మహబూబ్నగర్ : అమెరికాలో ఉద్యాన విద్యార్థులకు అపారమైన అవకాశాలున్నాయని ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ రాజశేఖర్ అన్నారు. విదేశాల్లో ఉద్యాన విద్య- అవకాశాలు, అర్హతలపై వనపర్తి జిల్లా మోజెర్ల ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మోజెర్ల ఉద్యాన కళాశాల విద్యార్థుల కోసం 4 రోజుల పాటు జరుగనున్న జీఆర్ఈ, ఐఈఎల్టీఎస్, టోఫెల్ సన్నాహకాలపై విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉద్యాన విద్యార్థుల చదువులకు, ఉద్యోగాలకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయన్నారు.
అయితే అందుకు చక్కని శిక్షణ అవసరమని ఆయన తెలిపారు. విద్యార్థులు సైతం తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకోవాలని సూచించారు. ఆస్ట్రేలియాలో వ్యవసాయం, టూరిజం రంగాల్లో అవకాశాలున్నాయని తెలిపారు. న్యూజిలాండ్ లో వ్యవసాయానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయని, కెనడాలో రెండు సంవత్సరాలలోనే ఎంఎస్ పూర్తి చేసేందుకు అవకాశం ఉందన్నారు.
అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో సాగుభూమి ఎక్కువని, రైతుల సంఖ్య తక్కువగా ఉంటుందని విదేశీ విద్యా నిపుణుడు ప్రోమాక్ సంస్థ అధినేత గాయం నర్సిరెడ్డి తెలిపారు. ఆ దేశాల్లో కమతాల విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉందని, ఆ కమతాల నిర్వహణకు ఆయా దేశాలు విదేశాల నుంచి ఈ రంగాల్లో నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయన్నారు.
ఇలాంటి ఉద్యోగాలు పొందే వారిలో భారతీయులకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నర్సిరెడ్డి వెల్లడించారు. అయితే విదేశాల్లో విద్య అభ్యసించాలనుకున్నప్పుడు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల్లో మాత్రమే అడ్మిషన్ తీసుకోవాలన్నారు. చాలా విశ్వవిద్యాలయాలు ప్రతిభను బట్టి స్కాలర్షిప్ స్పాన్సర్ చేస్తాయని, ఒకవేళ లేకపోయినా రూ.20 లక్షలతో మాస్టర్స్ పూర్తి చేయొచ్చన్నారు.
జర్మనీలో విద్య ఉచితం అయినప్పటికీ అక్కడ ఉద్యోగపరంగా స్థిరపడడం కష్టమని నర్సిరెడ్డి తెలిపారు.
ఈ శిక్షణ ఇన్చార్జి డాక్టర్ పిడిగం సైదయ్య మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకర స్వామి, కే నాగరాజు, దాదాపు 120 మంది విద్యార్థులు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.