PRLIS | కరువును శాశ్వతంగా దూరం చేసేందుకు కృష్ణమ్మ తరలిరానున్నది. బీడు భూముల్లో కృష్ణమ్మను పారించేందుకు అపర భగీరథుడిలా సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో అన్నిఅడ్డంకులను అధిగమించి పాలమూరు ఎత్తిపోతల పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఉమ్మడి పాలమూరు జిల్లా కరువును రూపుమాపేందుకు రూ.52 వేల కోట్ల వ్యయంతో చేపట్టింది. ఈ క్రమంలో ప్రాజెక్టులో భాగమైన వట్టెం రిజర్వాయర్ వడివడిగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది.
మూడో లిఫ్టుగా పేరొందిన వెంకటాద్రి రిజర్వాయర్ను బిజినేపల్లి మండలం వట్టెం సమీపంలో రూ.5,025కోట్లతో నిర్మిస్తున్నారు. 16.74 టీఎంసీల సామర్థ్యం.. 15కిలోమీటర్ల పొడవైన బండ్ నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయి. 16న నార్లాపూర్ వద్ద వెట్న్న్రు సీఎం కేసీఆర్ప్రారంభించనున్నారు. అక్టోబర్లో ఏదుల రిజర్వాయర్ నుంచి 6.4 కి.మీ. గ్రావిటీ ద్వారా.. 22 కి.మీ. టన్నెల్లో ఎగబాకుతూ జలాలు తరలివచ్చి రిజర్వాయర్లో సవ్వడి చేయనున్నాయి. రిజర్వాయర్కు 2 టీఎంసీల చొప్పున నాలుగింటిని 8 టీఎంసీలతో నింపే పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే నియోజక వర్గంలో 1.33 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందనున్నది. దీంతో రైతులు, ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పాలమూరు ప్రాజెక్టుకు అడ్డంకులన్నీ తొలగడంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కోర్టు కేసులు వీడి.. గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు రావడంతో ఇంజినీర్ల పర్యవేక్షణలో సిబ్బంది రేయింబవళ్లు పనులు చేస్తున్నారు. ప్రాజెక్టు మొదటి లిఫ్ట్ నార్లాపూర్ వద్ద 16న వెటరన్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వెంకటాద్రి రిజర్వాయర్ పనులు వడివడిగా జరుగుతున్నాయి. రూ.5,025 కోట్ల వ్యవయం తో.. 16.74 టీఎంసీల సామర్థ్యం.. 15 కిలోమీటర్ల బండ్ నిర్మాణంతో రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. చివరి దశకు పనులు చేరగా.. త్వరలోనే ఏదుల నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఈ రిజర్వాయర్ నుంచి అక్టోబర్లో సాగునీటిని విడుదల చేయనుండగా.. 1.33 లక్షల ఎకరాల్లో కృష్ణా జలాలు తాండవం చేయనున్నాయి.
– నాగర్కర్నూల్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ)
నాలుగు రిజర్వాయర్లు.. 8 టీఎంసీలు
పాలమూరు ప్రాజెక్టులోని నాలుగు రిజర్వాయర్లను 8 టీఎంసీలతో నింపేందుకు ప్రభుత్వం పనులను వేగిరం చేసింది. ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లను రెండు టీఎంసీల చొప్పున నింపనున్నారు. ఇలా వట్టెం రిజర్వాయర్ సాగునీటితో పాటుగా తాగునీటికి తిప్పలు తీరనున్నాయి. అలాగే హైదరాబాద్లోని పరిశ్రమలకు సైతం నీళ్లు అందించేలా రిజర్వాయర్ రూపొందింది. ఇంతటి బృహత్తర లిఫ్టు తుది దశకు చేరి ప్రారంభోత్సవానికి సిద్ధం కానుండటంతో రైతులు, ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రశంసిస్తున్నారు. పాలమూరు ఎంపీగా పని చేసి తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ కరువును శాశ్వతంగా రూపుమాపేలా పాలమూరు ఎత్తిపోతలను ప్రజలకు అంకితం చేయనుండటంతో ఊరూరా సంబురాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
6.4 కి.మీ. గ్రావిటీ.. 22 కి.మీ. టన్నెల్
వట్టెం రిజర్వాయర్కు ఏదుల నుంచి వచ్చే నీరు కొద్ది దూరం కాల్వల మీదుగా.. మరికొంత దూరం సొరంగంలో పారనున్నది. 6.4 కిలో మీటర్లు గ్రావిటీ మీదుగా.. తర్వాత 22 కిలోమీటర్లు టన్నెల్లో ఎగబాకి వెంకటాద్రి రిజర్వాయర్కు చేరనున్నాయి. ఇక్కడి నుంచి కరివెనకు 9.75 కిలోమీటర్ల దూరంలో కాల్వల ద్వారా నీటిని ఎత్తిపోయనున్నారు. ప్రసుతం ప్రాజెక్టు పనులు తుది దశకు చేరగా.. రాబోయే పక్షం రోజుల్లో పూర్తి కానున్నాయి. 3న నార్లాపూర్ వద్ద డ్రైరన్ విజయవంతం కాగా 16న సీఎం కేసీఆర్ అంజనగిరి లిఫ్టును ప్రారంభించనున్నారు. దీంతో 2 టీఎంసీల మేర నీటితో నార్లాపూర్ జలాశయాన్ని నింపి ఏదులకు, అక్కడి నుంచి వట్టెం రిజర్వాయర్కు నీటిని తరలించనున్నారు. ఈ రిజర్వాయర్ను కూడా 2 టీఎంసీలతో నింపనున్నారు. అనంతరం కరివెనకు వట్టెం నుంచి నీటిని ఎత్తిపోస్తారు. ఈ ప్రక్రియ వచ్చే నెలలో పూర్తి కానున్నది.
