గద్వాల, ఏప్రిల్ 22 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతన్న అమ్ముకుందామంటే అడుగడుగునా కష్టా లు తప్పడం లేదు. పేరుకు మాత్రం తమది రైతు ప్రభు త్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. రైతులు మొక్కజొన్న పండించి టోకెన్ కోసం వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. తీరా టోకెన్ పొందాక గన్నీ బ్యాగుల కోసం వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు మూడురోజులు నిరీక్షించాల్సిన దు స్థితి నెలకొన్నది.
గన్నీ బ్యాగులు వచ్చాక వాటిని తూకం వేయడానికి రైతులు వ్యవసాయ మార్కెట్లో వారంరోజులుగా ఎదురుచూస్తున్నా కాంటాలు వేయకపోవడంతో రైతులు పంట ఉత్పత్తుల వద్ద రాత్రి,పగలు తేడాలేకుండా కాపలా ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఒక వేళ రైతులు తెచ్చిన ధాన్యం కాంటా వేసినా వాటిని మార్కెట్ నుంచి గోదాంలకు తరలించడంలో జాప్యం జరుగుతుండడంతో కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం గోదాంకు వెళ్లే వరకు రైతులు తమ ధాన్యం కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
రైతు తాను పండించిన పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే దానిని అమ్ముకొని వెళ్లడానికి వారం పడుతుండడంతో రైతులు ఇంటి వద్ద అన్ని పనులు వదులు కొని ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండడంతో రైతులు తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇక్కడి పాలకులు, అధికారులు రైతుల గురించి పట్టించుకోవడమే మానేయండతో రైతుల అవస్థలు వర్ణాతీతంగా మారాయి.
కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి రైతులకు ప్రభు త్వం గన్నీ బ్యాగులు సరఫరా చేసేది. అయితే బుధవారం నుంచి రైతులకు ప్రభుత్వం గన్నీ బ్యాగుల విషయంలో చేతులేత్తేసింది. మార్క్ఫెడ్ వద్ద గన్నీ బ్యాగుల కొరత కారణంగా రైతులకు గన్నీ బ్యాగులు ఇవ్వలేమని, రైతులు బయట కొనుగోలు చేసి కేంద్రాలకు మక్కలు తీసుకరావాలని సూచించడంతో రైతులు గన్నీ బ్యాగుల కొనుగోలు కో సం అవస్థలు పడుతున్నారు. రైతులు మార్కెట్లో రూ.25 కు గన్నీ బ్యాగు కొనుగోలు చేసి ధాన్యం ఎత్తితే, ప్రభుత్వం మాత్రం వారికి రూ.15 మాత్రమే చెల్లిస్తామని చెప్పడంతో రైతులు సంచిపై రూ.10 నష్టపోవాల్సి వస్తుంది.
మార్కెట్లో రైతులకు గన్నీ బ్యాగులు దొరకకపోవడంతో మార్కెట్లో ధాన్యం ఆరబోసుకుంటున్నారు. దీనికి తోడు రైతు నుంచి క్వింటాకు రూ.70 వసూలు చేస్తున్నారు. ఇందులో హమాలీ, చాటకూలీ, ట్రాన్స్పోర్టుల పేర వసూలు చేస్తున్నారు. మిగతా కొనుగోలు కేంద్రాల్లో అన్ని కలిపి రూ. 50వసూలు చేస్తే గద్వాలలో మాత్రం రూ.70 వసూలు చేయడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గద్వాల వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మక్క కొనుగోలు కేంద్రానికి గద్వాల నియోజకవర్గంలోని అన్ని మండలాలతోపాటు జిల్లాలో రైతులు ఎక్కడ పంట పండించిన ఇక్కడ అమ్ముకోవడానికి అవకాశం కల్పించారు. ఇది బాగానే ఉన్నా అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించపోవడంతో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుంది. ఇక్కడ హమాలీల కొరతతో 10 కాంటాలతోనే మక్కలు తూకం వేస్తున్నారు. వాస్తవానికి రోజుకు 10వేల బ్యాగులు కాంటా వేయాల్సి ఉన్నా రోజుకు 5వేల నుంచి 6వేల బస్తాలు కూడా కాంట వేయలేని పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం కొనుగోలు కేంద్రంలో 50వేల బస్తాల వరకు కాంటా వేయాల్సి ఉంది. నియోజకవర్గం మొత్తం ఒకే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటి వరకు గద్వాల వ్యవసాయ మార్కెట్లో ఏర్పా టు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులు 680 లాట్లు(కుప్పలు) పోశారు. ఇందులో ఇప్పటి వర కు 31వేల బస్తాలు కాంటా వేశారు. అయితే కాంటా వేసి న బస్తాలు గోదాంకు తరలించడంలో జాప్యం జరుగుతుండడంతో కొనుగోలు చేసిన బస్తాలు అన్ని మార్కెట్ యార్డులోనే ఉండిపోయాయి. కొనుగోలు కేంద్రం నుంచి గోదాంలకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో రైతులు తమ ధాన్యం తూకమైనా వాటిని గోదాంలకు తరలించే వరకు ధాన్యం వద్ద కాపలా కాస్తున్నారు. కొనుగోలు చేసిన 31వేల బస్తాలు సగ భాగం పైగా కొనుగోలు కేంద్రంలోనే బస్తాలు ఉండడంతో ఇతర రైతులకు ఇది ఇబ్బందిగా మారుతున్నది. అక్కడ స్థలం లేకపోవడంతో రైతులు వారు తెచ్చిన మక్కలు ఎక్కడపోయాలో తెలియని పరిస్థితి నెల కొన్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని రైతు లు డిమాండ్ చేస్తున్నారు.
వారం రోజుల కిందట కొనుగోలు కేంద్రానికి ధా న్యం తెచ్చా. మంగళవారం తూకం వేశారు. గోదాంకు తరలించక పోవడంతో తూకం వేసి బ్యాగుల వద్ద కాపలా కాయాల్సిన పరిస్థితి నెలకొన్నది. కొనుగోలు చేసిన ధాన్యం ట్రాన్స్పోర్టు చేయక పోవడంతో రాత్రం తా ఇక్కడే ఉన్నా. రాత్రి కురిసిన వర్షానికి బ్యాగులు తడిచాయి. కొనుగోలు చేసిన ధాన్యం ప్రభుత్వం తరలించకుండా ధాన్యం నానితే రైతులకు ఏమి సంబంధ ం. కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా కష్టాలు ఎదుర్కొంటున్నాం. – కరుణాకర్, రైతు, అమరవాయి