కోస్గి, నవంబర్ 30 : ప్రజల భద్రతపై పోలీసులు నమ్మ కం కలిగించాలని, ప్రజలకు ఎల్లవేళలా పోలీసులు అందుబాటులో ఉంటారని డీఎస్పీ మధుసూదన్రావు అన్నారు. మంగళవారం మండలంలోని నాచారం గ్రామంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలు, 3 ఆ టోలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అనుమానిత, కొత్త వ్యక్తుల కదలికలపై స్థానిక ప్రజలు నిఘా ఉంచాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. మనకు తెలియకుండానే చుట్టుపక్కల నేరస్తులు నివాసం ఉండి సంచారం చేసే అవకాశాలు ఉంటాయని, అటువంటి వ్యక్తుల ఆట కట్టించేందుకు కార్డన్ సెర్చ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇం డ్లను కొత్త వ్యక్తులకు అద్దెకు ఇచ్చేముందు ఆధార్, ఓటరు తదితర గుర్తింపుకార్డులను పరిశీలించాలన్నారు. అదేవిధంగా కొత్త వ్యక్తుల నుంచి వాహనాలు కొనుగోలు చేసి సమస్యలను కొని తెచ్చుకోవద్దని తెలిపారు. అలాగే నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలందరూ స్నేహభావంతో ప్రశాంత వాతావరణం లో ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఇద్దరు సీఐలు, 9 మంది ఎస్సైలు, 32 మంది పోలీసు సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.