విద్య, వైద్యానికి సర్కారు పెద్దపీట వేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రజలకు విద్య, వైద్యం లేకపోతే కష్టపడి కూడబెట్టిన సొమ్మంతా ప్రైవేట్ సంస్థలకు దారబోయాల్సి వస్తుందనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అత్యధికంగా గురుకుల పాఠశాలలు, వైద్యకళాశాలలు ఏర్పాటు చేసి ఉచితంగా సేవలందిస్తున్నారన్నారు. వనపర్తి, పెద్దమందడి, రేవల్లిలో పర్యటించి జోనల్స్థాయి క్రీడలు, గోదాంలు, గురుకుల పాఠశాలను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు ఆల, అబ్రహం, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ పాల్గొన్నారు.
వనపర్తి టౌన్/పెద్దమందడి/రేవల్లి, అక్టోబర్ 17 : రాష్ట్రంలో సర్కారు బడులు, దవాఖానలను మెరుగుపర్చి నాణ్యవంతమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందజేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం పెద్దమందడి మండలంలోని వెల్టూర్ గ్రా మంలో జ్యోతిరావుఫూలే గురుకుల పాఠశాలను ఎంపీ రాములు, గిడ్డంగుల శాఖ సంస్థ చైర్మన్ సాయిచందు, వనపర్తి జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్యానికి సర్కారు పెద్దపీట వేస్తున్నద న్నారు. కాయాకష్టం చేసి కూడబెట్టుకున్న సొమ్మంతా ప్రైవేట్ సంస్థలకు దారబోయాల్సి వస్తుందనే ఉద్దేశం తో.. సీఎం కేసీఆర్ సర్కార్ విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా గురుకుల పాఠశాలలను ఏ ర్పాటు చేశారన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.లక్షా25వేల ఖర్చును ప్రభుత్వం భరిస్తుందన్నారు.
సర్కారు దవాఖానలను మెరుగుపర్చి, కేసీఆర్ కిట్ పథకం ద్వారా ఆ డపిల్లలకు రూ.13వేలు, మగ పిల్లలు పుడితే రూ.12 వేలు అందిస్తుందన్నారు. ఇటీవలే మంజూరైన బీసీ బా లికల గురుకుల పాఠశాలను వెల్టూర్ గ్రామంలో ఏర్పా టు చేసి ఈఏడాది 5,6,7 తరగతులను ప్రారంభించ డం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ప్ర జలకు ఏ అనారోగ్య సమస్యలు తలెత్తినా వనపర్తిలోనే నయం అయ్యేట్లు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలతోపాటు 600 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా రూ.600 కోట్ల వ్యయంతో దవాఖాన నిర్మాణం చేస్తామన్నారు. రాష్ట్రంలోనే 5వ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను వనపర్తిలో ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. సమాజానికి విద్య ఎంత అందుబాటులో ఉంటే ప్రజలకు దానికి మించిన సంపద ఏమి ఉండదన్నారు. రాష్ట్రంలో లక్షా35వేల ఉద్యోగాలను ఇప్పటికే భర్తీ చేశామని, మరో 92వేల ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి పోటీ పరీక్షలను నిర్వహిస్తుందన్నారు. అభ్యర్థులు పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చాలని కోరారు. అనంతరం మండలంలోని వీరాయపల్లి గ్రామంలో వేర్ హౌసింగ్ సంస్థ నిర్మించిన నూతన గోదాంలను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచులు శ్రీనివాస్రెడ్డి, భాగ్యమ్మ, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజాప్రకాశ్రెడ్డి పాల్గొన్నారు.
పట్టుదలతో అడుగులువేయాలి..
వనపర్తి టౌన్, అక్టోబర్ 17: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో అడుగులు వేయాలని, మానసిక, శారీరక దృఢత్వానికి క్రీడలు తోడ్పడతాయని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మర్రికుంట గిరిజన గురుకుల పాఠశాలలో ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల జోనల్ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. జ్యోతిప్రజ్వలన అనంతరం క్రీడాకారుల గౌరవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆటలు జీవితంలో ఒక భాగమని, చదువుకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ఆటలకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుందన్నారు. చైనా తర్వాత ప్రపంచంలో అత్యంత అధిక జనాభా కలిగిన దేశం భారతదేశమని దురదృష్టవశాత్తు మన దేశంలో ప్రాథమిక విద్య నుంచి విశ్వ విద్యాలయం వరకు సరైన వసతులు, ప్రోత్సాహం లేక కోట్ల మంది ప్రతిభావంతులు ఉన్నా అంతర్జాతీయ వేదికలపై సరైన సత్తా చాటలేకపోతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, అబ్రహం, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, ఎంపీపీ కిచ్చారెడ్డి, ప్రిన్సిపాల్ గోవర్ధన్ పాల్గొన్నారు.
దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ..
రేవల్లి, అక్టోబర్ 17: సీఎం కేసీఆర్ ముందుచూపు వల్ల తెలంగాణ నేడు దేశానికి అన్నపూర్ణగా మారిందని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కొంకలపల్లి వద్ద రూ.10కోట్ల వ్యయంతో 10మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నూతనంగా నిర్మించిన గోదాంను ఎంపీ రాములు, గిడ్డంగుల శాఖ ఎండీ జితేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాయమాటలు చెప్పుకుంటూ మతాల కుంపటి పెట్టి తెలంగాణను ఆగం చేయడానికి బీజేపీ కుయుక్తులు పన్నుతుందన్నారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న బీహార్కు చెందిన హమాలీలతో కాసేపు ముచ్చటించారు. ఇక్కడ సాగునీరు బాగా ఉందని తమ రాష్ట్రంలో ఉపాధి లేకే ఇక్కడికి వలస వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, గిడ్డంగులశాఖ సంస్థ ఎస్ఈ రాధాకృష్ణమూర్తి, ఆర్ఎం జైప్రకాశ్రెడ్డి, ఎంపీపీ బంకల సేనాపతి, జెడ్పీటీసీ భీమయ్య, సింగిల్విండో చైర్మన్ రఘుయాదవ్, వైస్ఎంపీపీ మధుసూదన్రెడ్డి నాయకులు పాల్గొన్నారు.