తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించింది. దీనికి తోడు విద్యార్థులు టిప్”ట్యాబ్’గా చదువుకోవాలని ఆకాంక్షించిన సీఎం కేసీఆర్ పాఠశాలలకు ట్యాబ్లు అందించాలని నిర్ణయించారు. బడిలో పది మంది ఉంటే ఒకటి.. 150కిపైగా ఉండే రెండు ట్యాబ్లను ఈ విద్యాసంవత్సరం పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. జోగుళాంబ గద్వాల జిల్లాకు 435 ట్యాబ్లను ప్రాథమిక, ప్రాథమికోన్నత బడులకు కేటాయించారు. ఇకపై విద్యార్థులు, పాఠశాలల వివరాలు అందులో నమోదు చేయనున్నారు. ఫేస్ రికగ్నైజ్తో కచ్చితమైన సమాచారం అధికారులకు చేరనున్నది.
అయిజ, మే 28 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమం ద్వారా సర్కార్ బడుల్లో కార్పొరేట్ తరహా వసతులను కల్పిస్తున్నది. విద్యార్థులను చదువుతోపాటు క్రీడల్లోనూ ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నది. పాఠశాలల సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేసి, మరింత పారదర్శంగా తోడ్పాటు అందించేందుకు సర్కార్ బడులకు ట్యాబ్లను పంపిణీ చేయనున్నది.
జోగుళాంబ గద్వాల జిల్లాలోని 367 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వం ట్యాబ్లను అందించనున్నది. పీఎస్లు 285, యూపీఎస్లు 82 ఉండగా.. 435 ట్యాబ్లను సరఫరా చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంతోపాటు ఉపాధ్యాయుల్లో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ప్రగతి నివేదిక కోరనుంది. అందులో భాగంగానే జిల్లాలోని ఏఏ పాఠశాలలకు ఎన్ని ట్యాబ్లు ఇవ్వాలని నిర్ణయించి ప్రణాళికలు రూపొందించింది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే హెచ్ఎంలకు ట్యాబ్లను పంపిణీ చేయనున్నారు.
ట్యాబ్లో పాఠశాల వివరాలు, విద్యార్థుల సంఖ్య, విద్యార్థుల ఫేస్ రికగ్నైజ్తో అనుసంధానం చేస్తూ రోజువారీగా హాజరు నమోదు చేయాలి. ట్యాబ్లో ఫేస్ రికగ్నైజ్తో కచ్చితమైన సమాచారం అధికారులకు చేరనున్నది. ప్రతిరోజూ ప్రగతి నివేదిక నమోదు చేయడంతోపాటు ట్యాబ్లో నమోదైన వివరాల మేరకు మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలకు అవకాశం ఉండదు. రోజూవారీగా విద్యార్థులకు అం దుతున్న విద్య, విద్యార్థి ప్రగతి, ఇతర అంశాల నివేదికను ట్యాబ్లో అప్లోడ్ చేయగా.. అధికారులు పర్యవేక్షిస్తారు. పదిమంది విద్యార్థులకు మించి ఎక్కువగా ఉంటే ఒక ట్యాబ్.. 150మందికి పైగా విద్యార్థులు ఉంటే రెండు ట్యాబ్లు అందించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ట్యాబ్ల వినియోగం, వివరాల నమోదుపై హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభంకాగానే ట్యాబ్లను అందించనున్నారు.
జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమగ్ర వివరాల నమోదుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పాఠశాలల వివరాలు, విద్యార్థుల సంఖ్య, ఫేస్ రికగ్నైజ్, మధ్యాహ్న భోజన వివరాలు వంటివి నమోదు చేయాల్సి ఉంటుంది. పీఎస్, యూపీఎస్లకు ట్యాబ్లు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. జిల్లాకు 435 ట్యాబ్లను ప్రభుత్వం అందించింది. పాఠశాలలు ప్రారంభంకాగానే హెచ్ఎంలకు అందించి వివరాల నమోదుకు చర్యలు చేపడుతాం.
– శాంతరాజు, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి, జోగుళాంబ గద్వాల