నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : దేశ కీర్తి ప్రతిష్టలు పెంచేలా ప్రభుత్వ రంగంలోనే నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దామరచర్ల మండలం వీర్లపాలెం పరిధిలో నిర్మిస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్ను సీఎం కేసీఆర్ సోమవారం సందర్శించారు. హైదరాబాద్ నుంచి మంత్రులు, అధికారులతో కలిసి రెండు హెలికాప్టర్లలో సీఎం కేసీఆర్ పవర్ ప్లాంట్కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12:58 గంటలకు చేరుకున్న సీఎం సాయంత్రం 4:53 గంటల వరకు ప్లాంట్ ఆవరణలో బిజీబిజీగా గడిపారు.
హెలిప్యాడ్ వద్ద మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రి జగదీశ్రెడ్డితోపాటు జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచే ప్రత్యేక వాహనంలో ప్లాంట్ జరుగుతున్న నిర్మాణ పనుల పరిశీలనకు బయల్దేరారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు పనుల పురోగతిపై వాహనంలోనే సీఎంకు వివరిస్తూ కనిపించారు. ముందుగా పవర్ ప్లాంట్ ఫేజ్-1లోని యూనిట్-2 బాయిలర్ నిర్మాణ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ పనులను పరిశీలించిన అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన డిస్ప్లేను పరిశీలించారు. ఐదు యూనిట్లలో యూనిట్ల వారీగా జరుగుతున్న పనులను అధికారులు సీఎంకు వివరించారు.
ఈ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపైనా సీఎం కేసీఆర్ అక్కడికక్కడే అధికారులకు తగిన సూచనలు చేశారు. అక్కడి నుంచి ప్రత్యేక లిఫ్టు ద్వారా 82 మీటర్ల ఎత్తులో ఉన్న 12వ ఫ్లోర్కు చేరుకొని ప్లాంట్ ఆవరణలో జరుగుతున్న పలు నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధికారులను అడిగి తెలుసుకుంటూ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగానే ప్లాంట్లో పనిచేసే సిబ్బంది కోసం నిర్మించాల్సిన టౌన్షిప్, అందులో కల్పించాల్సిన మౌళిక వసతులపైనా సీఎం ప్రస్తావిస్తూ మంచి ప్రణాళికతో ఆధునిక సౌకర్యాలతో వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. ప్లాంట్ నిర్మాణం ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్లాంట్ నిర్మాణానికి సహకరిస్తున్న స్థానికుల ఇబ్బందులపైనా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్లాంట్లో పర్యటన అనంతరం అతిథి గృహానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అప్పటికే అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు స్థానికులు కూడా తమ సమస్యలను ఎమ్మెల్యే భాస్కర్రావు ద్వారా సీఎం దృష్టికి తెచ్చేందుకు వేచి ఉన్నారు. వారందరికీ సమయం కేటాయిస్తూ ఎంతో ఓపిగ్గా ఒక్కో అంశంపై వినతులను స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మధ్యాహ్నం ప్రభుత్వ ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ సందర్భంగా వరి ధాన్యం దిగుబడులు, కొనుగోళ్లు, మార్కెటింగ్ సౌకర్యం తదితర అంశాలను సీఎం ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో పండిన పంటల కంటే మించి సాగువుతున్నాయని వివరిస్తూ తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు తెలిసింది. అనంతరం జెన్కో, బీహెచ్ఈఎల్ అధికారులతో కొద్దిసేపు ప్రత్యేకంగా సమీక్ష చేశారు. మిగతా పనులపై తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ సహకారంపై ఆరా తీశారు. థర్మల్ ప్రాజెక్టును దేశ కీర్తి ప్రతిష్టలు పెంచేలా అద్భుతంగా నిర్మించాలన్న లక్ష్యంతో పని చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పనుల తీరుపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తూ విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ట్రాన్స్కో అండ్ జెన్కో సీఎండీ ప్రభాకర్రావును సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్ప్లాంటు నిర్మాణ పనుల పురోగతి పరిశీలనకు వచ్చిన సీఎం కేసీఆర్ మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధికి పలు హామీలు ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు విజ్ఞప్తి మేరకు రూ.331.30 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే భాస్కర్రావు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వాటన్నింటినీ సావదానంగా విన్న ముఖ్యమంత్రి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
దామరచర్ల ఉమ్మడి మండలంలోని కల్లేపల్లి, నర్సాపురం, తిమ్మాపురం, పుట్టలగడ్డ, ఉల్సాయపాలెం, కొత్త నందికొండ, చిట్యాల గ్రామాల పరిధిలోని పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, ఆర్డీఓలను ఆదేశించారు. పోడు భూముల కబ్జాలో ఉండి సాగు చేసుకుంటూ ప్లాంటు కింద నష్టపోయిన రైతులు, ప్లాంటు కోసం ఏర్పాటు చేస్తున్న రైల్వే లైన్ కింద నష్టపోయిన నిర్వాసితులకు జాబ్కార్డులు ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్కు సూచించారు.
దామరచర్ల మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లకు రూ.25.30 కోట్లు, డ్రైనేజీలు, అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ.60కోట్లు, దామరచర్ల రైల్వే క్రాసింగ్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.60 కోట్లు, దామరచర్ల నుంచి యాదాద్రి పవర్ ప్లాంటు వద్దకు నాలుగు లైన్ల సీసీ రోడ్డు నిర్మాణానికి సీఎం హామీ ఇచ్చారు. దామరచర్ల మండల కేంద్రంలో నూతన రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కేంద్రానికి లేఖ రాయాలని సీఎస్ను ఆదేశించారు. దాంతోపాటు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న రైస్ మిల్లర్ల కమర్షియల్ సేల్స్ ట్యాక్స్ (సీఎస్టీ)ను రద్దు చేస్తూ జీఓ విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో మిలర్లు సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని 10 చెక్డ్యామ్ల నిర్మాణానికి రూ.72 కోట్ల మంజూరుకు ఎమ్మెల్యే భాస్కర్రావు ప్రతిపాదనలు ఇవ్వగా సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఆర్ అండ్ బీ శాఖ ధ్వారా రూ.24 కోట్లతో సల్కునూరు- మంగాపురం, తక్కెళ్లపాడ్-ఆదర్శనగర్, ఉల్సాయపాలెం-బంగారికుంట తండా, హైదలాపురం-గూడూరు క్యాంపుతండా వరకు రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భాస్కర్రావు ప్రతిపాదనలు సీఎంకు అందజేశారు.
నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై స్పందించిన సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్తోపాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్లు బండా నరేందర్రెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, గుజ్జ దీపిక, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్రావు, గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, ఆశన్నగారి జీవన్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం సెక్రటరీ స్మితాసబర్వాల్, జిల్లా కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి, సూర్యాపేట ఎస్పీ శ్రీనివాసరాజు, రాష్ట్ర టూరిజం సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, రాష్ట్ర గిరిజనాభివృద్ధ్ది సంస్థ చైర్మన్ ఇ.రాంచందర్నాయక్, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుంగుల కృష్ణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్సింగ్, ఆర్డీఓ చెన్నయ్య పాల్గొన్నారు.
సీఎం పర్యటన హైలైట్స్