పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆదివారం మధ్యాహ్నం 3:16 గంటలకు నార్లా పూర్ పంప్హౌస్లో మొదటి పంప్ను రన్ చేశారు. విద్యుత్ సరఫరా నిరాటంకంగా సాగడంతో 145 మెగావాట్ల సామర్థ్యంగల పంపు రయ్యుమంటూ తిరిగింది. డ్రైరన్ విజయవంతం కావడంతో నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్
రావు, ప్రాజెక్టుల సలహాదారు పెంటారెడ్డి, పీఆర్ఎల్ చీఫ్ ఇంజినీర్ హమీద్ఖాన్, బీహెచ్ఈఎల్ టెక్నికల్ టీం, మెఘా కంపెనీ ప్రతినిధులు, సిబ్బంది సంబురాలు చేసుకున్నారు. మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు ఇరిగేషన్ శాఖ అధికారులకు అభినందనలు తెలిపారు. అనంతరం నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 15వతేదీలోగా వెట్న్ నిర్వహిస్తామని, జెట్స్పీడ్లో మిగతా పంప్హౌస్లలో కూడా వెట్న్ నిర్వహించి నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లకు నీటిని విడుదల చేస్తామన్నారు. ప్రతి రిజర్వాయర్కు కనీసం రెండు టీఎంసీల చొప్పున వదులుతామన్నారు.
మహబూబ్నగర్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు ప్రజల దశాబ్దాల కల పాలమూరు-రంగారెడ్డి సాకారానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. సాగునీటి కోసం గోసపడ్డ రైతాంగానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం అధికారులు ఆదివారం నార్లపూర్ పంప్హౌస్ వద్ద చేపట్టిన డ్రై రన్ విజయవంతమైంది. మధ్యాహ్నం 3:16గంటలకు నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్రావు, ప్రాజెక్టుల సలహదారు పెంటారెడ్డి, పీఆర్ఎల్ చీఫ్ ఇంజినీయర్ హమీద్ఖాన్, బీహెచ్ఈఎల్ టెక్నికల్ టీం, మెగా కంపెనీ ప్రతినిధుల సమక్షంలో మోటరును ఆన్ చేశారు. కౌంట్డౌన్ షురూ చేసిన నిమిషానికే విద్యుత్ సరఫరా నిరాటంకంగా సాగడంతో 145 మెగావాట్ల సామర్థ్యంగల పంపు రన్ కావడంతో పంప్హౌస్ కేంద్రం చప్పట్లతో మార్మోగింది. ఈ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఉన్నతాధికారులు ఇంజినీర్లు, టెక్నికల్ టీంకు అభినందనలు తెలిపారు. విక్టరీ సింబల్ చూపుతూ ఆనందంతో సంబురాలు జరుపుకొన్నారు. పంపులను బిగించిన బీహెచ్ఈఎల్ టెక్నికల్ టీం డ్రైరన్ కోసం మూడు రోజులుగా నిద్రాహారాలు మాని పనిచేశారు. దీంతో రజత్కుమార్ ఇతర అధికారులు టెక్నికల్ టీంను అభినందలతో ముంచెత్తారు. డ్రైరన్ సక్సెస్ కావడంతో ఇరిగేషన్ శాఖ ఎస్ఈలు, ఈఈలు, డీఈలు, జేఈలు పరస్పరం అభినందించుకొని స్వీట్లు పంచుకున్నారు.
అంతకుముందు ఉన్నతాధికారులు పంప్హౌస్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నార్లాపూర్లో డ్రైరన్ సందర్భంగా ఉద్విగ్న భరిత వాతావరణం కనిపించింది. ఈనెల 15వ తేదీలోగా వెట్న్ చేస్తామని సీఈ హమీద్ఖాన్ వివరించారు. జెట్ స్పీడ్లో మిగితా పంప్హౌస్లలో వెట్న్ నిర్వహించి అంజనగిరి (నార్లాపూర్), వీరాంజనేయ (ఏదుల), వెంకటాద్రి (వట్టెం), కురుమూర్తి రాయ (కరివెన) రిజర్వాయర్లకు నీటిని విడుదల చేస్తామన్నారు. వచ్చే యాసంగికి మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఇరిగేషన్ ప్రత్యేక కార్యదర్శి రజత్కుమార్ పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డికి అన్ని రకాల అనుమతులు వచ్చినందునా టైంబాండ్ పెట్టి అధికారులకు టార్గెట్ ఇచ్చి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నార్లాపూర్ డ్రైరన్ విజయవంతం కావడంతో మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, లక్ష్మారెడ్డిలు ఇరిగేషన్ శాఖ అధికారులను అభినందించారు.
తక్కువ టైంలో సక్సెస్ఫుల్గా డ్రైరన్..
అన్ని అనుమతులు సాధించిన చాలా తక్కువ సమయంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డ్రైరన్ విజయవంతమై వెట్న్క్రు సన్నాహాలు చేస్తుండడంతో అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇచ్చింది. అంతకుముందే సీఎం కేసీఆర్ కొత్త సచివాలయం ప్రారంభించిన మరుసటి రోజే ఎత్తిపోతల పథకంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ నాటికి పీఆర్ఎల్ కింద రిజర్వాయర్లు నింపుతామని హామీ ఇచ్చారు. దీంతో సీఎం ఇచ్చిన హామీ మేరకు ఉన్నతాధికారులు రేయింబవళ్లు శ్రమించి అన్ని రకాలుగా ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి నడుం బిగించారు. సీఎం సమీక్షించిన వారం రోజుల్లోపే సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లను సందర్శించారు. ఏదులలో అధికారులతో సమీక్ష నిర్వహించి ఎక్కడెక్కడ పనులు పెండింగ్లో ఉన్నాయో వాటిని గుర్తించి టైంబాండ్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. వారం రోజుల కింద మళ్లీ సీఎంవో కార్యదర్శి స్మీతా సబర్వాల్ వచ్చి 3న డ్రైరన్ నిర్వహించాలని ఆదేశించారు. దీంతో తక్కువ టైంలో టెక్నికల్ టీం, ఇరిగేషన్ ఇంజినీర్లు, ఏజెన్సీ ప్రతినిధులు డ్రైరన్కు సిద్ధం చేశారు. అనుకున్నట్లుగానే డ్రైరన్ పూర్తి చేయడంతో ఉన్నతాధికారులు అభినందనలతో ముంచెత్తారు.
దశలవారీగా రిజర్వాయర్లు నింపేందుకు ప్లాన్..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన డ్రైరన్ విజయవంతం కావడంతో అదే ఊపుతో ఉన్నతాధికారులు 15న వెట్న్ నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకుంటున్నారు. ఇది కూడా విజయవంతమయ్యాక అంజనగిరి రిజర్వాయర్లోకి నీళ్లను ఎత్తిపోసే ప్రక్రియ చేపడుతారు. నీటిని విడుదల చేసే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లను నింపేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరిగేషన్ ప్రత్యేక కార్యదర్శి రజత్కుమార్ వెల్లడించారు. ప్రతి రిజర్వాయర్లో 1/3 వంతు నీటిని నింపుతామని, కనీసం రెండు టీఎంసీల నీటిని నింపుతామన్నారు. ప్రతి రిజర్వాయర్లో ఒక్కో పంపు ద్వారా నీటిని నింపేందుకు ఎనిమిది రోజుల సమయం పడుతుందని.. అక్టోబర్ 15వ తేదీ వరకు అన్ని రిజర్వాయర్లు నింపుతామన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ హమీద్ఖాన్, ఈఈ శ్రీనివాస్రెడ్డి, డీఈ శ్రీనివాస్, కరివెన ఎస్ఈ చక్రధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నిద్రాహారాలు మాని పనిచేశాం : బీహెచ్ఈఎల్ సైట్ ఇన్చార్జి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పంపులను బీహెచ్ఈఎల్ కంపెనీ సప్లయ్ చేసింది. మేం దీని కోసం ఆహర్నిశలు కష్టపడ్డాం. ప్రభుత్వం, డిపార్ట్మెంట్ సహకారంతో తక్కువ సమయంలో చేసిన ప్రాజెక్టు ఇదని సైట్ ఇంజినీయర్ హజ్మేరా మెహాన్ అన్నారు. నార్లాపూర్ పంప్హౌస్ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యం గల పంపులను బిగించి ట్రయల్న్ విజయవంతం చేశామన్నారు. మాటెక్నికల్టీం రవీందర్, అరుణ్కుమార్, లీలాకుమార్, హరీశ్కుమార్, శ్రీనివాస్, చైతన్య మూడు రోజులు నిద్రలేని రాత్రులు గడిపి ఈ డ్రైరన్లో పాలుపంచుకున్నామన్నారు. కాళేశ్వరం కంటే నాలుగు రెట్లు స్పీడ్గా ఈ ప్రాజెక్టు చేశామని చెప్పారు.
45 రోజుల్లో కరివెనకు నీళ్లు
భూత్పూర్, సెప్టెంబర్ 3 : 45 రోజుల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా కరివెన రిజర్వాయర్కు నీటిని తీసుకొస్తామని ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్ తెలిపారు. ఆదివారం రాత్రి నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం రిజర్వాయర్ను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా ఆదివారం నార్లాపూర్ వద్ద మొదటి పంపులో నిర్వహించిన డ్రైరన్ విజయవంతమైందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వట్టెం వద్ద ఉన్న మిషన్ భగీరథ పైపులైన్ మార్పిడి పనులను పరిశీలించామని, పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించానన్నారు. పీఆర్ఎల్ఐలో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లన్నింటినీ కృష్ణానీటితో త్వరగా నింపుతామన్నారు. పనులన్నీ పూర్తి చేసి మూడు వారాల్లో పంపింగ్ ప్రారంభిస్తామన్నారు. మొదట నార్లాపూర్ రిజర్వాయర్ నింపి.. అక్కడి నుంచి ఏదుల, అక్కడి నుంచి వట్టెం, అక్కడి నుంచి 45 రోజుల్లో కరివెనకు సాగునీరు తరలిస్తామని చెప్పారు. అందుకు సంబంధించి అన్నీ శాఖల అధికారులతో మాట్లాడినట్లు, వట్టెం వద్ద పైపు మార్పు, కుడికిళ్ల వద్ద డిప్ కట్ట సమస్య తప్పితే ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. కార్యక్రమంలో సాగునీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్రావు, మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టుల సీఈ బీవీ రమణారెడ్డి, నాగర్కర్నూల్ కలెక్టర్ ఉదయ్కుమార్, ఎస్ఈ చక్రధరం, శ్రీనివాసులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.