16.74 సామర్థ్యం.. 1.33 లక్షల ఎకరాలకు నీరు
వట్టెం రిజర్వాయర్ను 4,700 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. కట్ట పొడవు 15 కిలోమీటర్లు కాగా 16.74 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉండటం గమనార్హం. దీంతో నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 1.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఇప్పటికే ఎంజీకేఎల్ఐ ద్వారా లక్ష ఎకరాలకుపైగా విస్తీర్ణంలోని భూములకు సాగునీరు అందుతున్నది. వట్టెం లిఫ్టు అందుబాటులోకి వస్తే నియోజకవర్గంలో దాదాపుగా 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టును సమైక్య పాలనలో దశాబ్దానికిపైగా పెండింగ్లోనే ఉంచగా.. తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ అదే పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన పనులు కేసులను ఛేదిస్తూ ఏడేళ్లలోనే పూర్తి కానున్నది.
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. రిజర్వాయర్లను స్వయంగా పరిశీలించి పనుల వేగవంతానికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి, సాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో కేసులకు అడ్డంకులు తొలగిన సందర్భంలో పనులను వేగవంతం చేస్తూ వచ్చారు. ఇందుకోసం రాష్ట్ర ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డితో పాటుగా ఇద్దరు సీఈలు, నలుగురు ఎస్ఈలు, ఆరుగురు ఈఈలు, ఇంకా డీఈలు, ఈఈలు, ఏఈఈ.. ఇలా ఇంజినీర్లు, సిబ్బంది నిరంతరాయంగా పనులు చేస్తూ రిజర్వాయర్ పనులను తుది దశకు తీసుకొచ్చారు.
ఎమ్మెల్యే మర్రి, అధికారుల చొరవ
వెంకటాద్రి రిజర్వాయర్ నిర్మాణంలో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రత్యేకంగా రైతులను, ప్రజలను రిజర్వాయర్ నిర్మాణం కోసం వారు ఒప్పించారు. ప్రభుత్వం నుంచి రైతులు, ప్రజలకు అందాల్సిన పరిహారం కూడా సకాలంలో అందించారు. దీంతో పనుల్లో ఎలాంటి అడ్డంకాలు రాకుండా దాదాపుగా ప్రశాంతంగా జరిగే అనుకూల పరిస్థితులు ఇంజినీర్లకు కలిసివచ్చాయి.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్, ఏదుల తర్వాత మూడోది వట్టెం (వెంకటాద్రి) రిజర్వాయర్. రూ.5,025 కోట్లతో 2016 జూన్లో ఈ లిఫ్టు పనులు ప్రారంభించారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేపట్టగా ఇప్పటికే 90 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ఇంజినీర్ల నిరంతర పర్యవేక్షణతో గడువులోగానే పనులు పూర్తి కానున్నాయి. ఈ లిఫ్టులో భాగంగా 9 మోటర్లతో నీటిని ఎత్తిపోయనున్నారు. ఇందులో ఒకటి అదనంగా నిర్మించనున్నారు. ఏదైనా సమయంలో అనుకోకుండా సమస్య తలెత్తితే ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా తొమ్మిది మోటర్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఒక్కో మోటర్ 145 మెగావాట్ల సామర్థ్యం ఉండడంతో ఒక్కో మోటర్ ద్వారా 75 క్యూసెక్కులను తోడివేయొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో బిగించిన మోటర్లు 139 మెగావాట్లే.. ఉండగా ఇక్కడ అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాటిని ఇక్కడ ఏర్పాటు చేశారు. నార్లాపూర్ మొదటి లిఫ్టు నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ను రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలను ఎత్తిపోసేందుకు ప్రణాళికలు రూపొందించారు. దీంతో తక్కువ రోజుల్లోనే వరదలు వచ్చే సమయంలో కృష్ణా నీటిని ఎత్తిపోసేందుకు అధిక సామర్థ్యం ఉన్న మోటర్లను బిగించారు. ఈ మోటర్లు కూడా ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్వి కావడం ప్రత్యేకం.
