నాగర్కర్నూల్, జనవరి 9: సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి వచ్చిన బృహత్తర కార్యక్రమం ‘కంటివెలుగు’ అని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని తేజ కన్వెన్షన్హాల్లో రెండో విడుత కంటివెలుగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే నానుడిని నిజం చేస్తూ.. ప్రజలు అంధత్వంతో బాధపడొద్దనే ఉద్దేశంతో ఈ నెల 18నుంచి కంటివెలుగుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రపంచంలోనే ఇది విశిష్ట కార్యక్రమం అన్నారు. కంటి వెలుగు శిబిరాలకు వచ్చే ప్రజలు, వైద్య సిబ్బందికి అన్నిరకాల వసతులు కల్పిస్తామన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో 50బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 18ఏండ్లు దాటిన ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు చేయించాలన్నారు.
అలాగే గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లెనిద్ర చేయాలని సూచించారు. ఎనిమిదేండ్లలో వ్యవసాయ రంగం సుభిక్షంగా మారిందని, ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. గొర్రెలు, ఉచిత చేపపిల్లల పంపిణీ, పెరిగిన సాగుతో బలవర్ధక ఆహారం అందుబాటులో ఉన్నదని, తద్వారా జీవన విధానం మారి ఆరోగ్యకరమైన ఆహారం తింటుండడం తో ఆరోగ్యకరమైన పిల్లలు జన్మిస్తున్నారన్నారు. రాను న్న కాలంలో ప్రపంచ ఆరోగ్యసూచీలో భారతదేశంలో తెలంగాణ మొదటిస్థానంలో నిలవనున్నదని ఆశాభా వం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ మంత్రి సూచనలు తూచా తప్పకుండా పాటించి వందశాతం విజయవం తం చేస్తామన్నారు.
కలెక్టర్ ఉదయ్కుమార్ మాట్లాడు తూ కంటివెలుగు మొదటి విడుతలో 5లక్షల మందికి పరీక్షలు నిర్వహించి.. 54వేల మందికి దగ్గరి చూపు అ ద్దాలు, 43వేల మందికి ప్రిస్కిప్షన్ అద్దాలు, 22వేల మందికి వైద్యం చేయించామన్నారు. ఈసారి 6 లక్షల మందికి పరీక్షలు చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. 50టీంలను ఏర్పాటు చేయగా.. అందులో 41 టీంలు గ్రామాల్లో, 9టీంలతో మున్సిపాలిటీల్లో కంటి పరీక్షలు చేస్తామన్నారు.అంతకుముందు కంటివెలుగుపై డెమో నిర్వహించారు. మంత్రికి వైద్య సిబ్బంది కంటి పరీక్షలు చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, అదనపు కలెక్టర్ మనూచౌదరి, డీఎంహెచ్వో సుధాకర్లాల్, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.