మహబూబ్నగర్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పారిశ్రామిక హబ్గా పాలమూరు మారబోతున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రూ.9,500కోట్లతో బ్యాటరీ ఫ్యాక్టరీ వచ్చిందని తెలిపారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని, సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన సభలో మాట్లాడారు. పాలమూరు మరింత అభివృద్ధి సాధించాలన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మీ కండ్ల ముందే ఉన్నదని, కులం, మతం తేడా లేకుండా పథకాలను అందిస్తున్నామని చెప్పారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో అనేక కార్యక్రమాలు జరిగాయన్నారు. ఎంవీఎస్ కళాశాల గ్రౌండ్లో స్పోర్ట్స్ స్టేడియం కావాలని శ్రీనివాస్గౌడ్ అడిగారు.. రేపే జీవో విడుదల చేస్తామని సీఎం వెల్లడించారు. జూన్లో ‘పేట’, గద్వాల మెడికల్ కాలేజీల్లో క్లాసులు ప్రారంభిస్తామన్నారు. నాడు కరువు.. వలసలకు కేరాఫ్గా నిలిచిన పాలమూరు.. తెలంగాణ ఏర్పడ్డాక పసిడి పంటల పాలమూరుగా మారిందని తెలిపారు. సాగునీటి రాకతో ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా పచ్చని పొలాలు.. రైతు ఇంట ధాన్యపు రాశులే దర్శనమిస్తున్నాయని స్పష్టం చేశారు. పాలమూరులో వలసలు నిలిచి.. ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడికి ఉపాధి కోసం వచ్చే వారి సంఖ్య పెరిగిందని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి మరిన్ని పొలాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు.
నారాయణపేట వైపు, మక్తల్వైపు పోయే కాలువలు త్వరలో ప్రారంభం చేసుకోబోతున్నామన్నారు. సంక్షేమంలో తెలంగాణకు ఎవరూ సాటి లేరని పేర్కొన్నారు. ఈ మధ్యనే 300 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు కావడం, 2 వేల ఎకరాల్లో అర్బన్ పార్కు ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటే మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎంతో చిత్తశుద్ధితో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారో అర్థమవుతుందన్నారు. దళితబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు కవిమిత్రులు గోరటివెంకన్న, సాయించంద్ ఇతర రచయితలు పాటలు రాస్తుంటే నేనే రాయమని చెప్పిన.. ‘పల్లెపల్లెల్లో పల్లెర్లు మొలిచే పాలమూరులోనా’.. అని ఆరోజు పాడినం .. ఈరోజు పల్లెర్లు మాయమైనవి.. ముంబయి బస్సులు బంద్ అయిపోతున్నయ్.. వలసపోయిన బిడ్డలంతా వాపసు వస్తున్నరు.. దీనిపై రాయమన్నా అని సీఎం చెప్పారు. తెలంగాణ ఉద్యమం రెండో దఫా ప్రారంభమైన సందర్భంలో నేను పాలమూరు ఎంపీగా ఉంటూ తెలంగాణ సాధించిన విషయం తెలుసన్నారు. ఏనాటికైనా పాలమూరు జిల్లాకే ఆ గౌరవం, కీర్తి దక్కుతుందని సగర్వంగా తెలియజేస్తున్నానని అన్నారు.
ఎమ్మెల్యే ఆలకు అభినందనలు
దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. నియోజకవర్గంలో వాగులపై చెక్డ్యాంలు నిర్మించి జలసిరులను ఆపిన వార్తలను చూసి సంబురపడ్డానని అన్నారు. అందరు ఇలా చెక్డ్యాంలు నిర్మించాలని సూచించారు. ఈ పనులే చేయాలి.. పాలమూరుకు కావాల్సింది ఇదేఅంటు కితాబిచ్చారు. ఉద్యమ సమయంలో తాను, జయశంకర్సారు, లక్ష్మారెడ్డి కలిసి నవాబ్పేట మైసమ్మ అడివిని చూసి ఆశ్చర్యపోయామని గుర్తు చేశారు. చెట్లుకూడా బక్కపడ్డాయి.. అని ఆవేదన చెందామన్నారు. ఈ జిల్లా దుస్థితి చూసి కండ్లళ్ల నీళ్లు పెట్టుకున్నాం.. అని నాటి సంఘటనలను గుర్తుచేసుకున్నారు. కాగా ఉమ్మడి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ఎమ్మెల్యేలకు రూ.15 కోట్ల నియోజకవర్గ నిధులు అందిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. 14 మంది ఎమ్మెల్యేలకు రూ.210 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు.