వనపర్తి, డిసెంబర్ 24 : అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహార లోపం ఉండకూడదనే ఉద్దేశంతో ఐసీడీఎస్ జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పోషణ అభియాన్ కార్యక్రమం కింద కూరగాయలను సాగు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని ఖాళీ స్థలాల్లో టీచర్లు, ఆయాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కూరగాయల సాగు ప్రారంభించారు. ప్రస్తుతకాలంలో ప్రతి వస్తువులో కల్తీ ఉంటున్నది. అలాంటి వాటిని తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటున్నది.
కల్తీని నివారించడంతోపాటు ఖాళీ స్థలాన్ని వినియోగించుకోవాలని కూరగాయలను పెంచుతున్నారు. అంతేకాకుండా తాజా కూరగాయలతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వంట చేయొచ్చని అధికారులు వెల్లడించారు. అంగన్వాడీ సూపర్వైజర్లు, ఐసీడీఎస్ జిల్లా అధికారులు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బందికి సాగుపై పలు సూచనలు చేస్తున్నారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా మూడు సెక్టార్లు ఉండగా.. అందులో 549 అంగన్వాడీ కేంద్రాలు (545 అంగన్వాడీలు, 44 మినీ అంగన్వాడీలు) ఉన్నాయి. ఇందులో 1-3 ఏండ్ల లోపు 12,079, 3-6 ఏండ్ల లోపు 12,467 మంది చిన్నారులు, 3,296 మంది గర్భిణులు, లోపపోషణతో 3,188 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు బెండకాయ, టమాట, పాలకూర, కాకరకాయ, క్యాబేజీ, మిర్చి, గోంగూర, పాలకూర విత్తనాలను ఉద్యానవన శాఖ నుంచి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నారు.
పోషకాహార లోప నివారణకు కృషి..
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఖాళీస్థలాల్లో కూరగాయల సాగును ప్రారంభించాం. కేంద్రాల వద్ద సాగైన కూరగాయలనే వండుతున్నాం. ఎలాంటి రసాయనాలు వాడడం లేదు. కేవలం సేంద్రియ ఎరువులనే వినియోగిస్తున్నాం. దీంతో పోషకాహార లోప నివారణకు కృషి చేస్తున్నాం.
– పుష్పలత, ఐసీడీఎస్ జిల్లా అధికారిణి, వనపర్తి