సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపికబురు అందించారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. సర్కారు విడుదల చేసిన డీఎస్సీ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ జీవో 96 విడుదల చేసింది. టెట్లో క్వాలిఫై అయిన వారు టీఆర్టీకి పోటీపడేందుకు అర్హులు. ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా గతంలో మాదిరిగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వివిధ కేటగిరీల్లో 586 పోస్టులు భర్తీ కానున్నాయి. అయితే, పోస్టులకు సంబంధించి రోస్టర్ పాయింట్లు ఖరారైన తర్వాత నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నది. దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, నిరుద్యోగ అభ్యర్థులు గ్రంథాలయాలు, బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్లో ప్రభుత్వం సమకూర్చిన వసతులు, మెటీరియల్ను సద్వినియోగపర్చుకుంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.
– గద్వాల, ఆగస్టు 27
గద్వాల, ఆగస్టు 27 : డీఎస్సీ రాసే అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జిల్లాల వారీగా ఏఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నా యో ప్రభుత్వం విడుదల చేసింది. డీఎస్సీ పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం తెలుపుతూ జీవో 96 విడుదల చేయడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చా క పెద్ద ఎత్తున కొలువులు భర్తీ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో రెండోసారి డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఇప్పటికే పలు పోటీ పరీక్షలకు ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసి పరీక్షలు నిర్వహించింది. ఎంతోకాలంగా డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు డీఎస్సీ ప్రకటన కోసం ఎదురు చూస్తుండగా ప్రభుత్వం అందించిన తీపి కబురుతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు ఇప్పటికే చాలామంది కోచింగ్కు వెళ్లి పరీక్షకు సన్నద్ధమవుతున్నారు.
కోచింగ్ పూర్తి చేసుకున్న వారు జిల్లా గ్రంథాలయాలు, బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లలో ప్రభుత్వం సమకూర్చిన వసతులు, మెటీరియల్స్ను వినియోగించుకొని పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ పరీక్షకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలో 160 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు అరమార్కు ఉంటుంది. జిల్లాలో పోస్టులకు సంబంధించిన రోస్టర్ పాయింట్లు ఖరారైన తర్వాత భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. దరఖాస్తులు అన్ని ఆన్లైన్లో స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్జీటీకి ఒక రోజు, స్కూల్ అసిస్టెంట్లకు రెండు రోజుల పాటు పరీక్ష నిర్వహించనున్నారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ జాబితాను విడుదల చేయనున్నారు. కలెక్టర్ నేతృత్వంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ పోస్టుల భర్తీ చేపట్టనుంది. టీచర్ పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి తెలుపడంతో జిల్లాలో వివిధ కేటగిరీల్లో 586 పోస్టులు భర్తీ కానున్నాయి.
డీఎస్సీ ప్రకటన కోసం చాలా కాలంగా ఎదురు చూస్తు న్నాం. ఎప్పుడైనా ప్రకటన వస్తుందనే ఆశతో ముందస్తుగానే పరీక్షకు సన్నద్ధమవుతున్నాం. నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని డీఎస్సీ నిర్వహణకు ప్రభు త్వం అనుమతి ఇవ్వడం, ఆర్థికశాఖ ఆమోదం తెలుపడం ఎంతో సంతోషంగా ఉంది. త్వరగా నోటిఫికేషన్ విడుదల చేసి పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం చేస్తే బాగుంటుంది.
– స్వప్న, డీఎస్సీ అభ్యర్థి గద్వాల
ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేయడంతోపాటు జిల్లాల వారీగా ఖాళీలు ప్రకటించి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగులకు ఊరట లభించింది. ప్రభుత్వం డీఎస్సీని ప్రకటిస్తుందని భావించి కొలువు సాధించడమే లక్ష్యంగా ముందుగానే పరీక్షకు సన్నద్ధమవుతున్నాం. డీఎస్సీ ప్రక్రియ ఆలస్యం కాకుండా పరీక్ష నిర్వహణతోపాటు ఎంపిక పక్రియ వేగవంతంగా చేపట్టాలి.
– రాము, డీఎస్సీ అభ్యర్థి