కామారెడ్డి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యింది. 344 కేంద్రాల ఆధ్వర్యంలో 64,004 మంది రైతుల నుంచి రూ.730.92 కోట్ల విలువైన 3,54,817 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రూ. 405.87 కోట్ల చెల్లింపులు పూర్తి చేశారు. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించారు. ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేసింది.
కామారెడ్డి, మే16(నమస్తే తెలంగాణ): కామారెడ్డి జిల్లాలో యాసంగికి సంబంధించిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యింది. జిల్లా వ్యాప్తంగా 344 కేంద్రాల ద్వారా 64,004 మంది రైతుల నుంచి రూ.730.92 కోట్ల విలువైన 3,54,817 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సంబంధిత అధికారులు సేకరించారు. మొత్తం రూ.730.92 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించగా.. 405.87 కోట్లు చెల్లించారు. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించారు. ధాన్యం తరలింపులో రవాణా సమస్య తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేసింది.
సజావుగా కొనుగోళ్లు
ప్రభుత్వ ప్రత్యేక కృషితో గ్రామాలు, తండాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రైతులు తమ పంటను దళారులకు కాకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. గత ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా సిబ్బంది ధాన్యాన్ని సేకరించారు. ధాన్యం కొనుగోళ్ల అనంతరం లారీల్లో ధాన్యపు సంచులను ఎప్పటికప్పుడు రైస్మిల్లులకు తరలించారు. ఇప్పటి వరకు జిల్లాలో 3,31,935 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించారు. ధాన్యం తరలింపులో ఎలాంటి ట్రాన్స్పోర్టు సమస్య లేకుండా సివిల్ సప్లయిస్ జిల్లా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రైస్మిల్లులకు తరలించిన ధాన్యంలో 2,88,179 మెట్రిక్ టన్నుల అన్లోడ్ అయింది. ఇంకా 1813 మెట్రిక్ టన్నుల ధాన్యం అన్లోడ్ చేయాల్సి ఉంది.
ధాన్యం కొనుగోళ్లు పూర్తి
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా సాగాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేశాం. కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల్లో తరలిస్తున్నాం. తరలింపులో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎప్పటికప్పుడు ట్యాబ్లో ఎంట్రీ చేస్తున్నాం. చెల్లింపుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేవు. వారం పది రోజుల్లో చెల్లింపులు పూర్తవుతున్నాయి.
అభిషేక్ సింగ్, సివిల్ సప్లయిస్ డీఎం