గద్వాల, జూన్ 8 : రోజురోజుకు పెరుగుతున్న గ్యాస్ ధరలు సామాన్యులకు గుదిబండగా మారుతున్నాయి. ఇప్పటికే రోజు రోజుకు భారీగా పెరుగుతున్న నిత్యావసర, ఇతర సరుకుల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా ప్రస్తుతం కేంద్రం పెంచిన గ్యాస్ ధరలతో సామా న్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు రెండు రోజుల కిందట కేంద్రం గృహ అవసరాల సిలిండర్ ధరను ఏకంగా రూ.29కి పెంచడంతో పేదలు, మ ధ్య తరగతి ప్రజలు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలతో ఇరాన్కు జరుగుతున్న యుద్ధప్రభావం కారణంగా సిలిండర్ ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటడంతో ప్రజలకు వచ్చే వేతనాలతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది సామాన్యులకు మరింత భారమయ్యే అవకాశం ఉంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 11 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా 1,76,366 డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నా యి. నాలుగు నెలలుగా సిలిండర్ ధరలను కేంద్ర ప్రభు త్వం పెంచుతూ పోతుంది. గత మే నెలలో సిలిండర్ ధరను ఏకంగా రూ.60 పెంచింది. దీనిని చెల్లించడానికే సామాన్యులు సతమతమవుతున్న వేళ కేంద్రం గృహవినియోగదారులు వినియోగించే 14.5 సిలిండర్ ధరలను రెండు రోజుల కిందట రూ.29 పెంచడంతో ప్రజలపై రూ.51,14,614 అదనపు భారం పడుతున్నది. ఈ అదనపు భారంతో వినియోగదారులు సతమతమవుతున్నారు.
ప్రతి నెలా గ్యాస్ వినియోగదారులు వారి అవసరాల మేరకు ఒకటి నుంచి రెండు సిలిండర్లు వాడుతున్నారు. ధరల పెరుగుదలతో జిల్లాలో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆరు గ్యారె ంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500కు సిలిండర్ అందిస్తామని ప్రకటించినా అమలులో అర్హులకు రావాల్సిన సబ్సిడీ అందడం లేదు. పెంచిన ధరలు చెల్లి స్తూ వినియోగదారులు సిలిండర్లను తీసుకుంటున్న వివిధ గ్యాస్ కంపెనీలకు చెందిన గ్యాస్ సిలిండర్ల బాయ్ లు వినియోగ దారుల వద్ద నుంచి అదనంగా రూ.20 పైగా వసూలు చేస్తున్నారు. ఇది తెలిసినా సివిల్ సప్లయ్ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వారునష్టపోవాల్సి వస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఐదురాష్ర్టాల ఎన్నికల ముందు సామాన్యులపై ఎటువంటి గ్యాస్, పెట్రోల్ బాదుడు ఉండదని చెప్పిన కేంద్రం ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచి వారిపై భారాలు వేస్తూనే ఉం ది. దేశంలో ఎలాంటి ఇంధన నిల్వల కొరత లేదని ప్రజలను నమ్మబలుకుతూనే మరోవైపు భారాలు మోపడం కేంద్ర ప్రభుత్వ ద్వంద నీతి బయటపడుతూనే ఉంది. అంతర్జాతీయ యుద్ధ వాతావరణం సాకుగా చూపి ప్రజలపై భారీగా ధరలు పెంచడం కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలకడమేనని ప్రజలు అంటున్నారు. పెంచిన ధరలపై ప్రతిపక్షాలు నోరు మెదపకపోవడం విడ్డూరమని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని గృహవినియోగదారులు కోరుతున్నారు.
మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతోపాటు గ్యాస్ ధరల పెంపుతో వం టింటి భారం పెరుగుతున్నది. మూ డు నెలల్లోనే కేంద్రం రెండు సార్లు రేట్లను పెంచింది. ఒకేసారి రూ.29 పెంచడంతో రూ.985 ఉన్న సిలిండర్ ఒక్కసారిగా రూ.1,015 చేరింది. కేంద్ర సర్కారు ఇచ్చే నామమాత్రపు రాయితీ రూ.46 పూర్తిగా నిలిపివేసి, ప్రజలను ఆర్థికంగా మరింత కుంగదీస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే సిలిండర్ ఇస్తామని చెప్పి, ఒకటి, రెండు సిలిండర్లకు నగదు బదిలీ చేసి తిరిగి ఆ ఊసెత్తడంలేదు. 45 రోజుల వరకు సిలిండర్ ఇయ్యకపోవడంతో నలుగురు సభ్యులున్న కుటుంబానికి ఏ మాత్రం సరిపోవడంలేదు.
– సుజాత, గృహిణి, అయిజ, జోగుళాంబ గద్వాల జిలా
గ్యాస్ ధరలు పెంచుతూపోతే వంట పాత పద్ధతిన కట్టెలతో చేసుకునే పరిస్థితి ఏర్పడతది. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు ధరలు పెరిగాయి. గతంలో ఎప్పుడూ ఈ విధంగా పెరగలే. ఇట్లయితే సాధారణ ప్రజలు గ్యాస్ కొనలేక కట్టెల పొయ్యిపై వంట చేసుకొనే పరిస్థితి వస్తది. పెరిగిన ధరలతోపాటు గ్యాస్ సిలిండర్లు లభించడం లేదు. నిత్యావసర ధరలు పెరిగే, గ్యాస్ ధరలు పెరిగే.. ఎట్ల రోజులు గడిపేది. ప్రభుత్వం ఆలోచించాలే..
– మానస, గృహిణి, మానవపాడు, జోగుళాంబ గద్వాల