కల్వకుర్తి, జూన్ 27 : కల్వకుర్తి మండలం రఘుపతిపేట – రామగిరి మధ్య ఉన్న దుందుభీ వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్రిడ్జి నిర్మాణంతో దుందుభీ కాజ్వే కష్టాలు తీరనున్నాయి. కృష్ణానది ఉపనది దుందుభీకి వరదలు వస్తే కల్వకుర్తి నియోజకవర్గానికి – నాగర్కర్నూల్ నియోజకవర్గం తెల్కపల్లి మండలానికి రాకపోకలు నిలిచిపోతాయి. వర్షాలు కురిస్తే దుందుభీ నది ఉధృతంగా ప్రవహిస్తూ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. నదిపై ఏర్పాటు చేసిన కాజ్వేపై వరదనీరు దాదాపు రెండు మీటర్ల ఎత్తున ప్రవహిస్తుంది. దీంతో మనుషులే కాదు.. వాహనాల రాకపోకలు నిలిచిపోతాయి.. ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చిన ప్రతీసారి ఇదే జరుగుతుంది.
కల్వకుర్తి మండలం రఘుపతిపేట వద్ద..
కల్వకుర్తి, నాగర్కర్నూల్ నియోజకవర్గాలను కృష్ణానది ఉపనది అయిన దుందుభీ నది విభజిస్తుంది. కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామం-తెల్కపల్లి మండలాల మధ్య దుందుభీ వాగు ఉంది (దీన్ని వాడుక భాషలో పెద్ద వాగు, డిండి వాగు అని పిలుస్తారు). వానకాలంలో దుందుభీ ఎగువ ప్రాంతంలో వర్షాలు ఎక్కువ కురిస్తే వాగుకు వరదలు వస్తాయి. వరదలు వస్తే వాగులో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. వాగులో నీరు లేనప్పుడు రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా కాజ్వే నిర్మించారు. కాజ్వే కూడా చాలా వరకు దెబ్బతిన్నది.
వర్షాలు వస్తే రాకపోకలు బంద్..
వర్షాలు కురిసి వాగు పారితే.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులే. కల్వకుర్తి నుంచి తెల్కపల్లితోపాటు చుట్టు పక్క మండలాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అచ్చంపేట, నాగర్కర్నూల్ మీదుగా గమ్యస్థానాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉంటుంది. చాలా ఏండ్లుగా రఘుపతిపేట వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనలు వాగులో కలిసిపోయాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక..
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుందుభీ వాగుపై రఘుపతిపేట వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని ఈ ప్రాంతానికి చెందిన ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా కల్వకుర్తి- నుంచి తెల్కపల్లి వరకు సింగిల్ రోడ్గా ఉన్న ఆర్అండ్బీ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రతిపాదనలు తయారు చేయించి నిధుల కోసం పరిపాలన ఆమోదం చేయించారు. మొదటి విడుత పనులలో భాగంగా రూ.14 కోట్లు మంజూరయ్యాయి. రూ.14 కోట్లతో కల్వకుర్తి నుంచి గుండూర్ వరకు డబుల్ రోడ్డు పూర్తయింది. రెండో విడుతలో గుండూర్ నుంచి తెల్కపల్లి మండల కేంద్రం వరకు 15.8 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డు విస్తరణ పనులకు రూ.20 కోట్లు మంజూరయ్యాయి. పనులు చురుకుగా సాగుతున్నాయి. కల్వకుర్తి నుంచి తెల్కపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తయితే, కల్వకుర్తి నుంచి తెల్కపల్లి, లింగాల మీదుగా కొల్లాపూర్కు రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది.
హైలెవల్ బ్రిడ్జికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
కల్వకుర్తి- తెల్కపల్లి మండలాల మధ్య రఘుపతిపేట వద్ద దుందుభీ నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి సీఎం కేసీఆర్కు ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఇదివరకే అందజేసి ఉన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల కృషి ఫలితంగా హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్లు మంజూరు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కల్వకుర్తి ప్రాంత వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, ఎంపీ, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు..
బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. కల్వకుర్తి తెల్కపల్లి ప్రజల చిరకాల స్వప్నంగా నిలిచిన రఘుపతిపే ట – రామగిరి మధ్యన దుం దుభీ వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని గతంలోనే సీఎం కేసీఆర్కు విన్నవించాం. ప్ర జల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి హైలెవల్ బ్రిడ్జి ని ర్మాణం కోసం రూ.45 కోట్లు కేటాయించారు. ఈ బ్రిడ్జి పూర్తయితే రామగిరి, తెల్కపల్లి, లింగాల, అంబటిపల్లి, కొల్లాపూర్ వరకు రవాణా సదుపాయం మెరుగుపడుతుంది. కొల్లాపూర్ నుంచి హైదరాబాద్కు దూరం తగ్గుతుంది. రవాణా సౌకర్యాలు పెరిగితే యథావిధిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.
– రాములు, ఎంపీ, నాగర్కర్నూల్