రైతు కష్టాలు తీర్చేందుకు కురుమూర్తి జలాలు తరలిరానున్నాయి. త్వరలో కరువు నేలన కృష్ణమ్మజలతాండవం చేయనున్నది. బీడు భూములనుముద్దాడనున్నది. దీంతో నీలవేణి రాకకోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు. 2015 జూన్ 11వ తేదీన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పైలాన్ను భూత్పూరులో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ లోనేఎక్కువటీఎంసీలు నిల్వ ఉంచే సామర్థ్యంతో నిర్మిస్తున్న కరివెన రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ. 3,265 కోట్ల వ్యయంతో 19 టీఎంసీల సామర్థ్యంతో పనులు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే 90 శాతానికిపైగా నిర్మాణం పూర్తయింది. ప్రాజె క్టు పరిధిలోని 1,51,094 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. విక్రమార్కుడిలా
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పట్టుబట్టడంతో పనులు పూర్తయి త్వరలో రైతుల జలకల సాకారం కానున్నది.
మూసాపేట, సెప్టెంబర్ 12 : నాటి పాలకుల నిర్లక్ష్యంతో భూముల్లో తుమ్మలు, తంగేళ్లు మొలిచాయి. సోయిలేని నే తలు, వలస పాలకుల ప్రభుత్వాలతో ఉమ్మడి పాలమూరు ప్రజలు కరువు కోరల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడారు. పట్టెడన్నం కోసం బతుకు జీవుడా అంటూ వలస బాట పట్టేవా రు. కన్నీటితో గడిపిన రోజులను పాలమూరు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఎక్కువ కిలోమీటర్లు కృష్ణమ్మ ప్రవహిస్తున్నా.. సాగునీటి మాట పక్కన పెడితే తాగునీటికి కూడా చుక్కనీరు లేక విలవిలలాడిన రోజులు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పా లనలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు సైతం పాలమూ రు ప్రజలకు అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి మేలు జరిగేలా కృష్ణానదికి గండి కొట్టి ప్రాజెక్టును ప్రారంభించారు
అభివృద్ధికి నోచుకోక సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న పాలమూరుకు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక 9 ఏండ్లలోనే పల్లె ప్రజల బతుకులను కనీవిని ఎరుగుని రీతిలో మార్చేసింది. నాడు వలస జిల్లాగా పేరుగాంచి న పాలమూరుకు నేడు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా తదిత ర రాష్ర్టాల నుంచి వేలాది మందికి బతుకుదెరువు చూయించే స్థాయిలో చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మేధావి వర్గం చెబుతోంది. తెలంగాణ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ స్వరాష్ట్రంలో మొదటి ప్రాజెక్టుగా పెండింగ్లో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. తక్కువ సామర్థ్యంతో ఉన్న ప్రాజెక్టును అనుభవజ్ఞులైన ఇంజినీర్ల సూచనల మేరకు సామర్థ్యం పెంచి ప్రాజెక్టు పనులను 2015 నవంబర్ 6న ముఖ్యమంత్రి ప్రారంభించారు.
