మహబూబ్నగర్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నట్లు బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం భూత్పూర్ రోడ్డులోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముందుగా ఎమ్మెల్యేగా గెలుపొందిన యెన్నం శ్రీనివాస్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఎన్నికల్లో తన కోసం కష్టపడి పనిచేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఓడి నా కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని స్ప ష్టం చేశారు. వలసల జిల్లా పేరును రూపు మాపేందుకు తీవ్రంగా కృషి చేశానని చెప్పారు. పదేండ్లుగా నియోజకవర్గానికి అనేక పనులు చేశాం. మేం మంజూరు చేసి మిగిలిపోయిన పనులను కొత్త ఎమ్మెల్యే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బడ్జెట్ హోటళ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎకోపార్క్లో బర్డ్స్ ఎన్క్లోజర్, 26వేల ఎకరాల్లో జంగిల్ సఫారీ, అమరరాజా పరిశ్రమ, మన్యంకొండ రోప్వే, ఐటీ టవర్ కంపెనీల రాక, రింగ్ రోడ్డు, హజ్ హౌస్, క్రిస్టియన్ భవన్, జర్నలిస్టుల ఇండ్లు, మైనారిటీ గురుకుల కాంప్లెక్స్, జేఎన్టీయూ క్యాంపస్, కొత్త ఎస్పీ కార్యాలయం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వంటి అనేక పనులను పూర్తి చేయాల్సి ఉందని గుర్తు చేశారు.
అధికారులు కూడా వారికి సహకరించాలని కోరారు. అన్ని కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చామని వాటిని పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రితో ఉన్న అనుబంధంతో అనేక పనులు చేశామని, మా మీద కోపంతో ఈ అభివృద్ధి పనులను ఆపవద్దన్నారు. విధి నిర్వహణలో ఏమన్నా ఇబ్బంది పెట్టి ఉంటే అన్యదా భావించవద్దని అధికారులకూ విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేకు అవసరమైతే నా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ముఖ్యంగా కొంతమంది అసత్య ప్రచారం చేయడం నన్ను ఎంతో బాధ పెట్టింది. భూములు, ఆస్తులు గుంజుకుంటే ఎవరైనా ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. లేనిపోని ఆరోపణలు చేయడమే తనను తీవ్రంగా బాధిస్తుందన్నారు. ఏది ఏమైనా ప్రజలకు పదేండ్లు సేవ చేసే అవకాశం కలిగించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఓటమికి మేం కుంగిపోం.. ప్రజా సమస్యల పరిష్కారానికి చేసే పోరాటంలో ముందుంటామని ప్రకటించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్ తదితరులు ఉన్నారు.
అచ్చంపేట, డిసెంబర్ 3 : తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు అచ్చంపేట ప్రజలే శ్వాసగా, ఊపిరిగా ఉన్న తనను ఈస్థాయికి తీసుకువచ్చిన అచ్చంపేట ప్రజల కోసమే జీవిస్తానని అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2009లో ఎంపీగా పోటీ చేసినప్పుడు నాకు రాజకీయంగా ఎదగడానికి పునాదులు వేసి అప్పుడు ఓడిపోయినా ఆ తర్వాత 2014, 2018 ఎన్నికలలో రెండుసార్లు గెలిపించి నన్ను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన అచ్చంపేట ప్రజానీకానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు ఏ రకంగా ఉన్న దానిని ప్రజాస్వామ్యబద్ధంగా స్వీకరించి ముందుకెళ్తామని అన్నారు. ప్రజాతీర్పే శిరోధార్యంగా, ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే కొలమానంగా తీసుకొని ప్రజలతో కలిసి ఉంటామన్నారు. ఈ రోజు వెలువడిన ఫలితాలలో బీఆర్ఎస్ శ్రేణుకు కుంగిపోవాల్సిన అవసరం లేదని, మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసం పనిచేద్దామని అన్నారు. ప్రజా సమస్యల పరిషారం విషయంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ఒకవేళ మంచి చేస్తే సహకరిద్దాం,
ప్రజలకు విరుద్ధంగా మనోభావాలకు హానీ చేస్తే గత పోరాట అనుభవాలను కూడా పరిగణలోనికి తీసుకొని నూతన ఉత్సాహంతో ప్రజలల్లోకి పోరాటాలతో ముందుకు వెళ్దామన్నారు. అలాగే ఈ రోజు గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నందున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే వారి పాలన ప్రజాస్వామ్యయుతంగా కొనసాగాలని ప్రజలందరికీ మేలు చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా తన కోసం శ్రమించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కాంగ్రెస్ ఆగడాలు, దౌర్జన్యాలకు భయపడవద్దని, కార్యకర్తలు, అభిమానులకు అండగా ఉంటానని అన్నారు. ప్రాణత్యాగానికైన సిద్ధపడతానని అన్నారు. నన్ను గెలిపించడం కోసం మీ శ్రమ నాకళ్లలో కదలాడుతుంది. రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లో వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రణాళికలు రూపొందించుకుందామన్నారు. గాలికి వదిలేసేప్రసక్తే లేదన్నారు. వెన్నంటు ఉంటా అందరం కలిసికట్టుగా అచ్చంపేటకు మంచి కోసం పనిచేద్దామన్నారు.