మహబూబ్నగర్, మార్చి 21 : ఆదాయపు పన్ను చెల్లింపుపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కోశాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో సంబంధింత అధికారులతో మంగళవారం ఆదాయపు పన్ను చెల్లింపులపై అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. పన్ను చెల్లింపులపై అపోహలు, అనుమానాలు ఉంటాయని, వాటిని నివృత్తి చేసేందుకు జిల్లాస్థాయిలో ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సెమినార్ను ఏర్పాటు చేశామన్నారు. దీంతో జిల్లాలోని డ్రాయింగ్ అధికారులు తప్పనిసరిగా ప్రతి నెలా టీడీఎస్ కట్టించడంతోపాటు ప్రతి ఉద్యోగికి సంబంధించి ఐటీ రిటర్న్ చేయడం, తదితర అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలన్నారు.
ప్రతి విషయంపై అవగాహన ఉండాలి : కృష్ణకుమార్
పన్నులు చెల్లించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని ఆదాయపుపన్ను శాఖ జాయింట్ కమిషనర్ పి.కృష్ణకుమార్ అన్నారు. డ్రాయింగ్ అధికారులు ప్రతి ఏడాది ఉద్యోగులకు సంబంధించిన ఆదాయపు పన్ను డిడక్షన్స్, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం, టీడీఎస్తో లావాదేవీలు నిర్వహించేందుకు వాటిపై సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు. ముఖ్యంగా జీతంలో నుంచి ఐటీ డిడక్షన్, టీడీఎస్ చెల్లింపు వాటిపై అవగాహన లేని కారణంగా తప్పులు జరుగుతుంటాయన్నారు. వాటన్నింటినీ సరిచేయాలనే ఉద్దేశంతోనే జిల్లాస్థాయిలో టీడీఎస్పై సెమినార్లు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సెమినార్లు నిర్వహించి డ్రాయింగ్ అధికారులను చైతన్యం చేస్తున్నామన్నారు. సదస్సులో రెవెన్యూ, స్థానికసంస్థల అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, ఐటీ అధికారి మధుసూదన్రావు, జిల్లా కోశాధికారి కోమలి, డీఈవో యాదయ్య తదితరులున్నారు.
ఇంటి వద్దకే రామయ్య తలంబ్రాలు ..
టీఎస్ ఆర్టీసీ ద్వారా భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే తీసుకు రావడం సంతోషకరమని కలెక్టర్ పేర్కొన్నారు. మంగళవారం భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవాలకు సంబంధించిన తలంబ్రాలు ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని తెలియజేసే వాల్పోస్టర్ను కలెక్టర్ అవిష్కరించారు. తలంబ్రాలకు రూ.116 చెల్లిస్తే సరిపోతుందని, ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా ఇంటి వద్దకు వచ్చి అందజేసే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తలంబ్రాలు కావాలనుకునే వారు 9154298630, 9154298612 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఎం శ్రీదేవి, డిపో మేనేజర్ బి.సుజాత, రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మహేశ్ తదితరులున్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
పాలమూరు, మార్చి 21: ఏనుగొండ సమీపంలోని కేంద్రీయ విద్యాలయంలో మంగళవారం మేనేజ్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై 2021-22లో పది, ఇంటర్ విద్యార్థులు సాధించిన ఫలితాలు, పాఠశాలలో మౌలిక సదుపాయాలు, పరిపాలన, సిలబస్, ఇతర అంశాలపై సమీక్షించారు. పాఠశాలకు అప్రోచ్ రహదారి కావాలని ప్రిన్సిపాల్ దశరథరాం కలెక్టర్ను కోరారు.