అందులో ఒకటి (కరివెన)కురుమూర్తిరాయ ప్రాజెక్టు ప్రధానమైనది కావడంతో అక్కడే పైలాన్ను ప్రారంభించారు. ఆ రీడిజైన్ను చూసిన ఆంధ్రా పాలకులు కొంతమంది పాలమూరుకు కృష్ణాజలాలు రావడం జీర్ణించుకోలేని కొన్ని పార్టీల స్థానిక నేతలతో కోర్టుల్లో వందల్లో కేసులు వేయించారు. అడుగడుగునా కేసులు వేస్తూ అడ్డుపడుతూ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడో పూర్తి కావాల్సిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు ఆశించినస్థాయిలో ముందుకు సాగలేదు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా ముఖ్యమంత్రి కేసీఆర్ అలుపెరగకుండా ఎప్పటికప్పుడు వారి కుట్రలను పసిగట్టి ఒక్కొక్కటిగా కేసులు ముగించుకుంటూ వచ్చారు. ఇటీవల ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిస్థాయిలో అనుమతులు రావడంతో ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న పాలమూరు ప్రజల ఆకాంక్షను నేరవేర్చేందుకు 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు వస్తున్నారు. అందుకు సంబంధించిన పనులు కూడా వేగంగానే సాగుతున్నాయి.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం అప్పట్లో కసరత్తు మొదలు పెట్టింది. ప్రాజెక్టులు ఎక్కడ నిర్మించాలనే ఆలోచన చేస్తున్న సమయంలో నారాయణపేటజిల్లాకు చెందిన కొంతమంది రైతులు అక్కడ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకించారు. ఆ సమయంలోనే దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కరివెన గ్రామంలోని ఓ కార్యకర్త ఇంట్లో జరిగే వివాహ వేడుకకు హాజరై స్థానిక కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రస్తుతం కరివెన ప్రాజెక్టు ఉన్న ప్రదేశాన్ని చూశారు. ఆయన ఒక ఇంజినీర్ కావడంతో ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే ఎంత నీటినైనా నిల్వ చేయొచ్చని భావించారు. వెంటనే అందుకు సంబంధించి సొంతంగా ప్రైవేట్ ఇంజినీర్లతో కలిసి సర్వే చేయించారు. భారీ ప్రాజెక్టు వస్తుందని తేలడంతో పూర్తిస్థాయిలో నివేదికలు తయారు చేశారు.
అప్పటి జిల్లా మంత్రులతో పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి కరివెనలో ఉన్న ప్రాంతం గురించి వివరించారు. ఈక్రమంలో ఒకసారి ముఖ్యమంత్రి స్వయంగా ఇంజినీర్లను పిలుపించుకొని కబురుపెట్టడంతో పూర్తిస్థాయిలో నివేదికలతో ఎమ్మెల్యే ఆల హాజరై తక్కువ ఖర్చుతోపాటు తక్కువ భూములు ముంపునకు గురవుతాయని పూర్తిస్థాయిలో సీఎంకు వివరించారు. దీంతో వెంటనే కేసీఆర్ ప్రాజెక్టు నిర్మించాలని, అందుకు సంబంధించిన అధికారులను సర్వే చేసి నివేదికలు ఇవ్వాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
అయితే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో (కరివెన) కురుమూర్తిరాయ రిజర్వాయర్ పేరు లేని రోజుల్లో ఎమ్మెల్యే ఆల స్వయంగా పరిశీలించి ప్రాజెక్టును మంజూరు చేయించి స్వయంగా ముఖ్యమంత్రితోనే ఇక్కడ శంకుస్థాపన చేయించగా రైతుల నుంచి ఆయనకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. అదేవిధంగా మరో రూ.110కోట్లు మంజూరు చేయించి ఘనపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా పెద్దవాగుకు నీటిని తీసుకొచ్చి చెరువులు నింపడంతోపాటు చెక్డ్యాంలు నిర్మించడం వల్ల ఎమ్మెల్యే ఆల ఏ గ్రామానికి వెళ్లినా రైతులు గౌరవంతో స్వాగతిస్తున్నారు.
కురుమూర్తిరాయ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 19 టీఎంసీలు. అందుకు 6,724 ఎకరాలు అవసరం కాగా ప్రభుత్వం 6,716 ఎకరాలు భూసేకరణ చేసింది. 8 ఎకరాలు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. భూమిని ఇచ్చిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం కూడా చెల్లించింది. ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో కేవలం నాలుగు తండాలు (బోరినిగుట్ట తండా, ఎక్కులగుట్ట తండా, బట్టుపల్లి తండా, కరివెన చింతగట్టు తండా) మాత్రమే ముంపునకు గురయ్యాయి.
