మహబూబ్నగర్, ఫిబ్రవరి 6 : అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం చేయొద్దని కలెక్టర్ రవినాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పథకాలను లబ్ధిదారులకు అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా అర్హులైన వారందరికీ రైతుబీమా వర్తించేలా చర్య లు తీసుకోవాలన్నారు. రైతుబంధు పెండింగ్ కేసులపై దృష్టి సారించాలని ఆదేశించారు. అలాగే పండ్లు, పూలు, కూరగాయల తోటల సాగుపై రైతులను చైతన్యవంతం చేయాలని తెలిపారు. సీఎంఆర్ బియ్యంపై మరింత దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఎంఎల్ఎస్ పాయింట్లను తనిఖీ చే యాలన్నారు. గ్రామపంచాయతీ భవనాలు, సీసీరోడ్ల నిర్మా ణ పనుల పూర్తిపై దృష్టి సారించాలని తెలిపారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకుగానూ మెటీరియల్ను సిద్ధం చేయాలన్నారు. అన్ని గ్రామపంచాయతీల్లో తెలంగాణ క్రీడాప్రాంగాణాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వైకుంఠధామాలతోపాటు రైతువేధిక ఇతర ప్రభుత్వ సంస్థలకు మిషన్ భగీరథ పథకంతో తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ బిల్లులకు సంబంధించి ప్రతినెలా 5వ తేదీలోగా జిల్లా పంచాయతీ కార్యాలయానికి పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రామీణ ప్రజలకు ఆదాయం వచ్చేవిధంగా అటవీ ఉత్పత్తులు, ఇతర ఆదాయ వనరుల కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణకు సూచించారు. అలాగే డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని తెలిపారు. మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల కోసం ఐడీవోసీ కార్యాలయంలో కంటివెలుగు క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షే మ వసతిగృహాలను పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదికలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కోర్టు కేసులపై అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇందుకు సంబంధించిన ప్రత్యేక్షంగా ఒక రికార్డు నిర్వహించాలని తెలిపారు. మానవ హక్కుల కమిషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు ఇతర కమిషన్లకు పంపించే నివేదికల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండి.. ఒక వారం ముందుగానే రిపోర్టులు పంపించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా కార్యాలయా ల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, జీతభత్యాలు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు విడుదల చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఉద్యానశాఖ ఏడీ సాయిబాబా, డీఎస్డీవో బాలరాజు, డీపీ వో వెంకటేశ్వర్లు, ఈఈ పుల్లారెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ మూర్తి, డీఎంహెచ్వో కృష్ణ తదితరులు ఉన్నారు.
ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదునూ పూర్తిస్థాయిలో పరిశీలించి పరిష్కారమార్గం చూపాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ అన్నిశాఖల అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి విధిగా హాజరు కావాలని సూచించారు. గతేడాది డిసెంబర్ 31వరకు వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన రిపోర్టును సమర్పించాలని ఆదేశించారు. వారంలోగా ధరణిలో ఉన్న అన్ని పెండిం గ్ సమస్యలను పరిష్కరించాలని, ఏ కేసునూ పెండింగ్లో ఉంచవద్దని తెలిపారు. పీవోబీ కేసులకు సంబంధించి ఎక్కు వ సమయం తీసుకోవద్దని, ప్రభుత్వ భూములు అన్యాక్రాం తం కాకుండా దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో సర్వేనెంబర్ వారీగా ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం వివరాలను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణికి 68 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్డీవో యాదయ్య, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, జెడ్పీ సీఈవో జ్యోతి పాల్గొన్నారు.