మహబూబ్నగర్, మే 22: ప్రజలకు మంచి చేయాలనే తపనతో అధికారులు నిరంతరం శ్రమించాలని కలెక్టర్ రవినాయక్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాసమస్యలను పెండింగ్లో ఉంచరాదని సంబంధింత అధికారులకు సూచించారు. అలాగే వర్షాలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం మొత్తాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యంపై ఏరోజుకారోజు కచ్చితమైన నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ముఖ్యంగా వ్యవసాయ విస్తరణ అధికారులు నాణ్యత కలిగిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ధ్రువీకరణ జారీచేయాలని, ఒక వేల ఎవరైనా నాణ్యతాప్రమాణాలకు అనుకూలంగా లేని ధాన్యాన్ని ధ్రువీకరించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా ఫిర్యాదులను స్వీకరించినప్పుడు పరిష్కరించేందుకు అవసరమైన పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలన్నారు.
మిల్లులకు వీఆర్ఏలను కేటాయించాలి
జిల్లాలోని అన్ని మిల్లులకు వీఆర్ఏలను కేటాయించాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. ఈ సీజన్లో వర్షాలు ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తాసీల్దార్లు గ్రూప్-4 పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా ఎప్పటిలాగే ఈ సోమవారం సైతం ప్రజల వద్ద నుంచి భూములకు సంబంధించిన విషయాలు, వ్యక్తిగత అంశాలు, ఉద్యోగ, ఉపాధికి సంబంధించిన అంశాలపై ప్రజలు ఫిర్యాదులను సమర్పించారు. అలాగే భాగ్యరెడ్డివర్మ జయంతిని పురస్కరించుకొని ఎన్ఐసీ మందిరంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, జెడ్పీ సీఈవో జ్యోతి, ఆర్డీవో అనిల్కుమార్, డీఆర్డీవో యాదయ్య, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.