వెంకటాద్రి రిజర్వాయర్లో భూములు ముంపునకు గురయ్యాయి. కారుకొండ, అనెకాన్పల్లి, అనెకాన్పల్లితండా, రాంరెడ్డిపల్లి, జీగుట్ట తండాల్లో 3,600 ఎకరాలను ప్రాజెక్టు కోసం సేకరించారు. ఆయా గ్రామాలు ముంపునకు గురి కానున్నాయి. దీంతో వట్టెం గుట్ట వద్ద 63 ఎకరాల్లో ప్రభుత్వం గ్రామాన్ని కూడా నిర్మిస్తోంది. ఇందులో భాగంగా 466 మందికి ఇండ్లను కట్టి అందజేయనున్నది. ఈ గ్రామంలో పాఠశాల, దవాఖాన, అంగన్వాడీ, పంచాయతీలాంటి పలు కార్యాలయాలనూ నిర్మిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.12.50 లక్షలను పరిహారంగా పంపిణీ చేసింది. చాలా మంది ఇంటి నిర్మాణాలను చేపడుతున్నారు. ఇక రైతులు ఇచ్చిన భూములకుగానూ ఎకరాకూ రూ.6 లక్షల నుంచి రూ.12.50 లక్షల వరకు పరిహారంగా అందించడం గమనార్హం.
పదేండ్ల కిందట నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని భూములు ముళ్ల పొదలతో ఎకరం రూ.లక్ష కూడా పలకని పరిస్థితి ఉండేది. కానీ ఎంజీకేఎల్ఐ సాగునీరు పారాక నేడు ఎకరం ధర రూ.20 లక్షలకు చేరింది. వట్టెం వద్ద వెంకటాద్రి రిజర్వాయర్ సాగునీరు పారితే ఇక నియోజకవర్గంలో వ్యవసాయం పండుగలా మారనున్నది. ఈ క్రమంలో భూముల ధరలు రెట్టింపయ్యే అవకాశం కూడా ఉన్నది. గతంతో పోల్చితే రైతులు ఇప్పటికే ఆర్థికంగా ఎంతో వృద్ధిలోకి వచ్చారు.
అక్టోబర్ 15 నాటికి సిద్ధంగా..
ఈనెల 16న సీఎం కేసీఆర్ నార్లాపూర్లో లిఫ్ట్ను ప్రారంభో త్సవం చేస్తున్నారు. వట్టెం లిఫ్ట్ను కూడా అక్టోబర్ 15వరకు సిద్ధం చేసేలా పనులను వేగంగా చేపడు తున్నాం. ఇప్పటికే లిఫ్ట్ పనుల్లో భాగంగా రిజర్వాయర్, మోటర్లు, విద్యుత్ సబ్స్టేషన్ నాళాలు పూర్తయ్యాయి. 90శాతం వరకు ప నులు చేపట్టాం. మిగిలిన ప నులను నిర్ణీత గడువులోగా చేపడు తాం. ఈ లిఫ్ట్ వల్ల నాగర్కర్నూల్లో లక్షా 30వేల ఎకరాలకు తాగునీరు అందుతుంది. సీఎం కేసీఆర్, ప్రభుత్వ సాకారంతో అనతికాలంలోనే లిఫ్ట్ పనులను పూర్తి చేస్తుండడం సంతోషంగా ఉంది.
– మురళి, ఈఈ వట్టెం లిఫ్ట్ ఇరిగేషన్
సీఎం పట్టుదల వల్లే సాధ్యమైంది..
