నారాయణపేట టౌన్, అక్టోబర్ 11 : రానున్న అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన వివిధ బృందాల సభ్యులకు ఎన్నికల విధులపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. బుధవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో బృందాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోడ్ ముగిసే వరకు ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించాలన్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందించాలన్నారు. సీ విజిల్ యాప్ను ప్రతిఒక్కరూ రిజిస్టర్ చేసుకొని వాటి ద్వారా వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలన్నారు.
టీంలో పనిచేసే వారందరికీ ఐడీకార్డులు, వాహనాలను సమకూర్చడం జరుగుతుందన్నారు. ఎవరు కూడా రూ.50వేలు పైబడి నగదుతో ప్రయాణం చేయరాదని, నగదుతో పట్టుబడితే సీజ్ చేయడం జరుగుతుందన్నారు. పొలిటికల్ సమావేశం జరిగితే వీడియో రికార్డు చేసి పొలిటికల్ పార్టీ ఖర్చు కింద నమోదు చేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను తనిఖీ చేసి ఇబ్బందులు కలిగే సందర్భాల్లో ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. దీంతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఎస్డీసీ రాజేందర్ గౌడ్, నోడల్ అధికారులు, వీడియో సర్వేలైన్స్ టీం, వ్యూయింగ్ టీం పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల నియమావళి అమలుపై రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
ఇందుకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, గోడలపై వ్రాతలను తొలగించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో అనుమతుల కోసం సువిధ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో వ్యయ నోడల్ అధికారి కోదండరాములు, పార్టీల నాయకులు సుదర్శన్రెడ్డి వినయ్మిత్రయాదవ్, సలీం, వెంకట్రామిరెడ్డి, రఘురామయ్య గౌడ్ పాల్గొన్నారు.