నాగర్కర్నూల్ / తిమ్మాజిపేట, జూన్ 20 : కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రతిపక్షాలపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తూ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ధ్వజమెత్తారు. ఇలాంటి దాడులకు పాల్పడుతూ వారి వైపునకు తిప్పుకొని అధికారం కోసం పాకులాడుతున్నదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతుంటే.. రాష్ట్రంలో మాత్రం సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి గడపకూ చేరువయ్యేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఐటీ దాడుల అనంతరం మండలానికి వచ్చిన ఎమ్మెల్యేకు మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఘనస్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు గ్రామమైన మరికల్ నుంచి దాదాపు 300 కార్లతో నాయకులు ఎమ్మెల్యే వెంట ర్యాలీ నిర్వహించారు.
తిమ్మాజిపేటలో భారీ గజమాలను క్రేన్ సాయంతో ఎమ్మెల్యేకు వేసి పటాకులు కాల్చారు. గులాబీ రంగుల కాగితాలు, పూలు చల్లి ఎమ్మెల్యేపై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ ఐటీ దాడులను కుట్ర పూర్వకంగా జరిపారన్నారు. తాను రాజకీయాలకు రాకముందు నుంచే నిజాయితీగా వ్యాపారం చేస్తున్నానని చెప్పారు. సంవత్సరానికి రూ.150 కోట్ల దాకా పన్ను చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు. ట్రస్టు ఆధ్వర్యంలో పాఠశాలకు భవనాలు కట్టించడం.. పేదింటి ఆడపిల్లలకు ఉచితంగా వివాహాలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. తనను లొంగదీసుకునేందుకు దాడులకు తెరతీశారని ధ్వజమెత్తారు.
తనను బెదిరించడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. డబ్బులు, అధికారం కోసం పాకులాడటం, పార్టీలు మారడం తన నైజం కాదన్నారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చానని, ప్రాణం ఉన్నంత వరకూ సేవ చేస్తానని, సీఎం కేసీఆర్ వెంట నడుస్తానని వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కౌరవుల్లా దండెత్తుతుంటే పాండవుల్లా తాము ఎదుర్కొంటున్నామన్నారు. విజయం మాత్రం తమనే వరిస్తుందన్నారు.
తనకు నాలుగు రోజులు సంఘీభావం తెలిపిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, రాష్ట్ర నాయకుడు బైకని శ్రీనివాస్ యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు, నాగర్కర్నూల్ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు, ఎంపీపీ మధు, కౌన్సిలర్లు ఖాజాఖాన్, జక్కా రాజ్కుమార్రెడ్డి, ఎంపీపీ రవీంద్రనాథ్రెడ్డి, జెడ్పీటీసీ దయాకర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్, సర్పంచులు వేణుగోపాల్గౌడ్, హనుమంతు యాదవ్, రైతుబంధు కన్వీనర్ వెంకటస్వామి, మార్కెట్ డైరెక్టర్ హుస్సేనీ, కవిత, ఎంపీటీసీలు మణెమ్మ, లీలావతి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మర్రికి క్షీరాభిషేకం..
తనకు ఓటేసిన ప్రజలకే భయపడతా తప్పా ఇంకెవరి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు. ఐటీ దాడుల నేపథ్యంలో తన వద్దకు వచ్చి ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఐటీ దాడుల తర్వాత జిల్లా కేంద్రానికి వచ్చిన మర్రికి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలొచ్చి ఘన స్వాగతం పలికారు.
నాగర్కర్నూల్ బస్టాండ్ కూడలిలో ఎమ్మెల్యేకు క్షీరాభిషేకం చేసి, గజమాలను అలంకరించారు. తొమ్మిదేండ్ల కింద కందనూలు ఎట్ల ఉండే.. ఇప్పుడు ఎలా మారిందో ప్రజలు గమనించాలని కోరారు. లక్షా 40వేల ఎకరాలకు సాగునీరు తీసుకొచ్చామని, అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడుతుండగా.. ప్రజల ఆదరణను చూసి ఓర్వలేక కొందరు దుర్మార్గంగా కుట్రలకు తెరలేపి ఐటీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని ఎత్తుగడలు వేసినా ప్రజలే తనకు బలమని.. వారి ఆశీస్సులతో ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అడుగడుగునా ఘన స్వాగతం..
బిజినేపల్లి, జూన్ 20 : మండలంలోని రాంరెడ్డిపల్లి నుంచి లింగసానిపల్లి గేటు వరకు బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే మర్రికి ఘన స్వాగతం పలికారు. ఐటీ దాడుల అనంతరం నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యేకు పటాకులు కాలుస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. భారీ ఎత్తున కార్ల ర్యాలీ చేపట్టారు. అనంతరం నాగర్కర్నూల్కు వెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.