నారాయణపేట, నవంబర్ 3 : కులవృత్తులకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందించిందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్లకు సామాజిక వర్గంలో ఒక ప్రతినిధి అవసరమని, అందుకు అత్యంత యోగ్యత కలిగిన వ్యక్తి ఎర్రశేఖర్ అని తెలిపారు. ఉత్తర తెలంగాణలో ముదిరాజ్ల ప్రతినిధిగా, రాజ్యసభ సభ్యుడిగా బండ్ల ప్రకాశ్ ఉన్నారని, అలాగే దక్షిణ తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ఆ స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ముదిరాజ్పై ఉందన్నారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ మాట్లాడుతూ టికెట్ కేటాయింపు విషయంలో కాంగ్రెస్ పార్టీ తనకు ద్రోహం చేసిందన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత లేదని విమర్శించారు. బీఆర్ఎస్లో ముదిరాజ్లకు సముచిత స్థానం కల్పించారని, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లతో చర్చించి పార్టీలోకి ఆహ్వానించారన్నారు. రానున్న రోజుల్లో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడం జరిగిందన్నారు. పదేండ్లలో సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో అభివృద్ధి జరిగిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ముదిరాజ్ల అభ్యన్నతి కోసం విశేషంగా కృషి చేశారన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ విద్యాసాగర్, మాజీ సర్పంచ్ రవి, జెడ్పీటీసీ అంజిలి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ నాగరాజు, దామరగిద్ద మండల అధ్యక్షుడు ఆశన్న, కృష్ణయ్య, కౌన్సిలర్ గురులింగం, మాజీ కౌన్సిలర్ మారుతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద, నవంబర్ 3 : అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని ఎమ్యెల్యే రాజేందర్రెడ్డి కోరారు. శుక్రవారం మండల కేంద్రంతోపాటు తండా, కంసాన్పల్లిలో ్ల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. మండలంలోని మద్దెలబీడు, గుడిమున్కన్పల్లి, ముస్తాపేట, ఉడ్మల్గిద్ద గ్రామాల్లో కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ భీమయ్యగౌడ్, పీఏసీసీఎస్ అధ్యక్షుడు ఈదప్ప, ఎంపీపీ బక్క నర్సప్ప, వైస్ ఎంపీపీ దామోదర్రెడ్డి, సర్పంచ్ వన్నాడి ఆశమ్మ, మాజీ ఎంపీపీ సువర్ణమ్మ, విద్యావతి తదితరులు పాల్గొన్నారు.