ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గులాబీ దళం దూకుడు పెంచింది. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. కాగా, గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలు మ్యాని ఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రచారాలకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలతో ‘కారు గుర్తుకే ఓటు వేస్తాం.. అభివృద్ధికే పట్టం కడుతాం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పార్టీల నాయకులను రానీయం’ అంటూ ప్రజలు తెగేసి చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ నెల 18న జడ్చర్ల నుంచి సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. రెండో విడుత ప్రచారంలో భాగంగా ఈ నెల 26వ తేదీన అచ్చంపేట, వనపర్తిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బహిరంగసభలు నిర్వహించనున్నారు. ఇందుకుగానూ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు జనసమీకరణ చేస్తున్నారు. భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు తరలివచ్చేలా ఏర్పాట్లు చేపడుతున్నారు. వరుసగా గులాబీ బాస్ పర్యటిస్తుండడంతో ప్రతిపక్ష పార్టీల నేతల్లో గుబులు రేపుతున్నది. కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించిన స్థానాల్లో స్థానిక నేతల నుంచి అసమ్మతి సెగ తగులుతుండడంతో ఏం చేయాలో పాలుపోక అధిష్టానం తలలు పట్టుకుంటున్నది. బీజేపీ ఉమ్మడి జిల్లాలో రెండు స్థానాల్లో మా త్రమే టికెట్లు కేటాయించడంతో ఆశావహుల్లో డైలమా నెలకొన్నది. క్లీన్స్వీప్ లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకుపోతుంటే.. కారు స్పీడు తట్టుకోలేక ప్రతిపక్షాలు చతికిలబడుతున్నాయి.
మహబూబ్నగర్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్గర్ జిల్లాలో గులాబీదళం దూసుకుపోతున్నది. ఎన్నికలకు ఇంకా 35రోజుల సమయమే ఉండడంతో పక్కా ప్లాన్తో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే అన్ని పార్టీల కంటే ముందుగానే గులాబీదళం దూకుడు పెంచింది. మరోసారి పార్టీ అధినేత కేసీఆర్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈనెల 18న జడ్చర్ల సభలో ఎన్నికల శంఖారావం పూజించిన గులాబీబాస్ మరోసారి అచ్చంపేట, వనపర్తి బహిరంగ సభలో పాల్గొంటుండడంతో కాంగ్రెస్, బీజేపీలో దడ పుడుతున్నది. కాంగ్రెస్లో టికెట్లు ప్రకటించినా ఇంకా అసమ్మతి చల్లారడం లేదు. బీజేపీలో టికెట్లపై ఆశ పెట్టుకున్న ఆశావాహులను నిరాశ పరుస్తూ కేవలం ఇద్దరికే టికెట్లు ఖరారు చేసింది. ఆ పార్టీల తీరుపై సీనియర్ నేతలు మండిపడుతున్నారు. ఈలోగా బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుండడంతో విపక్షాల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రెండో విడుత ప్రచారానికి కూడా శ్రీకా రం చుడుతున్నారు. ఇప్పటికే టికెట్లు ఖరారు చేసి బీఫా రంలు కూడా ఇవ్వడంతో అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. ఇప్పటికే ఒక విడుత మండలాల వారీగా ప్రచారాన్ని కంప్లీట్ చేశారు. పట్టణాల్లో, గ్రామాల్లో కార్యకర్తలు కారు గుర్తుకే ఓటేయాలని ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నారు. పక్కా ప్లాన్తో ప్రచారం సాగుతుండడంతో ఉమ్మడి జిల్లాలో గులాబీ జెండా ఎగురడం ఖాయమనే ధీమాతో ఉన్నారు. మరోవైపు పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో అనేక వర్గాలకు ప్రయోజనం చేకూరేలా ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే చేసే పనులను వివరిస్తుండడంతో ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్నది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ లక్ష్యంగా పావులు కదుపుతోంది. 2018 ఎన్నికల సీన్ మళ్లీ రిపీట్ చేయాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 స్థానాల్లో ఏకంగా 13 స్థానాలను గెలుచుకొని పాలమూరు జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ వైపు రావడంతో 14 స్థానాలు కారు ఖాతాలో పడ్డాయి. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తన హవా కొనసాగించింది. 68 ఎంపీపీ స్థానాలను గెలుచుకొని 90శాతం సర్పంచులను గెలిపించుకొని పాలమూరును కంచుకోటగా మార్చుకున్నది. ఈ ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. సిట్టింగ్లకే టికెట్లు కేటాయించి ఎక్కడా అసమ్మతి చెలరేగకుండా జాగ్రత్త పడ్డారు గులాబీ బాస్. కొంతమంది నేతలకు పార్టీ పదవులు, కార్పొరేషన్ పదవులు ఇచ్చి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి మహబూబ్గర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రెండో విడుత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే ఈనెల 18న జడ్చర్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల శంఖారావాన్ని జడ్చర్ల నుంచి పూరించి నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపారు. రెండో విడుత ప్రచారంలో భాగంగా ఈనెల 26న అచ్చంపేట, వనపర్తి బహిరంగ సభల్లో ఆయా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టనున్నారు. ఈ మేరకు మంత్రి నిరంజన్రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజులు సీఎం కేసీఆర్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ వచ్చాక వనపర్తి జిల్లా రూపురేఖలు మారిపోయాయి. అదే కోవలో అచ్చంపేటలో కూడా అభివృద్ధిని కండ్ల ముందు ఆవిష్కరించి నల్లమల్ల జనం గుండెల్లో కేసీఆర్ నిలిచిపోయారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో గులాబీ శ్రేణులు మరింత దూకుడుతో ముందుకు సాగుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహరచనలు చేస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రెండుసార్లు అధికారమివ్వగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని, ప్రజలు అడగకుండానే ఎన్నో పథకాలను అందించారని గుర్తు చేస్తున్నారు. మళ్లీ అధికారం సన్న బియ్యం, రూ.400లకే సిలిండర్, రూ.5వేల ఆసరా పింఛన్, తెల్లరేషన్కార్డుదారులకు బీమా తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రైతుబంధు ఎకరాకు రూ.16వేలు ఇస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎన్నో హామీలు ఇచ్చి ఆరు నెలలుగా అధికారంలో ఉన్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోతున్నదని, ఇదే పరిస్థితి తెలంగాణలో రాబోతుందని హెచ్చరిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్గర్ జిల్లాలో మళ్లీ పట్టుసాధించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయించడం, ప్రచారానికి సంసిద్ధం కావడంతో కాంగ్రెస్, బీజేపీలో ఆందోళన నెలకొంది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయమే ఉండగా, ఆ రెండు పార్టీలో ఇప్పటికీ అభ్యర్థులే ఖరారు కాలేదు. సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో ప్రచార శంఖారావాన్ని పూరించి రెండోసారి ప్రచారానికి అచ్చంపేట, వనపర్తికి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు వస్తారని ఆశతో ఉంది. టికెట్లు ఖరారైన వారికి బీఫాం ఇస్తారో లేదోనన్న టెన్షన్ మొదలైంది. బీజేపీలో ఇంకా టికెట్ల వ్యవహారం కొలిక్కిరాలేదు. బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుండడంతో తమకు డిపాజిట్ అయినా దక్కుతుందా లేదోనని ఇతర పార్టీ అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు.