నారాయణపేట : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏడేళ్ల చిన్నారి ( Child Death ) మృతి కలకలం రేపింది. నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామానికి చెందిన కమ్మరి వెంకట్రాములు కుమార్తె చైత్ర (7) రెండు రోజులుగా జ్వరం ( Fever ) తో బాధ పడుతుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చిన్నారి పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆస్పత్రికి ( Government Hospital ) తీసుకొచ్చారు. దాదాపు ఐదు గంటల పాటు వైద్యం కోసం ఎదురుచూసినా సరైన స్పందన లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. చిన్నారి పరిస్థితి మరింత విషమించడంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ కిడ్స్ హాస్పిటల్కు తీసుకెళ్లగా అక్కడ కూడా సరైన వైద్యం అందలేదని పేర్కొన్నారు.
తిరిగి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా 15 నుంచి 20 నిమిషాల్లోనే చిన్నారి మృతి చెందిందిదని వివరించారు. డాక్టర్లు కనీసం ముట్టుకుని కూడా చూడలేదని విలపించారు. చిన్నారికి సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే మృతి చెందిందని ఆరోపించారు. పేషెంట్ బెడ్ వద్ద ఎవరూ కనిపించలేదని డాక్టర్ తెలిపారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
తాము తెల్లవారుజామున 4 గంటలకే ఆస్పత్రికి వచ్చి ఉదయం 9 గంటల వరకు అక్కడే ఉన్నామని బాలిక తల్లిదండ్రులు వివరించారు. ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి మృతి చెందే వరకు జరిగిన పరిణామాలను పూర్తిగా పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరారు. వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు విచారణలో తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే చిన్నారి మృతికి అసలు కారణాన్ని స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.