మిషన్భగీరథ తాగునీరు కలుషితం కాలేదు
‘వెలుగు’ కథనం అబద్దాల పుట్ట..
తేల్చిచెప్పిన కెమికల్ అనాలసిస్ రిపోర్టు
మహబూబ్నగర్, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు రోజుల కిందట అతిసార ప్రబలి వాంతులు, విరేచనాలతో ముగ్గురు చనిపోయినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ నెల 6న వేదనగర్, మోహిన్మల్ల, గంటవీధి, రాఘవేంద్ర కాలనీవాసులు వాంతులు, విరేచనాలతో సుమారు 50మంది జిల్లా దవాఖానలో చేరారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. అదేరోజు రాత్రి మరొకరు మరణించారు. శుక్రవారం అదే ప్రాంతానికి చెందిన మరొకరిని చికిత్స నిమిత్తం వనపర్తికి తీసుకెళ్లి.. మళ్లీ గద్వాలకు తీసుకొస్తుండగా చనిపోయారు.
ఈ విషయంపై అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగి అతిసారను కంట్రోల్ చేశారు. అయితే ‘వెలుగు’ దినపత్రికలో మిషన్భగీరథ నీళ్లు తాగడం వల్లే చనిపోయారంటూ అబద్ధపు కథనం ప్రచురితమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంపై బురదజల్లే విధంగా నిజాలు దాచే ప్రయత్నం జరిగినట్లు తేటతెల్లమైంది. అసలు మిషన్భగీరథ నీరు కలుషితం కాలేదని కెమికల్ రిపోర్టు తేల్చిచేప్పింది. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్లే అతిసార ప్రబలిందని డీఎంహెచ్వో చందూనాయక్ తెలిపారు. చనిపోవడానికి కారణం తాగునీరు కాదని బయోకెమికల్ రిపోర్ట్ కూడా స్పష్టం చేసింది. ఈ రెండు నివేదికలను అధికారులు మీడియాకు విడుదల చేశారు. అతిసార ప్రబలిన ప్రాంతాల్లో అధికారులు శానిటేషన్ చేపడుతున్నారు. ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, డీఎంహెచ్వో, సిబ్బంది అక్కడే తిష్టవేశారు.
తాగునీటి వల్ల కాదని తేల్చిన రిపోర్టులు..
తాగునీరు కలుషితం కాలేదని రిపోర్టులు తేల్చిచెబుతున్నాయి. మూడు రోజులుగా వేదనగర్, మోహిన్మల్ల, గంటవీధి, రాఘవేంద్ర కాలనీల్లో మున్సిపల్ సిబ్బంది తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షించారు. తాగునీరు కలుషితం కాలేదని రిపోర్ట్ వచ్చింది. కెమికల్ రిపోర్టు కూడా నార్మల్ అని వచ్చింది. జిల్లా కేంద్రానికి చెందిన కొందరు బీజేపీ నేతలు వెలుగుపత్రిక ద్వారా మిషన్ భగీరథ తాగునీటి వల్లే అతిసార ప్రబలిందని అబద్ధాలు రాయించినట్లు స్పష్టమైంది.