వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు కాలిబాట సరిగ్గా లేక దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అండగా నిలుస్తున్నారు. పొలాలకు వెళ్లేందుకు మట్టిరోడ్లు వేసి ఏండ్ల సమస్యకు పరిష్కారం చూపుతున్నారు. సొంత నిధులు వెచ్చించి రోడ్లు వేయిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– నవాబ్పేట, ఆగస్టు 27
మండలంలోని పలు గ్రామాల్లో పొలాలకు వెళ్లేందుకు రోడ్డ సదుపాయం లేక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే సొంత నిధులు వెచ్చించి 20 రోజులుగా రోడ్లు వేయిస్తున్నారు. జేసీబీ, ఇటాచీ, ట్రాక్టర్లు వంటి వాహనాలతో పనులు కొనసాగుతున్నాయి. మండలంలోని కేశవరావుపల్లి బీటీ రోడ్డు నుంచి చెరువుకట్ట మీదుగా పొలాలకు రూ.6లక్షలతో 3కిలోమీటర్ల పొడవునా మట్టిరోడ్డు వేయించారు. అలాగే పోమాల శివారులోని గుట్టను చీల్చుతూ.. మల్కాపూర్ వరకు రూ.8లక్షలతో 4కిలోమీటర్ల మేర మటిరోడ్డు వేయించారు. రంగనాయకస్వామి గుట్ట నుంచి పోమాల గ్రామానికి రూ.5లక్షలతో మట్టి రోడ్డు వేయించారు. అలాగే తిమ్మయ్యపల్లి నుంచి చలివేంద్రంపల్లి మీదుగా కొత్తకుంట తండా వరకు రూ.7లక్షలు వెచ్చించి రోడ్డు వేయించారు. నవాబ్పేట రైతుల విజ్ఞప్తి మేరకు లోకిరేవు బీటీ రోడ్డు నుంచి పెద్ద చెరువు అలుగు పక్క నుంచి పొలాలకు వెళ్లేందుకు రూ.10లక్షలతో చేపట్టనున్న రోడ్డు పనులను జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, సర్పంచ్ గోపాల్ సోమవారం ప్రారంభించారు. మరో నాలుగైదు గ్రామాల్లో పనులు చేపట్టేందుకు మండల ప్రజాప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే సొంత నిధులతో రోడ్లు ఏర్పాటు చేస్తుండటంతో ఆయా గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మా ఊరు (తిమ్మయ్యపల్లి)నుంచి పొలాలకు వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడేవాళ్లం. ఇతరుల పొలాల మీదుగా వెళ్లేందుకు వారు ఒప్పుకునేవారు కాదు. మా సమస్యను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన పెద్ద మనసుతో స్పందించి రోడ్డు వేయించారు. దీంతో మా పొలాలతోపాటు చౌడాపూర్కు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఎమ్మెల్యే సార్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
కేశవరావుపల్లి బీటీ రోడ్డు నుంచి చెరువుకట్ట మీదుగా వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇటీవలే రోడ్డు వేయించారు. ఎన్నో ఏండ్ల నుంచి రోడ్డు లేక సుమారు 3కిలో మీటర్లు తిరిగి వెళ్లే వాళ్లం. రోడ్డు వేశాక మాకు ఎంతో సౌలత్గా మారింది. సుమారు 100మంది రైతులకు లాభం చేకూరింది. రోడ్డు వేయించిన లక్ష్మారెడ్డి సార్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– రాములు, రైతు కేశవరావుపల్లి