ప్రభుత్వం నీటి వనరులను అభివృద్ధి చేస్తున్నది. నీటి లభ్యతను పెంచి చివరి ఆయకట్టుకూ సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టింది. వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్న తరుణంలో మరో భగీరథ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్ చొరవతో వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాల్లో సైతం కృష్ణా జలాలు పారించే పనులు చకచకా సాగుతున్నాయి. రూ.110 కోట్లతో బ్రాంచ్ కెనాల్(వయాడెక్ట్) నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే ఖిల్లాఘణపురం, గోపాల్పేట, అడ్డాకుల, మూసాపేట మండలాల్లోని చెరువులను నింపనున్నారు. ఈ పనులు ఇప్పటికే 80 శాతం పూర్తవగా 25 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. కందూరు పెద్దవాగులోకి నీటిని మళ్లించడంతో మరో 10 వేల ఎకరాలకు సాగునీరు అదనంగా అందనున్నది. ఎట్టకేలకు మంత్రి నిరంజన్రెడ్డి,ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కృషి ఫలించింది.
మహబూబ్నగర్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ మరో భగీరథ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఎంజీకేఎల్ఐ ద్వారా కొల్లాపూర్, నాగర్కర్నూల్, వనపర్తి, అచ్చంపేట, జడ్చర్ల, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు సాగునీరందుతున్నది. అయితే, తాజాగా ఎంజీకేఎల్ఐ ప్రధాన కాల్వకు బ్రాంచ్ కెనాల్ ఏర్పాటు చేయడం ద్వారా వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాలోని మిగిలిన 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుందని బృహత్తర ప్రణాళిక రచించారు. గ్రావిటీ కెనాల్ ద్వారా కృష్ణా జలాలు పారనున్నాయి. సీఎం కేసీఆర్కు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి బ్రాంచ్ కెనాల్ గురించి వివరించడంతో ఇరిగేషన్ అధికారులు రంగంలో దిగి సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ప్రభుత్వం రూ.110 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలోనే అతి తక్కువ ఖర్చుతో దాదాపు 25 వేల ఎకరాలకు సాగునీరందించిన ఘనత దక్కనున్నది. ప్రస్తుతం ఖిల్లాఘణపురం మండలం మానాజిపల్లి వద్ద వయాడెక్ట్ నిర్మిస్తుండగా, పనులు తుది దశకు చేరుకున్నాయి. వయాడెక్ట్ పూర్తయితే వనపర్తి నియోజకవర్గంలోని ఖిల్లాఘణపురం, బుద్ధారం, దేవరక్రద నియెజకవర్గంలోని ముసాపేట, అడ్డాకుల మండలాల్లో అనేక చెరువులను నింపనున్నారు. లింక్ కెనాల్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి.
ఖిల్లాఘణపురం, బుద్ధారం చెరువులు సహజసిద్ధంగా పెద్ద ఆయకట్టు కలిగినవి. వీటిని రిజర్వాయర్లుగా మార్చితే ఏడాది పొడవునా సాగునీరందుతుందని ప్రతిపాదించారు. ఇందుకుగానూ నీటి పారుదల శాఖ అధికారులు సర్వే చేసి నివేదిక ఇచ్చారు. ఈ రెండు చెరువులను సుమారు రూ.85 కోట్లు వెచ్చించి రిజర్వాయర్లుగా మార్చనున్నారు. దీంతో ఆయకట్టు పెరిగి చుట్టుపక్క గ్రామాలకు తాగునీరందే అవకాశం ఉంటుంది. భూగర్భజలాలు కూడా పెరగననున్నాయి. కాగా, దేవరకద్ర నియోజకవర్గంలో భీమా, కోయిల్సాగర్ ఎత్తిపోతలలు, సరళాసాగర్, కోయిల్సాగర్, రామన్పాడ్ ప్రాజెక్టుతోపాటు రెండు ప్రధాన వాగులున్నాయి. వీటితో సాగునీరు పుష్కలంగా ఉన్నది. బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తయితే.. కందూరు వాగులోకి కృష్ణా జలాలు మళ్లించనున్నారు. అక్కడినుంచి చెరువులు, కుంటలు నింపడం వల్ల అదనంగా సాగునీరు లభించి నియోజకవర్గమంతా సస్యశ్యామలం అవుతుంది. అంతేకాక సుమారు 21 చెక్డ్యాంలు నిర్మించి ఒక్కో ఆనకట్ట వద్ద రెండు కిలోమీటర్ల నీరు నిలిచేలా చేస్తున్నారు. మానాజిపేట వద్ద జరుగుతున్న వయాడెక్ట్ పనులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పరిశీలించారు. ఈ పనులు పూర్తయితే ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక జలవనరులు కలిగిన నియోజకవర్గంగా మారనున్నది. రెండుపంటలు పుష్కలంగా పండే ప్రాంతంగా అవతరించనున్నది.
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల ప్రధాన కా ల్వకు లింక్ కెనాల్ ఏర్పాటు చేయడంతో అడ్డాకుల మండలానికి సాగునీరందుతుంది. సుమారు 10 వేల ఎకరాల ఆయకట్టుకు ఢోకా లేకుండాపోతుంది. అనేక చెరువులు నిండనున్నాయి. కందూరు వాగు కూడా జలకళ సంతరించుకుంటుంది. కెనాల్ ద్వారా వచ్చే నీళ్లను వాగులోకి మళ్లించడం వల్ల 10 వేల ఎకరాలు అదనంగా సాగులోకి వస్తాయి. మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి బ్రాంచ్ కెనాల్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్కు విన్నివించాం. రూ.110 కోట్లు విడుదల చేశారు. పనులు త్వరలోనే పూర్తి చేస్తాం.
– ఆల వెంకటేశ్వర్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే