వనపర్తి, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : అధికారంలో కి వస్తామని కాంగ్రెస్ పగటి కలలు కంటున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. బిజినేపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ లో హస్తం పార్టీ నేతల వ్యాఖ్యలపై సోమవారం మంత్రి నిరంజన్రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ నాయకులు కేసులు వేయడం వల్లే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో జా ప్యం జరుగుతున్నదని ధ్వజమెత్తారు. ఆ పార్టీ నాయకులు అడ్డంకులు సృష్టించకుంటే పనులు ఎప్పుడో పూర్తయ్యేవన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయన్నారు. కాంగ్రెస్ను ఎందుకు గెలిపించాలని ఆయన ప్రశ్నించా రు. తెలంగాణను ఆంధ్రాలో కలిపి ఎడారి చేసినందుకు కాంగ్రెస్ను గెలిపించాలా..? అని నిలదీశారు. కలిపిన తెలంగాణను తిరిగి సాధించుకునేందుకు వేల మంది బలిదానాలకు కారణమైనందుకు గెలిపించాలా? చెప్పాలన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా లో లక్ష ఎకరాలకు సాగు నీళ్లు లేవని, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్ నాయకత్వంలో నేడు 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పాలమూరు పనులు పూర్తయితే రాబోయే రెండేండ్లలో 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్న నిజం ప్రజల ముందు కనిపిస్తున్నదని చెప్పారు.
కాంగ్రెస్ పుణ్యమా అని ఎకరాకూ కేవలం 30 నుంచి 40 వేలకు భూములు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణలో ఎకరా రూ.20 లక్షలకు తక్కువ ఎక్కడా లేదన్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 13 లక్షల మంది రైతులు రైతుబంధు సాయంతో లబ్ధిపొందుతున్నారని తెలిపారు. 4 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయని చెప్పారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, న్యూట్రీషన్ కిట్, అమ్మఒడి పథకాలతో సామాన్యులందరూ సంతృప్తిగా ఉన్నారన్నారు. పరిస్థితులు గమనిస్తున్న ప్రజలు కోరి కొరివి దయ్యం లాంటి కాంగ్రెస్ను ఆదరిస్తా రా..? అని అన్నారు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ విఫలం చెందిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రలో వైఫల్యమే నేటి బీజేపీ నియంతృత్వానికి కారణమన్నారు. సరైన సమయంలో బీజేపీ విధానాలపై పోరాడకుండా చేతులు ముడుసుకొని కూర్చున్నారని ఎద్దేవా చేశారు. గుజరాత్లో ఎన్నికలు జరుగుతుంటే ప్రచారానికి వెళ్లని రాహుల్గాంధీ.. బీజేపీనీ ఎలా ఓడిస్తారని ప్రశ్నించారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను బీజేపీ టోకున అమ్మేస్తుంటే కాంగ్రెస్ నోరు మెదపడం లేదని విమర్శించారు. ఎనిమిదేండ్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుంటే హస్తం పార్టీ నేతల ఎక్కడా ప్ర శ్నించిన పాపాన పోలేదని అన్నారు.
కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణతో ధరలు పెరిగి పేద, మధ్య తరగతి కుటుంబాల బతుకులు ఆగమైతుంటే జాతీయపార్టీగా కాంగ్రెస్ పోషించిన పాత్ర ఏమిటన్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం రోడ్డెక్కితే ప్రతిపక్షపా త్ర పోషించకుండా కాంగ్రెస్ చతికిలపడిపోయిందని దుయ్యబట్టారు. జాతీయపార్టీగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలతో గిల్లికజ్జాలు పెట్టుకుని ఉనికిని కోల్పోతున్నదని విమర్శించారు. కేంద్రంపై, బీజేపీపై దేశంలో పోరాడుతున్నది కేసీఆర్ మాత్రమేనన్నారు. తెచ్చిన తెలంగాణకు తూట్లు పొడవడం, కేసీఆర్పై నిత్యం నిందలు వేయడంతో కాంగ్రెస్ నిమగ్నమై ఉన్నదని అన్నారు. తెలంగాణ వ్యతిరేకులకు ఊతమివ్వడం, తెలంగాణ అభివృద్ధిలో నిర్మాణాత్మక పాత్ర ఎన్నడూ పోషించలేదన్నారు. గెలుపు సంగతి తర్వాత.. ముందు కాంగ్రెస్లో ఇంటిపోరు తేల్చుకోవాలని హితవు పలికారు.