కడ్తాల్, డిసెంబర్ 26 : ధ్యాన గురువు సుభాష్పత్రీజీ ఆశయాలను ప్రతి ధ్యాని కొనసాగించాలని, ధ్యాన జగత్ సాకారానికి ధ్యానులు ఐకమత్యంతో ముందుకు సాగాలని పత్రీజీ కుమార్తె పరిమళ పత్రీ, ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి పిలుపునిచ్చారు. కడ్తాల్ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్లో, పిరమిడ్ స్పిరిచ్వల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగం-2 మంగళవారం ఆరోరోజుకు చేరుకున్నది. సోమవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమాలకు మైహోం అధినేత జూపల్లి రామేశ్వర్రావు హాజరై మాట్లాడుతూ పత్రీజీ సమాజానికి చేసిన ధ్యాన సేవ మరవలేనిదని కొనియాడారు. ప్రపంచంలో ఎంత ధనిక దేశమైనా శాస్త్ర విజ్ఞానంలో ఎంతో అభివృద్ధి చెందినా.. మానవత కోణం క్షీణించిపోతుందని తెలిపారు. భూమ్మీ దకు కర్మలు అనుభవించడానికి వచ్చామని, ప్రపంచమంతా వసుదైక కుటుంబంగా భావించి జీవించాలన్నారు.
అనంతరం పిరమిడ్ ధ్యాన కేంద్రానికి రూ.కోటి విరాళం అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మంగళవారం ఉదయం 5నుంచి 8గంటల వరకు నిర్వహించిన, ప్రాతఃకాల ధ్యానంలో ఆధ్యాత్మిక గురువులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. అదే విధంగా ధ్యాన యాగంలో ప్రతి రోజూ నిర్వహిస్తున్న కళాకారుల నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ గాయని గీతామాధురి ఆలపించిన గీతాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు హన్మంతురాజు, బాలకృష్ణ, సాంబశివరావు, శ్రీరామ్గోపాల్, దామోదర్రెడ్డి, శివప్రసాద్, మాధవి, నవకాంత్, విజయలక్ష్మి, రాయజగపతిరాజుతోపాటు ధ్యానులు పాల్గొన్నారు.