు. తోడుగా వనపర్తి జిల్లా మదనాపురం మండలానికి చెందిన గారాడి శివకుమార్తో కలసి టీఎస్ 06 ఈకే 6666 నెంబర్ గల మహీంద్రా ఎక్స్వీ కారులో ఆర్టీవో బోర్డు పెట్టుకొని నకిలీ ఆర్ట్టీవో అధికారిగా బయలుదేరారు. యూనిఫాం కొనుక్కొని, వెహికిల్ చెక్ పోస్టు రిపోర్టు బుక్కును తీసుకొని ఇద్దరు కలిసి ఎన్హెచ్-44 జాతీయ రహదారిపైకి వచ్చారు. హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీలను ఆపి ఆర్టీవో అధికారులం అని చెప్పి బెదిరించి డ్రైవర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తుండగా గురువారం తెల్లవారుజామున భూత్పూర్ మండలం పోతులమడుగు వద్ద హైవే పెట్రోలింగ్ పోలీసులు వారి వివరాలు సేకరిస్తుండగా, ఇద్దరూ కలిసి పరారయ్యారు. అనుమానం వచ్చి వెంబడించి నిందితులను పట్టుకొని స్టేషన్కు తరలించారు. వారిని విచారించి కారు, రూ.11వేలు, ఐడీ కార్డు, యూనిఫాం, చెక్ రిపోర్టు బుక్కును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా ఆర్టీఏ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, భూత్పూర్ సీఐ రజితారెడ్డి ఉన్నారు.