నాగర్కర్నూల్, మే 26 : నాగర్కర్నూల్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 6వ తేదీన సీఎం కేసీఆర్ సమీకృత భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట అందుబాటులో ఉండేలా ఈ భవనాన్ని 12.3 ఎకరాల విస్తీర్ణంలో రూ.52.36కోట్లతో నిర్మించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 6వ తేదీన కొల్లాపూర్ చౌరస్తాలో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులోని సర్వే నెంబర్ 237లో అన్ని హంగులతో కార్యాలయాన్ని సిద్ధం చేశారు. 1.25 లక్షల చదరపు అడుగుల్లో గ్రౌండ్ఫ్లోర్తోపాటు రెండు అంతస్తుల్లో 32 శాఖల అధికారులకు శాఖల వారీగా గదులు కేటాయించారు.
దశాబ్దాల కల సాకారం
సీఎం కేసీఆర్ చొరవతో కందనూలు జిల్లా ప్రజల దశాబ్దాల ఆకాంక్ష సాకారమైంది. రూ.52.36కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ సమీకృత భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నందుకు సంతోషంగా ఉన్నది. దీంతోపాటు ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. 2016 దసరా రోజున నాగర్కర్నూల్ జిల్లాగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత అన్ని సౌకర్యాలతో జిల్లాను పరిపాలనా సౌలభ్యంగా మార్చుకోవడంతో సీఎం కేసీఆర్ సాకారం ఎనలేనిది. సీఎం రాక సందర్భంగా భారీ సభతోపాటు ప్రజల తరఫున ఘన సన్మానానికి ఏర్పాట్లు చేపడుతాం.
– మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యే, నాగర్కర్నూల్