సీఎం కేసీఆర్ పట్టుదల వల్లే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. వట్టెం రిజర్వాయర్ పనులు తుది దశకు చేర డం సంతోషంగా ఉంది. నాలుగేండ్ల కిందట పని చేసినప్పుడు భూ సేకరణకు ఎంతో కష్టంగా ఉండేది. నాటి కలెక్టర్ శ్రీధర్, జేసీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేసిన కృషితో ప్రజలు రిజర్వాయర్ పనులకు అంగీకరించారు. చిన్న ప్రాజెక్టు కట్టేందుకే ఎంతో కష్టంగా ఉండే పరిస్థితులు గతంలో ఉండేవి. అలాంటిది కాళేశ్వరానికి మించి పెద్దదైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పదేండ్లలోపు పూర్తి చేయడం గొప్ప విషయం. తక్కువ రోజుల్లో ఎక్కువ నీటిని ఎత్తిపోసేలా భారీ సామర్థ్యం ఉన్న మోటర్లను ఏర్పాటు చేయడం జరిగింది.
– ప్రభాకర్, రిటైర్డ్ ఈఈ
రూ.70లక్షల పరిహారం ఇచ్చారు..
వట్టెం రిజర్వాయర్ పనుల్లో నష్టపోయిన మాకు సీఎం కేసీఆర్ మా ఇంట్లో వెలుగులు నింపిండు. నాకున్న భూ మి, ఇల్లు కోల్పోయాను. ఎలా బతకాలో, ప్రభుత్వం ఏమిస్తదని అని బాధపడిన. ఎమ్మెల్యే మర్రి సార్కు చెప్పిన. కానీ నేను అనుకున్నదానికంటే ఎక్కువనే లాభం కలిగించిండు. వ్యవసాయ భూమి, ఇంటి ముందు ఖాళీ జాగాకు బదులుగా నాకు ప్లాట్ ఇచ్చిండ్రు. ఎకరాకు రూ.5.50లక్షలు, నష్టంగా రూ.12.50లక్షలు, 250గజాల ప్లాటు కూడా ఇచ్చారు. ఖాళీ జాగాకూ పరిహారం ఇచ్చిండ్రు. 18ఏండ్లు నిండిన నా కొడుకుకు కూడా నాలాగే ఇంటికి, పరిహారంగా కూడా డబ్బులు ఇచ్చిండ్రు. మేం కలలో కూడా ఇలా సర్కార్ సాయం చేస్తుందనుకోలే. ప్రాజెక్టు వస్తే మా బతుకులు ఆగమైతయనుకున్నం. ప్రాజెక్టు వస్తే ఎవరో లాభపడుతారు, మమ్మల్నెవరు పట్టించుకుంటారనుకున్నం. కానీ సీఎం సార్ మాకు చేసిన సాయంతో అప్పటి కంటే సంతోషంగా ఉన్నాం.
– రాత్లావత్ దేవుల్యా, కారుకొండతండా
తొందరగా ప్రాజెక్టు కట్టిండ్రు..
పాలమూరు ప్రాజెక్టుతో రైతులతోపాటు అందరికీ మేలు జరుగుతుంది. వ్యవసాయానికి కష్టాలు తీరుతాయి. తాగునీళ్ల సమస్య కూడా తీరుతుందని చెప్తున్నరు. ఇంత తొందరగా ప్రాజెక్టు పూర్తవుతదనుకోలే. కేసులేసిండ్రని చాలా సార్లు పనులాగినయ్. కేసులు పోయి మళ్లీ పనులు స్టార్ట్ చేసిండ్రు. చూస్తుండగానే నాలుగైదేండ్లలోనే ప్రాజెక్టును కట్టిండ్రు. పెద్ద కట్ట, పెద్ద పైపులను చూస్తుంటే అమ్మో, ఇంత పెద్ద ప్రాజెక్టా అనిపిస్తుంది. ఎమ్మెల్యే సార్ పెట్టిన మీటింగ్కు వెళ్లినప్పుడు నీళ్లు లేకుండనే ప్రాజెక్టు చూస్తే ఆశ్చర్యమైంది. నీళ్లు వస్తే ఇంక ఎలా ఉంటదో. ఏదేమైనా సీఎం కేసీఆర్ సార్కి, ఎమ్మెల్యే మర్రి సార్కు చేతులెత్తి మొక్కుతాం.
– రాజు, రైతు, కారుకొండ