జీపీలకు నిధులు.. కొత్త ఖాతాలు
పూర్తి కావస్తున్న ప్రక్రియ
అభివృద్ధి పనులకు ఊతం
జీపీ ఖాతాల్లోనే నిధులు
చేసిన పనులకు వెంటనే బిల్లులు
పంచాయతీల్లో అభివృద్ధి పనులకు మార్గం సుగమమైంది. చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులో ఇక జాప్యం తొలగిపోనున్నది. నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే నిధులు సమకూర నున్నాయి. దీనికోసం పంచాయతీలకు కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచారు. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులు నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమకానున్నాయి. ఈ విధానంపై సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్కర్నూల్, ఏప్రిల్ 11 : సర్పంచులకు ఊరట లభించనున్నది. గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు నిధుల ఖర్చు విషయంలో ఇక జాప్యం ఉండబోదు. కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఇకపై నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోనే జమకానున్నాయి. దీనికి సంబంధించి ఇటీవలే జీవో నంబర్ 18 విడుదలైంది. గ్రామ సభలో తీర్మానించిన పనుల బిల్లులను వెంటనే చెల్లించనున్నారు. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కొత్తగా జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాలు తెరవనున్నారు. జిల్లా పంచాయతీ అధికారులు సర్పంచులు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని పంచాయతీలు కొత్త ఖాతాలను తెరిచాయి. ఇప్పటివరకు ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు అందేవి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా నిధులను అందజేయనున్నది. ఈ నెల ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది.
ఇప్పటివరకు ఉన్న పరిస్థితులతో మంజూరైన నిధులను పంచాయతీల ఖాతాల్లోకి చేరేందుకు రెండు, మూడు నెలల సమయం పట్టేది. ఈ కారణంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బోర్లు, పైపులైన్ల మరమ్మతులు వంటి పనులు చేపట్టినా.. బిల్లుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇది పంచాయతీలకు భారంగా మారింది. ఇక పనులకు డెడ్లైన్ సమస్యను మరింత పెంచనున్నది. దీనికితోడు ఎస్టీవోల్లో ఖాతాల ఫ్రీజింగ్ కూడా బిల్లుల మంజూరులో జాప్యానికి కారణమవుతున్నది. సకాలంలో పనులు చేసినా.., పంచాయతీ ఖాతాల్లో నిధులు ఉన్నా.. సర్పంచులు విడుదల చేయలేని దుస్థితి ఉండేది. ఇలాంటి పరిస్థితులతో అభివృద్ధి పనుల్లో జాప్యం ఏర్పడుతున్నది. కొత్త పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నది. పల్లె ప్రగతితోపాటు హరితహారంలో భాగంగా నర్సరీల నిర్వహణ, రోజూ చెత్త సేకరణ, ట్రాక్టర్ల నిర్వహణ వంటి ఆర్థిక భారంతో కూడిన పనులు చేపడుతున్నది. కాగా, కొత్త ఖాతాలతో ఈ సమస్య పూర్తిగా తీరిపోనున్నది. నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ అవుతాయి. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపును సకాలంలో చెల్లించే వీలుంటుంది. సర్పంచులు, కాంట్రాక్టర్లు కూడా పనులు చేపట్టడంలో మరింత హుషారుగా ముందుకు సాగనున్నారు. ఈ విధానంపై సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వంద శాతం ఖాతాలు పూర్తి..
ఈనెల నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీ ఖాతాల్లోనే జమ అవుతాయి. దీనికోసం జిల్లాలోని 461 గ్రామ పంచాయతీలకుగానూ అన్ని చోట్ల కొత్త ఖాతాలు ఓపెన్ చేశాం. ఈ విధానంతో గ్రామ పంచాయతీల్లో చేసిన తీర్మానాల పనులకు సర్పంచులు నేరుగా బిల్లులు మంజూరు చేసే అవకాశం ఉంటుంది.
– కృష్ణ, డీపీవో, నాగర్కర్నూల్