మహబూబ్నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 26 : కొవిడ్ ముప్పు మరోసారి ముంచుకొస్తున్నది. దేశంలో, రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్కు చెందిన జేఎన్-1 సబ్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకుగానూ, కొత్త వేరియంట్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ దవాఖానల్లో సర్వం సిద్ధం చేశారు.
మహబూబ్నగర్లో కరోనా కేసు నమోదైంది. మొత్తం 14 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఒకరికి పాజిటివ్గా వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాబోయే రోజుల్లో పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉండడంతో ముందస్తుగా సిద్ధమయ్యారు. ఇతర రాష్ర్టాలు, దేశాల నుంచి వ్యాపారుల, ఉద్యోగాల నిమిత్తం వచ్చే వారితో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరంతో పాటు కరోనా లక్షణాలు ఉంటే సమాచారం అందించాలని కోరారు. అయితే రోజురోజుకు వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తుండడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. నిర్లక్ష్యాన్ని వీడి మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని సూచించారు. కాగా ప్రస్తు త రేవంత్ ప్రభుత్వం మహాలక్ష్మీ పేరిట ఆర్టీసీ బ స్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. మరో నాలుగు రోజుల్లో డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకలను పు రస్కరించుకొని కేసులు పెరిగే అవకాశం లేకపోలేదు. ప్రజలు జాగ్రత్త లు పాటించేలా సూచిస్తున్నారు.
కొవిడ్ విస్తరిస్తుండడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. పాలమూరులో ఒక కేసు నమోదు కావడంతో జనరల్ దవాఖానలో 20 పడకలతో అత్యవసర వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేశాం. ఇన్ప్లూయెంజా మాదిరిగా శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలి. జ్వరం, దగ్గు, జలుబు, ముక్కు కారడం, గొంతు, తల నొప్పి లక్షణాలు కనిపిస్తే వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించు కోవాలి. ప్రస్తుతం చలి ఎక్కువగా ఉండడంతో విధిగా మాస్కు ధరించాలి. సామాజిక దూరం పాటించాలి. కొవిడ్ చికిత్సకు అవసరమైన అన్ని వైద్య పరికరాలు, మందులు దవాఖానలో అందుబాటులో ఉన్నాయి. ఐసీయూలో వెంటిలేటర్లు, ప్రతి బెడ్కు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం.