మహబూబ్నగర్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2018 లాగా క్లీన్స్వీప్ చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు అడుగులువేస్తున్నది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇవ్వడంతో క్యాడర్లో జోష్ పెరిగింది. నియోజకవర్గం, గ్రామాలకు వస్తున్న ఎమ్మెల్యేలకు నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దూకుడు పెంచారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ ఆశావహులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. హైదరాబాద్, ఢిల్లీలో మకాం వేసి పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. కాగా, కొడంగల్, గద్వాల, కొల్లాపూర్ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేక నజర్ పెట్టింది. గత ఎన్నికల్లో రేవంత్రెడ్డి, డీకే అరుణ, జూపల్లి కృష్ణారావులను మట్టికరిపించిన వారికే టికెట్లు ఇచ్చింది. అంతేకాకుండా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీశ్రావును
రంగంలోకి దించడంతో కాంగ్రెస్, బీజేపీ ఆశావహులకు ముచ్చెమటలు పడుతున్నాయి.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గులాబీదళం దూకుడు పెంచింది. అన్ని పార్టీల కంటే ముందుగానే టికెట్లు ఖరారు చేసి విపక్షాలకు సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. అభివృద్ధి కార్యక్రమాలతో సిట్టింగులు దూసుకుపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 2018 ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసిన బీఆర్ఎస్ 2023లోనూ అదే సీన్ రిపీట్ అవుతుందని అంచనాలో ఉన్నది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలో టికెట్ల ఖరారు కాక నేతలు తలలు పట్టుకుంటున్నారు. హైదరాబాద్, ఢిల్లీలో మకాం వేసి పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో తమ నేతకు టికెట్ వస్తుందంటే తమ నేతకు వస్తుందని చోటామోటా నేతలు కుస్తీలు పడుతున్నారు. ఈసారి కూడా ఉమ్మడి జిల్లాలో ఆ మూడు స్థానాలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కొడంగల్, గద్వాల, కొల్లాపూర్లో కాంగ్రెస్, బీజేపీకి చెక్ పెట్టేందుకు స్కెచ్ వేశారు. 2018 ఎన్నికల్లో రేవంత్, డీకే అరుణ, జూప ల్లి కృష్ణారావును ఓడించిన హీరోలకే మళ్లీ బీఆర్ఎస్ అధిష్టానం టికెట్లు ఖరారు చేసింది. రేవంత్ను కొడంగల్లో పట్నం నరేందర్రెడ్డి ఓడించగా.. జూపల్లిని కొల్లాపూర్లో బీరం హర్షవర్ధన్రెడ్డి మట్టికరిపించారు. డీకే అరుణను గద్వాలలో బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఘోరంగా ఓడించారు. ఈసారి కూడా ఇదే ప్రత్యర్థులు కావడంతో అందరి చూపు ఆ మూడు నియోజకవర్గాలపై పడింది. ఈ ముగ్గురిని గెలిపించుకునేందుకు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీశ్రావును రంగంలోకి దింపుతున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో దడ మోదలైంది. ఈసారి ఓడిపోతే పదవులతోపాటు రాజకీయ సన్యాసం కూడా తప్పదని కార్యకర్తలు లోలోపల మదన పడుతున్నారు.
అందరి నజర్ ఆ నియోజకవర్గాల పైనే..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతో రాజకీయ వేడి మొదలైంది. విపక్షాలు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటుండగానే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఖంగు తినిపించారు. దీంతో 12 స్థానాల్లో ముఖాముఖి పోటీ ఉండగా.. ఈ మూడు నియోజకవర్గాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. హేమాహేమీలైన నేతలకు చెక్పెట్టేందుకు మళ్లీ ఆ ముగ్గురికే టికెట్ ఖరారు చేశారు. కొడంగల్, గద్వాల, కొల్లాపూర్లో హోరాహోరీగా పోరు ఉండబోతుందని పరిశీలురు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు స్థానాలపైనే ఫోకస్ ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే రేవంత్రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక ఈసారి మళ్లీ కొడంగల్ నుంచే పోటీకి దిగుతున్నారు. ఆయన సొంత జిల్లా కావడంతో ఈసారి కూడా ఇక్కడి నుంచే పోటీచేయాలని భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో రేవంత్రెడ్డి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి కూడా ప్రత్యర్థులు వీళ్లే కావడంతో మళ్లీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. కొల్లాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
ఎన్నికలయ్యాక బీరం కారెక్కడంతో కొల్లాపూర్లో నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతరత్రా ఎన్నికల్లో ఇద్దరు వేర్వేరుగా పోటీ చేయించారు. పార్టీ జూపల్లికి ఎంత స్వేచ్ఛ ఇచ్చినా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి చివరకు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు. దీంతో జూపల్లి కాంగ్రెస్లో చేరి టికెట్ పొంది బరిలో దిగుతున్నారు. అయితే కాంగ్రెస్లో టికెట్ రాకముందు జూపల్లికి పెద్ద ఝలక్ తగిలింది. పార్టీలో రావడానికి కీలకంగా వ్యవహరించిన పీసీసీ రాష్ట్ర కార్యదర్శి రంగినేని అభిలాష్రావుకు జూపల్లి పోకడలు నచ్చక కారెక్కేశారు. దీంతో ఆయన ప్రధాన అనుచరులు కూడా పార్టీలో చేరడం, ఇంకా చాలామంది క్యూ కడుతుండడంతో జూపల్లి పరేషాన్లో పడ్డారు. ఇక గద్వాలలో సొంత అల్లుడి చేతిలో డీకే అరుణ ఘోర పరాజయం పొందింది. దీంతో ఆమె కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరింది. ఆ పార్టీ నుంచి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయింది. ఈసారి బీజేపీ తరఫున గద్వాల నుంచి పోటీ చేస్తుందా? మళ్లీ సొంతగూటికి వెళ్లి పోటీ చేస్తుందా? అనే డైలమాలో ఉన్నది.
2018 సీన్ రిపీట్ అవుతుందా?
బీఆర్ఎస్ గత ఎన్నికల్లో రాజకీయ ఉద్దండులను మ ట్టికరిపించిన హీరోలకే మళ్లీ టికెట్లు కట్టబెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొడంగల్, గద్వాల, కొల్లాపూర్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎట్టిపరిస్థితుల్లో గెలిచి 2018 సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. ఈమేరకు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, జిల్లాకు చెందిన మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక మళ్లీ కొడంగల్ నుంచే పోటీకి దిగుతుండడంతో ఇక్కడ ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. నాలుగున్నరేండ్లుగా బీఆర్ఎస్ అభివృద్ధి మంత్రంతో ముందుకెళ్తోంది. కోస్గిలో ఆర్టీసీ బస్ డిపో, వందపడకల దవాఖాన, కోస్గి, కొడంగల్ను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తోంది. 70 ఏండ్లుగా జరుగని అభివృద్ధిని నాలుగున్నరేండ్లలో చేసి చూపించి అభివృద్ధి మంత్రంతో దూసుకుపోతున్నారు.
అన్ని మండలాలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు బీఆర్ఎస్ వారే ఉన్నారు. రేవంత్ పోకడలు నచ్చక చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీని వదిలివెళ్లారు. ఈసారి హైదరాబాద్, రంగారెడ్డి క్యాడర్ తప్ప లోకల్ క్యాడర్ రేవంత్ వెంట లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి నియెజకవర్గాన్ని పట్టించుకోని రేవంత్కు తగిన బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిస్తున్నారు. కొడంగల్ ఎమ్మెల్యేగా ఉండి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పరువు పోగొట్టుకున్న వ్యక్తికి పట్టం గడతారా? అంటూ విమర్శలు సంధిస్తున్నారు. ఇప్పటికే పట్నం నరేందర్రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ క్యాడర్ను బలోపేతం చేస్తున్నారు. ఈసారి కొడంగల్, గద్వాల, కొల్లాపూర్లో కాంగ్రెస్, బీజేపీ ఓటమే లక్ష్యంగా పార్టీ నేతలు వ్యహాలు రచిస్తుండటంతో రెండు పార్టీల్లో దడ పుడుతోంది.