మన్యం గిరులు శివనామస్మరణతో పులకించాయి. గురువారం సలేశ్వరం జాతరకు భక్తులు లక్షకుపైగా తరలివచ్చారు. దారులన్నీ మన్యం వైపు కదిలాయి. లింగమయ్య దర్శనంతో తన్మయత్వం చెందారు. నల్లమలోని దట్టమైన అడవిలో 4 కి.మీ.కుపైగా కొండలు, కోనలు, లోయలు దాటి సాహస యాత్ర చేపట్టిన భక్తులు స్వామి దర్శనంతో పరవశించిపోయారు. జలపాతం వద్ద స్నానాలు ఆచరించిన భక్తులు స్వామి దర్శనం కోసం గంటల తరబడి బారులుదీరారు. వచ్చేటప్పుడు ‘వస్తున్నాం లింగమయ్యా’.. అంటూ ‘తిరిగొచ్చేప్పుడు వెళ్తున్నాం లింగమయ్యా’.. నామస్మరణతో క్షేత్రం పులకించింది. వెళ్లేటప్పుడు భక్తులు విడిది కేంద్రాల వద్ద సేదతీరారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అల్పాహారం, అన్నదానంతోపాటు అంబలి, తాగునీటి వసతి కల్పించారు. వైద్య శిబిరం నిర్వహించగా.. పోలీసులు రాత్రింబవళ్లు భద్రతా చర్యలు చేపట్టారు.
అచ్చంపేట/లింగాల, ఏప్రిల్ 6: తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి చెందిన సలేశ్వరం లింగమయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాళ్లూరప్పలు, గుట్టలు దాటుతూ ‘వస్తున్నాం లింగమయ్య’ అంటూ శివనామస్మరణ చేస్తూ భక్తులు కదిలారు. నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిమంది నల్లమల బాట పట్టడంతో రద్దీ నెలకొంది. చిన్నాపెద్ద తేడా లేకుండా దట్టమైన అడవి, లోయలు దాటుతూ సాహసయాత్రలో ఉత్సాహంగా ముందుకుకదిలారు. గురువారం చైత్రశుద్ధ పౌర్ణమి రోజున లింగమయ్యను దర్శించుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయని ప్రజల్లో అపార నమ్మకం. దీంతో స్వామివారి దర్శనానికి నల్లమల దారులన్నీ జనసంద్రమయ్యాయి. చెంచు పూజారులు లింగమయ్యకు పూజలు చేశారు. సుమారు లక్షకు పైగా జనం తరలిరావడంతో నల్లమల జనసంద్రంగా మారింది.
ఎండలో పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన భక్తులు సలేశ్వరం లింగమయ్య సన్నిధానం ఎదురుగా జాలువారుతున్న జలపాతంతో నిండిన గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి పుణీతులయ్యారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలు ముగిసేవరకు దర్శనానికి వచ్చే భక్తులు ఇక్కడ ఉండటానికి వసతులు లేవు. లింగమయ్యను దర్శించుకొని మోకాళ్ల పర్వతం వద్ద ఏర్పాటు చేసిన విడిది కేంద్రాల్లో, రాంపూర్ చెంచుపెంటకు చేరుకొని భక్తులు విశ్రాంతి తీసుకుంటారు. దాతలు ఏర్పాటు చేసిన మంచినీరు, అన్నదానం, అంబలి కేంద్రాలు భక్తులకు ఉపయోగపడుతున్నాయి. ఉదయం అల్పాహారం మొదలుకొని రాత్రి వరకు అన్నదానం ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం మంచినీటి సౌకర్యాన్ని కల్పించగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పోలీసులు రాత్రింబవళ్లు భద్రతాచర్యలు చేపట్టారు. పరహాబాద్ నుంచి రాంపూర్ చెంచుపెంట వరకు వాహనాలు క్రమపద్ధతిలో వచ్చేలా సూచనలు చేస్తూ ట్రాఫిక్ సమస్యను నియంత్రిస్తున్నారు. సన్నిధానం వద్ద భక్తులు క్యూలైన్ పాటించేలా చూస్తూ, జలపాతం వద్ద ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపట్టారు. వివిధ డిపోలకు చెందిన బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు.
నాగర్కర్నూల్/లింగాల, ఏప్రిల్ 6: లింగాల మండలం సలేశ్వరంలో గురువారం ఒకరు గుండెపోటుతో మృతిచెందగా ఊపిరాడక మహిళ మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. బుధవారం వనపట్ల నుంచి కుర్వ రాములుతో కలిసి సలేశ్వరం బయలుదేరిన చంద్రయ్య (50) గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. పోలీసుల సహకారంతో అక్కడి నుంచి అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఆమన్గల్కు చెందిన విజయ(40) ఊపిరాడక మృతి చెందగా మరికొంతమందికి గాయాలైనట్లు సమాచారం. కాగా భక్తుల తొక్కిసలాటలో కొంతమందికి గాయాలైనట్లు సమాచారం. జాతరకు మూడురోజుల సమయం ఇవ్వడంతోనే రద్దీ ఎక్కువై భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, సమయం పెంచాలని ప్రజలు కోరుతున్నారు.