ఆత్మకూరు, ఏప్రిల్ 17: ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కరువై ఆత్మకూరు, అమరచింత పట్టణాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఉమ్మడి మండలంగా ఉన్న ఆత్మకూరు సంస్థానాధీశుల కాలం నుంచి ఉమ్మడిజిల్లాలోనే తాలూకా కేంద్రంగా పేరొందింది. పునర్విభజన తర్వాత అభివృద్ధికి ఆమడ దూరంలో.. మక్తల్ నియోజకవర్గంలో చిట్టచివరి మండలంగా అభివృద్ధి ఫలాలు దక్కని ప్రాంతంగా నిలిచింది. స్వరాష్ట్ర సాధన తర్వాత.. తొమ్మిదేండ్లలో ఆత్మకూరు, అమరచింత పట్టణాలు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మారాయి. ఆత్మకూరు నుంచి అమరచింత నూతన మండలంగా విడిపోయి అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఈ రెండు పట్టణాలు మున్సిపాలిటీలుగా అవతరించాక.. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిధులు సమకూర్చడంతో అభివృద్ధి పథంలో దూసుకపోతున్నాయి.
20 ఏండ్లుగా ఆత్మకూరు ప్రజల చిరకాల కోరిక.. మున్సిపాలిటీ ఏర్పాటుతో తీరింది. మున్సిపాలిటీగా మారిన ఆరునెలలకే పట్టణంలో రోడ్డు విస్తరణకు అంకురార్పణ చేశారు. ఎన్నో అవరోధాలను ఎదుర్కొని ఎమ్మెల్యే చిట్టెం చొరవతో వ్యాపారస్తుల సహకారంతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. సుమారు రూ.2 కోట్లతో రోడ్డు, డివైడర్, బటర్ఫ్లై లైటింగ్ పనులు శరవేగంగా చేపట్టారు. ఇప్పటికే ఇరువైపులా సైడ్ డ్రైన్స్ పూర్తి కాగా ప్రధానరోడ్డు ఓ రూపానికి వచ్చింది. ఇరుకైన రోడ్లతో ఏండ్లుగా ఇబ్బందులను ఎదుర్కొన్న మండలవాసులకు రోడ్డు విస్తరణ పనులతో వెసులుబాటు కలుగనున్నది.
ఆత్మకూరు, అమరచింత పట్టణాల్లోని వ్యాపారులు ఏండ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారం చేసుకునేందుకు స్థలాలు లేక, రోడ్ల వెంట, డ్రైనేజీ పక్కన సరుకులు ఉంచి అమ్ముకునేవారు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పరిష్కారం చూపలేదు. రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ నేతృత్వంలో ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించి, సమీకృత మార్కెట్ భవనాలను నిర్మించేందుకు పూనుకున్నారు. దీంతో ఆత్మకూరు, అమరచింతలో పెద్ద దుకాణాలతో వ్యాపారాలు చేసుకునేందుకు సమీకృత మార్కెట్ భవనం ఏర్పాటవుతున్నది. ఇప్పటికే భూమిపూజ చేయగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. రూ.2 కోట్లతో నిర్మిస్తున్న ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే ప్రజలకు అవసరమైన అన్ని వస్తువులు, సరుకులు ఓకే చోట దొరుకకకుతాయి. మాంసం, చికెన్, కూరగాయలు, చేపలు, పూలు, పండ్లు ఇలా అన్ని రకాల వ్యాపారులకు పక్కా దుకాణాలు కేటాయించనున్నారు. రెండు పట్టణాల్లోనూ సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటి ఏర్పాటుతో ఆయా పట్టణాల్లో వీధి, చిరు వ్యాపారులకు మేలు జరుగనున్నది. స్వరాష్టంలో స్థలంతోపాటు మార్కెట్ నిర్మించి ఇస్తుండడంతో వ్యాపారులు హర్షిస్తున్నారు.