మహబూబ్నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కల్వకుర్తి, జనవరి 9 : రైస్ మిల్లుల్లో సీఎంఆర్ బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. మిల్లర్లు తమ వద్ద ఉన్న క స్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) బియ్యాన్ని ఎఫ్సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కు అప్పగించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ బియ్యాన్ని ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తుంటే.. మరోవైపు మిల్లర్లు ప్రజాప్రతినిధులను కాకా పట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఇంతకు మిల్లర్ల వద్ద సీఎంఆర్ బియ్యం ఉందా..? ఉంటే ఎందు కు ఇవ్వడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ బియ్యం విషయంలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే మిల్లుల యజమానులు ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇందుకోసం సన్మానాల పేరుతో మంత్రితోపాటు ఎమ్మెల్యేలను కలుస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సాగునీరు పుష్కలం కావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరి సాగు గణనీయంగా పెరిగింది. ప్రధానంగా నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలో చాలా ఎక్కువైంది. ఎంజీకేఎల్ఐ పనులు పూర్తి కావడంతో 2017 సంవత్సరం నాటికి కందనూలు జిల్లా వ్యాప్తంగా కృష్ణాజలాలు రైతుల పొలాల్లో పరుగులు పెట్టాయి. సాగునీరు సమృద్ధిగా ఉండటంతో కర్షకులు వరి సాగుపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం విక్రయాల విషయంలో రైతులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో నష్టం వచ్చినా సరే అని కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపట్టింది. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్సీఐకి అప్పగించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంపిక చేసిన రైస్ మిల్లర్లకు అప్పగించింది.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎఫ్సీఐకి ఇ వ్వాల్సిన సీఎంఆర్ బియ్యం నిల్వలు మిల్లర వద్ద భారీ గా పేరుకుపోయాయి. వానకాలం, యాసంగి సీజన్లు 2022-23లకు సంబంధించి నాగర్కర్నూల్ జిల్లాలో 1,45,487 మెట్రిక్ టన్నులు, వనపర్తి జిల్లాలో 2.80 లక్షల మెట్రిక్ టన్నులు, మహబూబ్నగర్ జిల్లాలో 72,124 మెట్రిక్ టన్నులు, నారాయణపేట జిల్లాలో 80,176 మెట్రిక్ టన్నులు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 20,321 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐకి మిల్లర్లు అందించాల్సి ఉన్నది. మొత్తంగా 5,98,108 మెట్రిక్ టన్నులు ఇవ్వాలి. ప్రభుత్వానికి నష్టం వచ్చినా సరే రైతులకు మేలు చేకూర్చే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు చేసింది. సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించి తిరిగి రెవెన్యూ సమకూర్చుకోవాలనే ప్రభుత్వ ఆశయానికి మిల్లర్లు గండి కొడుతున్నారు. బియ్యం మిల్లుల పరిశ్రమకు ఊతం లభిస్తుందని వడ్లను అప్పగిస్తే.. ఇప్పటి వరకు సీఎంఆర్ బియ్యం ఎందుకు అప్పగించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి బియ్యం విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. బియ్యం ఇవ్వని మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే మి ల్లర్ల వద్ద దాదాపుగా సీఎంఆర్ బియ్యం లేనట్లే. అయితే ఈ బియ్యం అందించని మిల్లర్లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.
గడువు పూర్తయిన సీఎంఆర్ బియ్యం ఇవ్వకుండా రైస్ మిల్లర్లు జాప్యం చేస్తుండటంతో అధికారులు మిల్లర్లపై ఒత్తిడి తెచ్చారు. గడువు లోపల ఇవ్వకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా ఎందుకు జాప్యం చేస్తున్నారనే విషయమై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు మిల్లర్ల వద్ద బియ్యం ఉందా..? లేదా.. అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మిల్లర్లు, ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా మెలిగి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తమ్మీద సీఎంఆర్ బియ్యం విషయంలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందనే వాదనలు ఊపందుకున్నాయి.