వారికి నష్టపరిహారం చెల్లించడంతోపాటు పునరావాసం కూడా కల్పించారు. ప్రాజెక్టు కట్టపొడవు 14.125 కిలోమీటర్లు ఉంటుంది. ప్రాజెక్టు కట్ట నిర్మాణం భూమి భాగంలో 420మీటర్లు ఉంటే 1,300 ఫీట్ల వెడల్పుతో కట్ట పనులు ప్రారంభించారు. కట్ట ఎత్తు 61.5 మీటర్లు ఉంటుంది. కట్ట పైభాగంలో వెడల్పు 6 మీటర్లు ఉంటుంది. కరివెన ప్రాజెక్టు పూర్తయితే మొత్తం 1,51,094 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని అధికారులు చెబుతున్నారు. పరోక్షంగా మరో 50వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
కురుమూర్తిరాయ రిజర్వాయర్తో మూడు జిల్లాలకు సాగునీరు అందనుంది. వట్టెం నుంచి 13వ ప్యాకేజీ కురుమూర్తిరాయ రిజర్వాయర్ వరకు 10 కిలోమీటర్ల పొడవునా గ్రావిటీ కెనాల్ ద్వారా నీరు వస్తుంది. అక్కడి నుంచి నారాయణపేట వరకు ప్రధాన కాల్వ ఉంటుంది. ఆ కాల్వ 113.550 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అందుకు ప్రభుత్వం రూ.387.82కోట్లు మంజూరు చేస్తూ, టెండర్లను కూడా ఆహ్వానించింది. ప్రధాన కాల్వ నుంచి మండలాల వారీగా సాగునీరు అందించేందుకు 55 అనుబంధ కాల్వలు ఉంటాయి.
విద్యుత్ మోటర్ల వినియోగం లేకుండానే మహబూబ్నగర్, వికారాబాద్, నారాయణపేట జిల్లాలను అనుసంధానం చేస్తూ కాల్వను రూపకల్పన చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో 36,339 ఎకరాలు, మహబూబ్నగర్ నియోజకవర్గంలో 9,758 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గంలో 2,512 ఎకరాలు, నారాయణపేల జిల్లా మక్తల్ నియోజకవర్గంలో 66,457 ఎకరాలు, నారాయణపేట నియోజకవర్గంలో 36,028 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ కాల్వ ద్వారా 13 మండలాలకు పుష్కలంగా సాగునీరు అందనుంది. మరో వైపు ఎలాంటి విద్యుత్ వినియోగం లేకుండానే ఉదండాపూర్ రిజర్వాయర్కు 9 కిలోమీటర్ల పొడవునా టన్నెల్ ద్వారా సాగునీరు తరలనున్నది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోథల పథకంలో భాగంగా కురుమూర్తిరాయ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.3,265కోట్లు మంజూరు చేసింది. పనులు వేగంగా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రాజెక్టు పనులను 3 భాగాలుగా విభజించింది. 13వ ప్యాకేజీ కింద 4.5 కిలోమీటర్ల వరకు ఒక భాగం, రెండోది 14వ ప్యాకేజీ కింద 4.5 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల వరకు, అక్కడి నుంచి 15వ ప్యాకేజీ కింద 14.125 కిలోమీటర్ల వరకు ఒక భాగంగా విభజించారు. అందుకు మూడు వేర్వేరు కంపెనీలు టెండర్లు వేసి పనులు చేస్తున్నారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక ఈఈ, ముగ్గురు డీఈలు, ఏడుగురు ఏఈలను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. వారి పరివేక్షణలోనే పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 92 శాతం పనులు పూర్తి కాగా అందుకు సంబంధించి రూ.3,002కోట్ల పనులు పూర్తయినట్లు అధికారులు వివరించారు.
నిస్వార్థంతో ప్రజల మంచి కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. కరివెన ప్రాంతాన్ని చూసి ప్రాజెక్టు వస్తుందని చెప్పడంతో నన్ను నమ్మి అధికారులను పంపి సర్వే చేయించారు. ఊహించని స్థాయిలో పెద్ద ప్రాజ్టెకును దేవరకద్ర నియోజకవర్గానికి మంజూరు చేశారు. నన్ను దేవరకద్ర నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిపించిన నాటి కంటే కరివెన ప్రాజ్టెకుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోజున ఎక్కువ సంతోషించారు. ఈక్రమంలోనే నా జీవితం ధన్యమైందని నియోజకవర్గ ప్రజల తరఫున నిండు సభలో సీఎం కేసీఆర్కు పాదాభివందనం చేశాను. నా జీవితం మొత్తం ఆయనకు కృతజ్ఞుడినై ఉంటాను.
ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను వెంట పెట్టుకొని కరివెన నుంచి అడ్డాకుల వరకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన నాతో మాట్లాడుతూ జానంపేట దాటిన తర్వాత వెంకన్న.. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న బీడు భూములన్నీ కొన్నేండ్లలోనే పచ్చని పంటలతో కళకళలాడుతాయని చెప్పారు. కేసీఆర్ సార్ చెప్పినట్లుగానే కురుమూర్తిరాయ రిజర్వాయర్ పూర్తి కాకముందే ఘనపూర్ కెనాల్ ద్వారా కృష్ణానది నీళ్లను తీసుకు రాగా రైతులు పుష్కలంగా పంటలు పండించుకుంటున్నారు.
ఎడారిలా ఉన్న వాగులు సైతం అలుగు పారుతున్నాయి. ఆ నీళ్లను చూసినప్పుడల్లా నాకు ఎంతో సంతోషం వేస్తుంది. కొంతమంది నిజాయితీ గల రైతులు పండించిన ధాన్యం కేసీఆర్ చలవే అని చెబుతుంటే ఆనందమేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులతోపాటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఊహకు అందని రితీలో చేపడుతున్నారు. పథకాలలో పార్టీలతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ అందిస్తున్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ అవుతుండడంతో కేసీఆర్ ఎంతో మందికి అండగా మారాడు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ జనం మెచ్చిన నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మా గ్రామ శివారుకు రావడం ఎంతో సంతోషం. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నా పొలం నాలుగెకరాలు పోయింది. వచ్చిన నష్ట పరిహారంతో నేను హైదరాబాద్లో రెండు ప్లాట్లు కొన్నా. ఓ ఇల్లు కూడా కట్టుకున్నా. మా ఊరి చుట్టుపక్కల పొలాలకు ఎంతో డిమాండ్ వచ్చింది. ఇది సంతోషించదగ్గ పరిణామం.
– గోపాల్రెడ్డి, భూ నిర్వాసితుడు, కొత్తూర్
మా ఊర్లో తాగడానికి నీళ్లు లేకుండే. మా ఊరోళ్లు ఎక్కువ మంది హైదరాబాద్, బయటి ప్రాంతాలకు వలసలు పోయేవారు. పొలాలు ఉన్నా సాగునీరు కూడా లేకుండే. దీంతో చాలామంది బతుకుదెరువు కోసం బయటికి వెళ్లేవారు. మా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పుణ్యాన మా ప్రాంతానికి ఈ ప్రాజెక్టు వచ్చింది. 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ నార్లాపూర్లో నీళ్లు వదులుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నీళ్లు వస్తే ఇక్కడి ప్రజల జీవితాలు ఊహించని విధంగా మారుతాయని ఆశిస్తున్నాం..
– కృష్ణారెడ్డి, రైతు, భట్టుపల్లి
ఐదేండ్లుగా పనిచేస్తున్నా..
ఐదేండ్లుగా కురుమూర్తిరాయ ప్రాజెక్టులో ఏఈగా పనిచేస్తున్నా. ప్రతి రోజూ ఉన్నతాధికారుల ఆదేశానుసారం పనులను పర్యవేక్షిస్తున్నా. వారు సూ చించిన మేరకు పనులు వే గంగా చేయిస్తున్నాం. నాణ్యతలో రాజీ లేకుండా పనులు జరుగుతున్నాయి. ఇంత పెద్ద ప్రాజెక్టులో పనిచేస్తుందుకు ఎంతో సం తోషంగా ఉంది. ప్రాజెక్టు నిర్మాణంలో నాకు చాలా అనుభవం వచ్చింది.