ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత వైద్యరంగంలో పెనుమార్పులొచ్చాయి. సీఎం కేసీఆర్ ఆశయాలకనుగుణంగా ఎమ్మె ల్యేలు వైద్యసదుపాయాల కల్పనలో పోటీపడుతున్నారు. ఈ క్రమంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్మించిన మాడ్యులర్ చిల్డ్రన్ దవాఖాన ఆదర్శంగా నిలుస్తున్నది. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కృషితో వేల్స్ ఫార్గో సహకారంతో యునైటెడ్వే హైదరాబాద్, బెంగళూరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మాడ్యులర్ స్టార్టప్ వారు రూ. 4.20కోట్లతో వంద పడకల పిల్లల దవాఖానను ఏర్పాటు చేశారు. రెండేండ్లుగా వేలాది మంది నవజాత శిశువులకు వైద్యసేవలందించారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– నారాయణపేట టౌన్, ఆగస్టు 18
నారాయణపేట టౌన్, ఆగస్టు 18 : పేట ప్రత్యేక జిల్లాగా ఏర్పాటయ్యాక పలు రంగాల్లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కృషితో విద్య, వైద్య రంగాల్లో మరింత అభివృద్ధి జరిగింది. గతంలో చిన్నారులకు చిన్న జబ్బు చేసినా వైద్యం కోసం పట్టణంలోని ప్రైవేట్ దవాఖానలకు లేదా మహబూబ్నగర్, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లేవారు. కాగా జిల్లా కేంద్రంలో వంద పడకల మాడ్యులర్ చిల్డ్రన్ హాస్పిటల్ను ఏర్పాటు చేయడంతో తల్లిదండ్రులకు తిప్పలు తప్పింది. జిల్లాలోని వివిధ మండలాల ప్రజలతోపాటు సరిహద్దున ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని యాద్గీర్, ఇతర ప్రాంతాల ప్రజలు తమ పిల్లలను ఈ దవాఖానకు తీసుకొచ్చి వైద్యం చేయిస్తుండడం విశేషం.
2021 అక్టోబర్ 21వ తేదీన జిల్లా కేంద్రంలో మాడ్యులర్ చిల్డ్రన్ హాస్పిటల్ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కృషితోపాటు అప్పటి కలెక్టర్ హరిచందన చొరవతో పట్టణంలో చిన్నపిల్లల దవాఖాన ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. వేల్స్ ఫార్గో సహకారంతో యునైటెడ్ వే హైదరాబాద్, బెంగళూరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మోడ్యూలాస్ స్టార్టప్ వారు రూ. 4.20కోట్లతో 100 పడకల పిల్లల ఆసుపత్రిని నిర్మించారు. కోవిడ్ థర్డ్ వేవ్లో పిల్లలకు కొవిడ్ సోకితే చికిత్స అందించేలా ఈ దవాఖానను రూపొందించారు.
ఈ హాస్పిటల్ వైద్యులు ప్రైవేట్కు దీటుగా చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. గతంలో జిల్లా దవాఖానలోనే పిల్లలకు వైద్యం అందించేవారు. అప్పట్లో నిత్యం 100 నుంచి 150 మంది చిన్నారులను వైద్యానికి తీసుకు రాగా ప్రస్తుతం ప్రతిరోజూ 250 నుంచి 300మంది చిన్నారులకు వైద్యం అందిస్తున్నారు. దవాఖానలో మొత్తం 100 పడకలు ఉండగా ఎన్ఐసీయూ కోసం 2 వార్డులు, పీఐసీయూ కోసం 3 వార్డులు ఏర్పాటు చేశారు. వంద పడకల దవాఖానలో ఏర్పాటు చేసిన ఎన్ఐసీయూ(నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్) నవజాత శిశువులకు సంజీవనిలా మారింది. శిశువు ఉష్ణోగ్రత సాధారణం చేయడానికి, హైడ్రో యూనిట్లతో కామెర్లను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
నెలలో దాదాపు 700మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకుంటే రూ.వేలల్లో ఖర్చవుతుంది. కానీ ఈ ఆస్పత్రిలో ఇద్దరు చిన్న పిల్లల వైద్య నిపుణులు, నలుగురు శాశ్వత వైద్య సిబ్బంది ఎంతోమంది చిన్నారులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. కాగా వైద్యుల కోరిక మేరకు కలెక్టర్ శ్రీహర్ష 10మంది తాత్కాలిక సిబ్బందిని కూడా నియమించారు. కలెక్టర్ తన నిధుల నుంచి ఆ సిబ్బందికి వేతనాలు చెల్లిస్తున్నారు. వైద్యం కోసం వచ్చే చిన్నారులు, వారి వెంట వచ్చే వారికి తాగునీటి కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట వారు ఆర్వో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. మాడ్యులర్ చిల్డ్రన్ హాస్పిటల్ ఏర్పాటు, ఆధునికమైన చిక్సిత్సలు అందిస్తుండడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హాస్పిటల్లో 24గంటలు వైద్య సదుపాయాలు అందిస్తున్నాం. దవాఖానలో మరింత మంది శాశ్వత సిబ్బంది నియామకం చేపడితే ఇంకా మెరుగైన సేవలు అందిస్తాం. వైద్యులు అందుబాటులో ఉంటూ చిన్నారులకు నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. చిన్నారులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – రంజిత్కుమార్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్, నారాయణపేట
చిన్నారులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. పిల్లలకు వ్యాధి సోకితే కొంతమంది తల్లిదండ్రులు ఆర్ఎంపీలను ఆశ్రయించి, వ్యాధి తీవ్రత పెరిగాక ప్రభుత్వ దవాఖానకు తీసుకొస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేసుకోకుండా ప్రభుత్వ దవాఖానలను ఆశ్రయించాలి. ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. డాక్లర్లు కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు.
– క్రాంతికుమార్, చిన్న పిల్లల వైద్య నిపుణులు, మాడ్యులర్ చిల్డ్రన్ హాస్పిటల్, నారాయణపేట