మహబూబ్నగర్ జిల్లాలో 2022 వానకాలం లో రైస్ మిల్లర్లు ఎఫ్సీఐకి సీఎంఆర్ బియ్యం 93, 351 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా 83,978 బియ్యాన్ని ఇచ్చారు. 9,373 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వాల్సి ఉన్నది. యాసంగి 2022 -23 విషయానికొస్తే 76,684 మెట్రిక్ ట న్నుల బి య్యానికిగానూ కేవలం 13,932 మెట్రిక్ టన్నులు మాత్రమే ఎఫ్సీఐకి అందజేశారు. 62,752 మెట్రి క్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉన్నది. మొత్తంగా చూస్తే 72,124 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉన్నది.
నాగర్కర్నూల్ జిల్లాలో మిల్లర్ల వద్ద సీఎంఆర్ బి య్యం నిల్వలు పేరుకుపోయాయి. ఈ బియ్యాన్ని ఎ ఫ్సీఐకి అప్పగించకుండా కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు రైస్ మిల్లర్లు మూటగట్టుకుంటున్నారు. 2022-23 సంవత్సరం వానకాలంలో పౌరసరఫరాల శాఖ 1,38,653 మెట్రిక్ టన్నుల వడ్లను మిల్లర్లుకు అప్పగించింది. దీనికిగానూ 92,953 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా.. మిల్లర్లు 43,6 15 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. అంటే 40 శాతం మాత్రమే అందజేశారు. యాసంగి విషయానికొస్తే 1,61,009 మెట్రిక్ టన్నుల వడ్లను మిల్లర్లకు అప్పగిస్తే.. దీనికి వారు 1,08,329 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం 12,180 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. అంటే కేవలం 12 శా తం బియ్యాన్ని మాత్రమే ఇచ్చారు. ఇంకా 96,149 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉన్నది. వానకా లం, యాసంగి సీజన్లకు సంబంధించి మిల్లర్లు ఇంకా 1,45,487 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉన్నది.
గద్వాల జిల్లాలో వానకాలం 2022లో పౌరసరఫరాల శాఖ రైతుల నుంచి 28,904 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసి బియ్యంగా చేసేందుకు మిల్లర్లకు అప్పగించింది. 19,378 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం ఇవ్వాల్సిన మిల్లర్లు 16,067 మెట్రిక్ ట న్నుల బియ్యాన్ని మాత్రమే ఇచ్చారు. ఇంకా 3,321 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉన్నది. అదే విధంగా యాసంగి 2022-23లో 24,684 టన్నుల వడ్లను మిల్లర్లకు ఇస్తే ఇప్పటి వరకు కేవలం 1,131 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించా రు. దాదాపు 17 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వలేదు. మొత్తంగా చూస్తే 20,321 మెట్రిక్ టన్నుల బి య్యం ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉన్నది. ఈ బియ్యంలో దా దాపు 70 లారీల సీఎంఆర్ బియ్యం పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ బియ్యం విషయంలో అధికారులు సమాచారం ఇవ్వడానికి వెనుకాముందు ఆడుతున్నారు.
వనపర్తి జిల్లాలో వానకాలం 2022లో మిల్లర్లకు 2,56,243 మెట్రిక్ టన్నుల వడ్లను అప్పగించింది. ఇందుకు 1,70,471 మెట్రిక్ టన్నుల సీఎమ్మార్ బి య్యాన్ని ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉండగా, 65,459 మె ట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ఇచ్చారు. ఇంకా 1,04,979 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉ న్నది. వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి 2.80 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉన్నది.
నారాయణపేట జిల్లాలో 2022 వానకాలంలో 85,360 మెట్రిక్ టన్నుల వడ్లను సీఎంఆర్ బియ్యం కోసం మిల్లర్లకు ఇచ్చారు. 57,249 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సిన మిల్లర్లు 48,259 మెట్రిక్ టన్నులు ఎఫ్సీఐకి ఇచ్చారు. యాసంగి విషయానికి వస్తే 1,15727 మెట్రిక్ టన్నుల ధాన్యానికి 78,040 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 6,854 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందజేశారు. వానకాలం, యాసంగి సీజన్లు కలిసి ఎఫ్సీఐకి 80,176 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఇవ్వాల్సి ఉన్నది.