గద్వాల, ఏప్రిల్ 12 : గతంలో ప్రతి గ్రామానికి ప్రధాన నీటి వనరుగా చెరువులే ఉండేవి. వీటిలోని నీటి ద్వారానే పంటలు సాగు మొదలు ఇంటి అవసరాలు, పశు పక్షాదులకు నీరే లభించేది. పల్లెల్లోని ప్రతి కుటుంబం చెరువు నీటిని వినియోగించుకునేవారు. చెరువులను అభివృద్ధి చేయకపోవడంతో దానికింద ఉన్న ఆయకట్టుకు అంతంత మాత్రంగానే సాగునీరు అం దేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రధాన నీటివనరులైన చెరువులను పునరుద్ధరించి దాని కింద ఉన్న ఆయకట్టును వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం భావించింది. ఈక్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ పేరుతో ఒండ్రుమట్టి, పూడికతీత పనులు చేపట్టి చెరువులకు మహర్దశ తీసుకొచ్చారు. దీంతో చెరువుల కింద ఎన్నో ఏండ్లుగా బీడుభూములుగా ఉన్న పొలాలు పచ్చని మాగాణుల్లా మారాయి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి కరువుఛాయలు కమ్ముకున్నాయి. బీఆర్ఎస్ హయాంలో జిల్లాలోని ఏ చెరువు కింద చూసినా పచ్చని పైర్లు కనిపించేవి. నేడు ఆ భూ ములన్నీ బీళ్లుగా మారాయి. గతంలో జూరాల ప్రాజెక్టుకు వరద రాగా బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వాయర్లతోపాటు చెరువులు, కుంటలను నింపేది. దీంతో ఎర్రటి ఎండాకాలంలోనూ చెరువులు నీటితో కళకళలాడేవి. ప్రస్తుత ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో జిల్లాలోని చెరువులన్నీ వట్టిపోయి కనిపిస్తున్నాయి.
జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలోని 8 మండలాల్లో 561 చెరువులు ఉన్నాయి. వీటి కింద గత ప్రభుత్వం 23,093 ఎకరాలకు సాగునీటిని అందించింది. కాగా ప్రస్తుతం నీరులేక చెరువులన్నీ వట్టిపోవడంతో ఆయకట్టు సాగవకపోవడంతో మొత్తం బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. జూరాల, ఆర్డీఎస్, నెట్టెంపాడ్, తుమ్మిళ్ల లిఫ్ట్ కింద పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించిన విధంగానే చెరువుల కింద కూడా అదే పరిస్థితి నెలకొన్నది. ఈక్రమంలో మత్స్యకారులకు సైతం తిప్పలు తప్పడం లేదు. గతంలో చెరువుల్లో నీరు నిండుగా ఉండడంతో ఉచిత చేపపిల్లలను వదిలి మత్స్యసంపదను సృష్టించేలా ప్రభు త్వం మత్స్యకారులను ప్రోత్సహించింది. ఈ ఏడాది చెరువుల్లో నీరు లేకపోవడంతో మత్స్యకారుల కుటుంబాల పూట గడవడమే కష్టంగా మారింది.