నాగర్కర్నూల్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం నల్లమల నియోజకవర్గం అచ్చంపేటకు రానున్నారు. ఇక్కడి నుంచే కందనూలు జిల్లాలో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో సీఎం సభ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశారు. కందనూలులో బీఆర్ఎస్ ఇతర పార్టీలకంటే ముందంజలో ప్రజాశీర్వాదంతో ముందుకు సాగుతోంది. తెలంగాణ సాధించిన పార్టీగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధితో ప్రజల్లో బీఆర్ఎస్కు అచంచల విశ్వాసం నెలకొంది. నాగర్కర్నూల్ జిల్లా ఏర్పాటు, మెడికల్ కళాశాల ప్రారంభంతోపాటుగా ఎంజీకేల్ఐ, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల, చంద్రసాగర్, రూ.2,500 కోట్లతో అచ్చంపేట లిఫ్టులాంటి అభివృద్ధి పనులు ప్రజల కండ్లముందు కనిపిస్తున్నాయి. ఇక ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంట్, కేసీఆర్ కిట్, న్యూట్రీషియన్కిట్లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికీ చేరాయి. దీంతో బీఆర్ఎస్పై గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా ప్రజల్లో సానుకూలత కనిపిస్తోంది.
ప్రతిపక్షాలు ప్రాజెక్టులను ఆపే కుట్రలకు పాల్పడటంతోపాటుగా పథకాలపై చేసిన దుష్ప్రచారాలను ప్రజలు గుర్తించారు. ఈ కారణంగా బీఆర్ఎస్, సీఎంకేసీఆర్పై ప్రజల్లో నమ్మకం సడలడం లేదు. ఫలితంగా గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కే ప్రజలు పట్టం కట్టారు. అచ్చంపేట పట్టణంలో 150మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు అందించగా, 100 పడకల దవాఖాన అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా వైద్య సేవ లు ఎంతో మెరుగయ్యాయి. జిల్లాగా మారడం గతంలో మహబూబ్నగర్ వెళ్లాల్సి వస్తుండెది. దీంతో నాడు ఒకట్రెండు రోజులు పట్టే పని ఇప్పుడు నాగర్కర్నూల్కు వెళ్లి ఒక్క రోజులోనే పని పూర్తి చేసుకొంటున్నారు. జిల్లాల పునర్విభజనతో పదర, చారకొండ కొత్త మండలాలుగా ఏర్పడగా రెవెన్యూ, పోలీసు సబ్ డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఇక 75తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. ఇలా నల్లమల ప్రాంతంలో పాలన ప్రజల చేరువకు వచ్చింది. మిషన్ భగీరథతో తాగునీటి సమస్య శాశ్వతంగా తీరింది. గుక్కెడు మంచినీటి కోసం ఎంతో ఇక్కట్లు పడ్డ ప్రజలకు ఇప్పుడు ఎంజీకేఎల్ఐతో సాగునీరు అందుబాటులోకి వచ్చింది. అచ్చంపేట లిఫ్టు పూర్తైతే 72వేల ఎకరాల ఆయకట్టుకు సైతం సాగునీళ్లు పుష్కలంగా లభిస్తాయి.
ఇక రూ.4.50కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయం, రూ.100 కోట్లతో మన్ననూర్, ఈగలపెంటలో ఎకో టూరిజంలో భాగంగా కాటేజీల నిర్మాణాలు, ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం ఆలయాల అభివృద్ధి, రూ.3.50 కోట్లతో ఇండో ర్, ఎన్టీఆర్ స్టేడియాల్లో వసతుల కల్పన, రూ. 100 కోట్లతో డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణాలు జరగడం విశేషం. ఇలా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి తోడు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. ప్రజలకు పథకాలు అందించడంలోనూ వ్యక్తిగత సమస్యలున్నా స్వయంగా వింటూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా గడప గడపకు జీబీఆర్ పేరిట ఇంటింటికీ వెళ్తూ ప్రజల్లో ఒకడిగా కలిసిపోతున్నారు. ఈ క్రమంలో మరోసారి హ్యాట్రిక్ విజయం సాధించేలా గువ్వల ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. సీఎం కేసీఆర్ సభతో అచ్చంపేటలో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపనుంది. ఈ సభ విజయవంతానికి గువ్వల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. నియోజకవ ర్గం నుంచి దాదాపు లక్ష మంది హాజరు కానుండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చ ర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద సీఎం కేసీఆర్ అచ్చంపేట సభతో నాగర్కర్నూల్ జిల్లా లో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.