ఇక జెట్ స్పీడ్తో పాలమూరు ఎత్తిపోతల పనులు జరగనున్నాయి. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో లిఫ్ట్ పనుల పురోగతిపై చర్చించారు. పెండింగ్ పనులు పూర్తి చేసి మూడ్నెళ్లల్లో సాగునీరు అందించాలని ఆదేశించారు. జూలైలోగా కరివెన రిజర్వాయర్కు నీరు చేరాలని, ఆగస్టులోగా ఉదండాపూర్ వరకు పారించాలని స్పష్టం చేశారు. అలాగే ఎంజీకేఎల్ఐ, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులపై సమీక్షించారు.
మహబూబ్నగర్, మే 1 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో చి న్న చిన్న పనులన్నీ పూర్తి చేసి మూడు నెలల్లో నీళ్లు వదలాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సోమవారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(పీఆర్ఎల్ఐ) పనులపై ఉ న్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు కొత్త సచివాలయం సాక్షిగా తీపి కబురు అందించారు. నూతన సచివాలయంలో సీఎం కే సీఆర్ అధ్యక్షతన పీఆర్ఎల్పై మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎత్తిపోతలలో తాగునీటి పనులను కొనసాగించడానికి సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యం లో సమీక్ష నిర్వహించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది.
జూలై వరకు కరివెన రిజర్వాయర్కు, ఆగస్టు వరకు ఉదండాపూర్కు నీటిని ఎత్తిపోయాలని సీఎం ఆదేశించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ జలశయాలకు సంబంధించి మిగిలిన పనులు, పంప్హౌజ్లు, విద్యుత్ సబ్స్టేషన్లు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఒక రిజర్వాయర్ నుంచి మరో జలాశయానికి నీటిని తరలించే కన్వేయర్ సిస్టమ్లో మిగిలిన పనులను కూడా కంప్లీట్ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ పనులకు సంబంధించిన పురోగతిపై కూడా సమీక్షించారు.
మిగిలిన కొద్దిపాటి పనులను జూన్లోగా పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తాగునీటి సరఫరాకు సంబంధించి పనుల పురోగతిపై కూడా మాట్లాడారు. సమావేశంలో మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో స్మితా సబర్వాల్, ఎంపీలు పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాస్రెడ్డి, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఎస్.రాజేందర్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, లక్ష్మారెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, శాట్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు వాసులకు తీపి కబురు..
జిల్లా వాసులు ఎంతగానో ఎదురుచూస్తున్న పీఆర్ఎల్ఐ చివరి దశకు చే రుకున్నది. కొత్త సచివాలయంలో సీ ఎం కేసీఆర్ సమీక్ష జరిపి జిల్లా ప్రజల కు తీపి కబురు అందించారు. మూడు నెలల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీరు కండ్ల ముందు కనిపిస్తుంది. కేంద్రం అడ్డుచెప్పినా.. కృష్ణానదిలో నీటి వాటా తేల్చకున్నా.. ఈ జి ల్లాకు చెందిన సన్నాసులు కోర్టులో కేసులు వేసినా.. సీఎం కేసీఆర్ జిల్లా ప్రజలపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. పాలమూరు-రంగారెడ్డి నీళ్లు పోస్తే వీళ్ల అడ్రస్లు గల్లంతు కావడం ఖాయం.
– లక్ష్మారెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే